breaking news
IIT Training Centre
-
సర్కార్బడిలో ఐఐటీ పాఠాలు
సిరిసిల్ల కల్చరల్: డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్న అధునాతన సాంకేతిక కోర్సులు సర్కార్ బడి విద్యార్థులకు కూడా చేరువ కానున్నాయి. దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్ తన సాంకేతిక కోర్సుల విస్తరణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెప్పనుంది. స్థానిక గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యాధునిక సాంకేతిక కోర్సుల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచి్చంది.ఆన్లైన్ విధానంలో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐఐటీ మద్రాస్ లేఖ రాసింది. స్కూల్ కనెక్ట్లో భాగంగా ఐఐటీ మద్రాస్ సిరిసిల్లలోని రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో భాగస్వామ్యమైంది. ఈ–మెయిల్ ద్వారా ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేఖలు పంపింది. ఐఐటీ మద్రాస్, సెంటర్ ఫర్ ఔట్రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శివనగర్, గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకుంది. ఇవీ కోర్సులు.. డేటా సైన్స్ అండ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంజినీరింగ్, బయోలాజికల్ సిస్టమ్స్, మేథ్స్ అన్ప్లగ్డ్ గేమ్స్ అండ్ పజిల్స్, పర్యావరణం, ఫన్ విత్ మేథ్స్ అండ్ కంప్యూటింగ్, లా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, హ్యుమానిటీస్ వంటి పది కోర్సులను రెండు నెలలపాటు బోధిస్తారు. ముందుగానే చిత్రీకరించిన వీడియోలను ప్రతి సోమవారం పోర్టల్లో ఉంచుతారు. ఐఐటీ ప్రొఫెసర్లతో ప్రతి శనివారం ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల సందేహాలను వారు నివృత్తి చేస్తారు. ఫలితంగా ఆయా కోర్సుల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటారు.విద్యార్థులకు విస్తృత ప్రయోజనాలు ఐఐటీ మద్రాస్తో అనుసంధానానికి ఎంపికవడం వ్యక్తిగతంగా సంతోషంగా ఉంది. ఇది మా పాఠశాల విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుంది. అత్యాధునిక కోర్సుల మౌలికాంశాలపై శిక్షణ పిల్లల కెరీర్ నిర్మాణానికి ఉపకరిస్తుంది. డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్తతరం సాంకేతికతల్లో సర్కార్ బడి పిల్లలు సత్తా చాటుతారు. – చకినాల శ్రీనివాస్, శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుపేద బిడ్డలకు టెక్నాలజీ చేరువవుతుంది ప్రభుత్వ బడిలో చదివే పేద విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేసేందుకు ఈ స్కూల్ కనెక్ట్ ఉపయోగపడుతుంది. ఐఐటీ మద్రాస్ తరగతులతోపాటు అక్కడి ప్రొఫెసర్లతో నేరుగా సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించడం విద్యార్థులకు వరంగా భావించాలి. ఇంజినీరింగ్ కోర్సుల్లో మాత్రమే లభ్యమయ్యే అంశాలను పాఠశాల స్థాయిలోనే నేర్చుకునే అరుదైన అవకాశం ఇది. – లోకిని శారద, హెచ్ఎం, గీతానగర్ జెడ్పీ హైస్కూల్ -
ముంగిట్లోనే ఉన్నత విద్య
నిజామాబాద్అర్బన్, న్యూస్లైన్ : జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తోంది. వ్యయప్రయాసలకోర్చి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఒకప్పుడు ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లాలోనే ఆ కోర్సులకు సంబంధించిన కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఆరు పీజీ కళాశాలు, ఐదు ఇంజినీరింగ్ కళాశాలలు, ఓ మెడికల్ కళాశాల, 24 డిగ్రీ కళాశాలలు, 10 బీఈడీ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా వేలాది మంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. అయితే ఉన్నత విద్యకు సంబంధించి చాలా కోర్సులు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇతర పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లలేనివారు విద్యకు పుల్స్టాప్ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో జిల్లాకు పలు ఉన్నత విద్య కోర్సులు వస్తాయని విద్యాభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరైంది. ప్రస్తుతం ఏర్పాటు దశలో ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాకు మరిన్ని విద్యాసంస్థలు, కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశాలుంటాయి. గతేడాది మెడికల్ కళాశాల వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీలో ప్రస్తుతం 22 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి సంఖ్య సమీప భవిష్యత్లో మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నూతన ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని విద్యాభిమానులు భావిస్తున్నారు. ఐఐటీ మెయిన్స్ వెలుగులు జిల్లాకు చెందిన విద్యార్థులు గతంలో ఇంటర్తో పాటు ఎంసెట్, ఐఐటీ, ఇంజినీరింగ్ కోర్సులలో నాణ్యమైన శిక్షణ కొరకు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవలి కాలంలో జిల్లాలో పలు విద్యాసంస్థలు నెలకొన్నాయి. నాణ్యమైన విద్య అందిస్తుండడంతో ఇక్కడే విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ఏటా 28 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ఆరు వేల మంది ఎంసెట్కు, 11 వేల మంది ఇంజినీరింగ్ శిక్షణవైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది ఐఐటీ తదితర కోర్సులు, చాలా మంది డిగ్రీవైపు చూస్తున్నారు. దీంతో పలు కళాశాలలు ఎంసెట్ తదితర కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోనూ ఐఐటీ శిక్షణ కేంద్రం అందుబాటులో ఉంది. కాకతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్నవారు ఉన్నత శిఖరాలకు బాటలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏకంగా 16 మంది విద్యార్థులు ఐఐటీ మెయిన్స్కు అర్హత సాధించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో మరిన్ని శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని విద్యాభిమానులు భావిస్తున్నారు.