నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట
సాక్షి, బెంగళూరు : వేతన సవరణను అమలు చేయడంతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మెకు దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులతో పాటు దేశ వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగనుంది. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాంకు లావాదేవీలన్నీ పూర్తిగా స్తంభించిపోనున్నాయి.
తద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. 2012 నవంబర్ నుంచి తమకు అందాల్సిన వేతన సవరణను అమలు చేసేందుకు ప్రభుత్వం, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ అంగీకరించని పక్షంలో దేశవ్యాప్తంగా మరోసారి విడతల వారీ పోరాటానికి సన్నద్ధమవుతామని ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మంగళవారమిక్కడ ఓ ప్రకటనలో వెల్లడించింది.