breaking news
Indiabulls
-
మిగిలిన వాటానూ కొంటున్న బ్లాక్స్టోన్!
ముంబై: ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ కమర్షియల్ ప్రొపరీ్టస్లో మిగిలిన 50 శాతం వాటాను బ్లాక్స్టోన్ గ్రూప్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ మేరకు బ్లాక్స్టోన్తో ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీల్ విలువ రూ.4,420 కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి బ్లాక్స్టోన్ కంపెనీ నిరాకరించింది. గత ఏడాది మార్చిలో ఇండియాబుల్స్ కమర్షియల్ ప్రొపరీ్టస్లో 50 శాతం వాటాను బ్లాక్స్టోన్ కంపెనీ రూ.4,750 కోట్లకు కొనుగోలు చేసింది. -
లక్ష్మీ విలాస్ బ్యాంక్.. 'ఇండియాబుల్స్' చేతికి
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగంలో మరో విలీనానికి తెరతీస్తూ గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్)లో విలీనానికి ప్రైవేట్ రంగ లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. ప్రతీ 100 ఎల్వీబీ షేర్లకు (రూ. 10 ముఖవిలువ) ఐహెచ్ఎఫ్ షేర్లు 14 (రూ. 2 ముఖవిలువ) కేటాయించనున్నారు. విలీన సంస్థకు ఇండియాబుల్స్ గ్రూప్ ప్రమోటరు సమీర్ గెహ్లాట్ .. వైస్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఐహెచ్ఎఫ్ ఎండీ గగన్ బంగా, ఎల్వీబీ సీఈవో పార్థసారథి ముఖర్జీ జాయింట్ ఎండీలుగాను, ఐహెచ్ఎఫ్ ఈడీ అజిత్ మిట్టల్.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉంటారు. ఎల్వీబీ, ఐహెచ్ఎఫ్లు శుక్రవారం ఈ విషయాలు వెల్లడించాయి. కార్యకలాపాలు మరింత మెరుగుపర్చుకునేందుకు, కొత్త విభాగాల్లోకి కూడా ప్రవేశించేందుకు ఈ విలీనంతో తోడ్పాటు లభించగలదని ఎల్వీబీ పేర్కొంది. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడంతో పాటు, వ్యాపార పరిమాణాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడగలదని ఐహెచ్ఎఫ్ వివరించింది. విలీనంతో దేశీయంగా వ్యాపార పరిమాణం, లాభదాయకత విషయంలో టాప్ 8 ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటిగా తమది ఆవిర్భవిస్తుందని ఐహెచ్ఎఫ్ పేర్కొంది. రెండు సంస్థల వ్యాపార పరిమాణం ఇలా .. తమిళనాడులోని కరూర్కి చెందిన ఏడుగురు వ్యాపారవేత్తలు స్థానిక ప్రజల ఆర్థిక అవసరాల కోసం 1926లో లక్ష్మీ విలాస్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం.. ఎల్వీబీ డిపాజిట్లు రూ. 30,787 కోట్లు కాగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 24,123 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలానికి రూ. 630 కోట్ల నష్టం నమోదు చేసింది. స్థూల మొండిబాకీలు 13.9% నికర మొండిబాకీలు 7.6%గా ఉన్నాయి. దాదాపు 21.86 లక్షల ఖాతాదారులు, 4,881 మంది ఉద్యోగులు ఉండగా, దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 150 పట్టణాల్లో 569 శాఖలు ఉన్నాయి. మరోవైపు, ఇండియాబుల్స్ గ్రూప్లో భాగమైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నికర విలువ ప్రస్తుతం రూ. 17,792 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు రూ. 3,084 కోట్ల లాభాలు ఆర్జించింది. స్థూల నిరర్థక ఆస్తులు 0.79%, నికర నిరర్థక ఆస్తులు 0.59%గా ఉంది. గృహ రుణాల మార్కెట్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో కార్యకలాపాలతో ఇప్పటిదాకా మొత్తం రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసింది. విలీనానంతరం 40వేల కోట్ల మార్కెట్ క్యాప్ .. గతేడాది డిసెంబర్ చివరి నాటికి విలీన సంస్థ నికర విలువ రూ. 19,472 కోట్లుగాను, లోన్ బుక్ దాదాపు రూ. 1,23,393 కోట్లుగానూ ఉంటుంది. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 20.6 శాతంగా ఉండనుంది. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఇది 10.875 శాతంగా ఉంటే సరిపోతుంది. అటు స్థూల మొండిబాకీలు 3.5 శాతానికి, నికర ఎన్పీఏలు 2 శాతానికి పరిమితం అవుతాయి. 800 శాఖలు, 14,302 మంది ఉద్యోగులు ఉండనున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంటుందని గగన్ బంగా తెలిపారు. విలీనానికి కారణాలు.. ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్అండ్ఎఫ్ఎస్ వరుసగా రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన ప్రభావంతో 2018 సెప్టెంబర్లో ఆర్థిక మార్కెట్లు అస్తవ్యస్తంగా మారినప్పట్నుంచి ఐహెచ్ఎఫ్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు నిధుల సమీకరణ కష్టతరంగా మారింది. డిసెంబర్ క్వార్టర్లో ఐహెచ్ఎఫ్ రుణాల మంజూరీ అంతక్రితం త్రై మాసికంతో పోలిస్తే 65% పడిపోయింది. మార్చి క్వార్టర్లో కాస్త మెరుగుపడినప్పటికీ.. సాధారణ స్థాయికన్నా తక్కు వే ఉంటోంది. సంక్షోభం రాకముందు ప్రతి క్వార్టర్లో ఐహెచ్ఎఫ్ సుమారు రూ. 10,000 కోట్ల మేర రుణా లు మంజూ రు చేసేది. ఇది గణనీయంగా తగ్గింది. నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిపోయాయి. మరోవైపు, ఎల్వీబీ మొండిబాకీలు ఏకంగా 13.95 శాతానికి పెరిగిపోగా, క్యాపిటల్ అడెక్వసీ రేషియో నియంత్రణ సంస్థ నిర్దేశిత స్థాయికన్నా తక్కువగా 7.57 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో విలీనంతో ఇరు సంస్థలకు లబ్ధి చేకూరగలదని అంచనా. విలీన వార్తలతో శుక్రవారం బీఎస్ఈలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేరు సుమారు 5 శాతం పెరిగి రూ. 92.75 వద్ద క్లోజయ్యింది. అటు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు దాదాపు అరశాతం పెరిగి రూ. 903.15 వద్ద ముగిసింది. ఇరు సంస్థలకు ప్రయోజనాలేంటంటే.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్) నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. అలాగే ఆస్తులు, అప్పుల మధ్య భారీ వ్యత్యాసాల సమస్య పరిష్కారమవుతుంది. ఇక, ఇతరత్రా రిటైల్ బ్యాంకింగ్ పథకాలను ప్రవేశపెట్టేందుకు కూడా సాధ్యపడుతుంది. ఐబీహెచ్ ప్రధానంగా పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఎల్వీబీ దక్షిణాదిలో ఎక్కువగా విస్తరించి ఉంది. దీంతో ఈ విలీనం ద్వారా ఐబీహెచ్ దక్షిణాదిలో కూడా కార్యకలాపాలు విస్తరించడానికి వీలుపడనుంది. మరోవైపు లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) విషయానికొస్తే.. విలీనంతో క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి మెరుగుపడటంతో పాటు వ్యాపార పరిమాణం కూడా పెరుగుతుంది. అటు వ్యాపార వృద్ధికి మరిన్ని పెట్టుబడులు లభిస్తాయి. అటు క్లయింట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. ఆర్బీఐ అనుమతులు కీలకం.. ఈ విలీన ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి విలీనాల్లో బ్యాంకు లైసెన్సును వేరే సంస్థకు బదలాయించేందుకు ఆర్బీఐ అంగీకరించదని, కాబట్టి లైసెన్సు ఎల్వీబీ పేరు మీదే కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. విలీనానంతరం ఏర్పడే సంస్థలో ఐహెచ్ఎఫ్ ప్రమోటర్లకు 19.5% వాటాలు ఉంటాయి. ప్రస్తుతం వారికి ఐహెచ్ఎఫ్లో 21.6% వాటాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం బ్యాంకులో ప్రమోటర్లు పది శాతానికి మించి వాటాలు ఉంచుకునేందుకు ఆర్బీఐ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియాబుల్స్ గ్రూప్ అటు రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు కూడా సాగిస్తున్న నేపథ్యంలో రియల్టీ, బ్యాంకింగ్ వ్యాపారాల విలీనానికి ఆర్బీఐ ఎలా స్పందిస్తుందన్నది కూడా చూడాల్సిన విషయమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి డీల్స్పై ఆర్బీఐ అంత సానుకూలత చూపలేదని వారు పేర్కొన్నారు. అటు షేర్హోల్డర్లతో పాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మొదలైన నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుందని గగన్ బంగా చెప్పారు. -
నవంబర్ 30 కల్లా ఖాళీ చేయండి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్, సరోజినీదేవి రోడ్డులోని డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి, ఇండియాబుల్స్కు స్వాధీనం చేయాలంటూ డెక్కన్ క్రానికల్ (డీసీ) యాజమాన్యాన్ని ఆదేశిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) కోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. సీఎంఎం కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ డీసీ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ భవనంలో డీసీ పత్రిక నిర్వహణ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో తక్షణమే భవనాన్ని ఖాళీ చేయాలం టే ఇబ్బందులు ఎదురవుతాయన్న హైకోర్టు, ఖాళీ చేసేందుకు నవంబర్ 30 వరకు డీసీ యాజమాన్యానికి గడువునిచ్చింది. ఆలోపు భవనాన్ని ఖాళీ చేయకుండా భవనం స్వాధీనం నిమిత్తం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని ఇండియాబుల్స్కు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. భవనాన్ని తాకట్టుపెట్టి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి డీసీ యాజమాన్యం రూ.100 కోట్ల రుణం తీసుకుంది. అయితే ఈ అప్పును డీసీహెచ్ఎస్ యాజమాన్యం తిరిగి చెల్లించకపోవడంతో తాకట్టుపెట్టిన భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సీఎంఎం కోర్టు ఇండియాబుల్స్కు అనుమతిచ్చింది. దీనిని సవాలు చేస్తూ డీసీహెచ్ఎల్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో డీసీహెచ్ఎల్ దివాలా ప్రక్రియ కొనసాగుతోందని, అందువల్ల సీఎంఎం కోర్టు ఆదేశాలు చెల్లవన్న డీసీ యాజమాన్యం వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్సీఎల్టీలో విచారణ డీసీహెచ్ఎల్పై జరుగుతోందని, ఇండియాబుల్స్కు తాకట్టుపెట్టిన భవనం వెంకట్రామిరెడ్డి పేరు మీద ఉందని, అందువల్ల ఎన్సీఎల్టీ ఉత్తర్వులు ఆ ఆస్తికి వర్తించవని ధర్మాసనం తెలిపింది. సర్ఫేసీ చట్టం కంపెనీలకే తప్ప వ్యవస్థాపకులకు కాదంది. -
బ్లాక్స్టోన్ చేతికి ఇండియాబుల్స్ చెన్నై ప్రాపర్టీ
న్యూఢిల్లీ: ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ చెన్నైలోని ఆఫీస్ ప్రాపర్టీని అంతర్జాతీయ ఇన్వెస్టర్ బ్లాక్స్టోన్కు విక్రయించింది. వాణిజ్య ఆస్తుల విక్రయంలో భాగంగా చెన్నైలోని అంబత్తూర్లోని ఈ ప్రాపర్టీని విక్రయించినట్లు ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.850 కోట్లని, వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 కల్లా పూర్తవుతుందని పేర్కొంది. 1.9 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్తో కూడిన చెన్నైలోని ఈ ‘వన్ ఇండియాబుల్స్ పార్క్’ దాదాపు పూర్తయిందని, వార్షికంగా రూ.85 కోట్ల అద్దె ఆదాయం లభిస్తుందని వివరించింది. ఈ కంపెనీ ఈ ఏడాది మార్చిలో ముంబైలోని రెండు ప్రధాన వాణిజ్య ఆస్తుల్లో 50 శాతం వాటాను ఇదే సంస్థలకు రూ.3,750 కోట్లకు విక్రయించింది. అమెరికాకు చెందిన బ్లాక్స్టోన్ సంస్థ నేరుగా, జాయింట్ వెంచర్ భాగస్వామి ఎంబసీ గ్రూప్తో కలసి భారత్లోని ప్రధాన నగరాల్లో మొత్తం 6 కోట్ల చదరపుటడుగుల వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేసింది. -
రుణానికి బ్యాంకుకెళ్లటం ఎందుకు?
బ్యాంక్బజార్.కామ్, పైసాబజార్.కామ్, అప్నాపైసా.కామ్, క్రెడిలా.కామ్... ఇంకా చాలా. గృహ రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం పాత మాట. ఇపుడు దాదాపు ప్రతి బ్యాంకూ, ప్రతి ఆర్థిక సంస్థా ఆన్లైన్ రుణ సేవలందిస్తున్నాయి. దేనికైనా ఆన్లైన్లో దరఖాస్తు నింపితే చాలు. బ్యాంకు ప్రతినిధులే దరఖాస్తుదారు దగ్గరకొచ్చి పత్రాలన్నీ తీసుకుని ప్రాసెసింగ్ చేస్తారు. ఇవి కాక బ్యాంక్బజార్, పైసా బజార్, క్రెడిలా వంటి సంస్థల సైట్లను ఆశ్రయిస్తే మాత్రం... లోన్ కాలిక్యులేటర్ నుంచి, వివిధ బ్యాంకుల వాయిదాలను సరిపోల్చుకోవటం, అన్నిటినీ పరిశీలించాక ఏది నప్పుతుందో చూసుకోవటం కుదురుతుంది. అంతేకాదు! మీ వివరాలు నింపితే... మీకు రుణం ఎంత వస్తుంది? ఎన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది? తదితర వివరాలన్నీ తెలిసిపోతాయి. అన్నీ చూసుకున్నాక... ఈ సంస్థల ద్వారా దరఖాస్తు నింపితే ఇవే మనం ఎంచుకున్న ఆర్థిక సంస్థ లేదా బ్యాంకుకు దరఖాస్తును పంపిస్తాయి. హోమ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్, హౌసింగ్ లోన్ కాలిక్యులేటర్, హోమ్ లోన్ ఎలిజిబిలిటీ, మైఈఎంఐ వంటి ఫీచర్లను ఇవి అందిస్తున్నాయి.ఇవన్నీ నచ్చని వారు... ఆన్లైన్లో కేవలం తమ పేరు, ఫోన్నెంబరు, ఈ-మెయిల్ ఇస్తే చాలు. ఆయా సంస్థల ప్రతినిధులే ఫోన్లు చేసి... మీ దగ్గరకొచ్చి మరీ దరఖాస్తు తీసుకెళతారు. వారే బ్యాంకు ద్వారా ప్రాసెస్ చేయిస్తారు. బ్యాంకుల యాప్ల ద్వారా... ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఇండియాబుల్స్ హోమ్లోన్స్ తదితర సంస్థలు సొంత యాప్లను విడుదల చేశాయి. వీటిద్వారా వడ్డీరేట్లు తెలుసుకోవటమే కాదు. నెలవారీ వాయిదాలు కూడా ఆన్లైన్ బ్యాంకింగ్లో చెల్లించొచ్చు. మీ దగ్గర్లోని బ్రాంచి చిరునామా తెలుసుకోవచ్చు.