breaking news
govenrment schools
-
అంధుల పాఠశాలలో ప్రవేశాలు.. సదరం సర్టిఫికెట్ తప్పనిసరి
కడప ఎడ్యుకేషన్: కడప శంకరాపురంలోని అంధుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో చేరే బాల, బాలికలకు ఉచితంగా చదువు చెప్పడమే కాకుండా.. ప్రత్యేక హాస్టల్ వసతి కూడా కల్పిస్తారు. ఈ పాఠశాలలో ఏపీతో పాటు తెలంగాణకు చెందిన వారు కూడా చేరవచ్చు. ఆసక్తి ఉన్నవారు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.శంకరయ్య సూచించారు. దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా సదరం మెడికల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు మూడు ఫోటోలను జతచేసి దరఖాస్తు చేయాలని సూచించారు. పది ఫలితాల్లో ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9291306870, 9494077761 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
చికెన్ లేదు.. గుడ్డూ లేదు
వసతిగృహ విద్యార్థుల్లో కొత్త మెనూ కర్రీల అమలు వర్రీగా మారింది. కొత్త మెనూ ప్రకటించినా..అందుకనుగుణంగా మెస్ చార్జీలు లేకపోవడంతో మెనూకు కొర్రీ పడింది. హాస్టళ్లలో విద్యార్థులకు ఇంటి తరహా భోజనం పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. వారానికి రెండు రోజులు చికెన్, రోజూ పాలు, గుడ్లు సంతృప్తికరమైన అల్పాహారం పెట్టాలని చెప్పింది. అయితే అది అమలుకు నోచుకోకపోవడంతో ప్రకటనకే పరిమితమైంది. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, టమాటా సాంబారు, రసాలతో పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నెల్లూరు రూరల్: వసతిగృహాల్లో కొత్త మెనూ అమలు కాకుండానే మంగళం పాడేశారు. జూలై 1వ తేదీ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్తో పాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ స్కూళ్లు, చిల్డ్రన్స్ హోంలు, ఆనందనిలయాల్లో వారానికి రెండు రోజులు చికెన్, రోజూ పాలు, గుడ్లు సంతృప్తికరమైన అల్పాహారం పెట్టాలంటూ కొత్త మెనూ చార్ట్ను ప్రభుత్వం విడుదల చేసింది. అందు కోసం విద్యార్థులకు మెనూ చార్జీలను కూడా స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పోల్చితే మెస్ చార్జీలు నామమాత్రమే పెరిగాయని, దీనికి తోడు మారిన మెనూ ప్రకారం భోజనం పెట్టలేమని బోలెడంత ఖర్చు అవుతుందని వార్డెన్లు చేతులెత్తేశారు. కోడికూరతో మంచి భోజనం చేయొచ్చని ఆశపడిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. సొంత లాభం చూసుకుంటూ వార్డెన్లు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మెనూ అమలు చేయకుండా పేద విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారు. బిల్లులు మాత్రం కొత్త మెనూ ప్రకారం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెనూ అమలులో సందిగ్ధం జిల్లాలో ఎస్సీ ఎస్టీ, బీసీ హాస్టళ్లు 189 ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరందరికీ కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సి ఉంది. మారిన మెనూ ప్రకారం వారానికి రెండు సార్లు కోడికూర, ప్రతి రోజూ పాలు, గుడ్లు, మారిన అల్పాహారంలో పూరీ, ఇడ్లీ పెట్టాలని కొత్త మెనూను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. గతంలో ఇచ్చే మెస్ చార్జీలను కళాశాల వసతి గృహాలకు రూ.350, 8, 9, 10 తరగతులకు రూ.400, 3 నుంచి 7వ తరగతి వరకు రూ.250 పెంచింది. స్కేల్ ఆఫ్ రేషన్ ఇచ్చినా ధరలు మాత్రం ఇవ్వకపోవడంతో తామేంచేయాలో అర్థం కావడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలతో పోల్చితే ఒక్కో విద్యార్థిపై రూ.40పైగా అదనంగా భరించాల్సి వస్తుందని వార్డెన్ల వాదన. ధరలు ప్రకటించరేం? మెనూ చార్జీ ప్రకారం ఎంతెంత ధరల్లో కొనుగోలు చేయాలోనన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పడం లేదని వార్డెన్లు చెబుతున్నారు. గతంలో ఉన్న మెనూకు అదనంగా పాలు, పెసరపప్పు, పొంగల్, చికెన్, వేరుశనగ ఉండలు, చెట్నీ, పూరీ, బఠానీ, బంగాళదుంప కుర్మా వంటివి చేర్చారు. కానీ ఈ సరుకులను ఏ ధర పెట్టి కొనుగోలు చేయాలన్న విషయాన్ని తేల్చలేదని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.70పైగా అవుతుందని, ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఎంత ఉంటాయోనన్న ఆందోళనలో వార్డెన్లు ఉన్నారు. గురుకులాల్లో అయితే మధ్నాహ్న భోజన పథకం ఉండదు కాబట్టి వీటికి ఇంకా అదనపు ఖర్చు అవుతుందని, కొత్త మెనూ ప్రకారం భోజనం పెట్టాలేమని చేతులెత్తేస్తున్నారు. సమస్యలు తీర్చకుండానే.. ప్రస్తుతం జిల్లాలో ఉన్న వసతిగృహాల్లో చాలా చోట్ల ప్లేట్లు లేవు. ఒక్కో వసతిగృహంలో వందకుపైగా విద్యార్థులు ఉన్నా అందుకు తగ్గ సిబ్బంది లేరు. మరో పక్క వాచ్మన్లు, సహాయకులు, వంట మనుషులు కూడా పూర్తిస్థాయిలో నియమించలేదు. చాలాచోట్ల చాలీచాలని గదుల్లో విద్యార్థులు మగ్గుతున్నారు. ఇన్ని సమస్యలున్నా పట్టించుకోని ప్రభుత్వం అరకొరగా మెస్ చార్జీలు భారీగా పెంచామని ప్రచారం చేసుకుంటుంది. వాటిని అమలు చేసేందుకు వార్డెన్లు అవస్థలు పడుతున్నారు. పెంచడం సరే ధరలెలా? మెనూ చార్జీలు ఇప్పుడు అమలు అయ్యే పరిస్థితి లేదు. మాకు నిర్దిష్టమైన సమాచారం లేదు. ఏ ఐటమ్ ఎంత రేటుకు, ఎన్ని గ్రాములు పెట్టాలనేది స్పష్టత లేదు. ఈ విషయమై రాష్ట్ర డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిని విన్నవించాం. ఇంత వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఇప్పుడు ఒక్కో విద్యార్థికి రూ.25లకు పైగా అదనంగా ఖర్చు అవుతోంది. ప్రభుత్వం పెట్టే ధరలెలా ఉంటాయో దానిపై అమలు ఆధారపడి ఉంటుంది. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. – ఈ.విజయకుమార్ , ఏపీ హాస్టల్ వెల్ఫేర్ అఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
పాఠ‘శాలసిద్ధి’
జగదేవ్పూర్(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలైనా, ప్రైవేట్దైనా కావాల్సినవి వసతులు, వనరులు. ఈ విషయంలో తేడాలొస్తే ఇబ్బంది పడేది విద్యార్థులే. దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో వనరుల వినియోగం ఒకేలా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల శాఖ ‘శాలసిద్ధి’ కార్యక్రమం చేపట్టింది. దేశంలోని అన్ని పీఎస్లు, యూపీఎస్లు, హైస్కూళ్ల సమగ్ర స్వరూపం క్షణాల్లో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. త్వరలో దీన్ని ప్రైవేట్ పాఠశాలలకూ వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పాఠశాలల సమగ్ర అభివృద్ధి పథకాన్నే ఆంగ్ల అక్షర క్రమంలో సంక్లిప్తంగా ‘శాలసిద్ధి’ అని పిలుస్తున్నారు. పథకంలో భాగంగా పాఠశాలల హెచ్ఎంలు శాలసిద్ధి ఆన్లైన్ పోర్టల్లో తొలుత యూపీఎస్లు, హైస్కూళ్ల సమగ్ర సమాచారాన్ని అప్లోడ్ చేయాలి. ఇందుకోసం స్కూల్ యూడైస్ కోడ్ ప్రకారం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. శాలసిద్ధిలో వివరాలు అప్లోడ్ చేయడానికి ఇప్పటికే హెచ్ఎంలకు శిక్షణనిచ్చారు. ఇదే పనిలో హెచ్ఎంలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రాథమిక పాఠశాల సమాచారం కూడా అప్లోడ్ చేస్తున్నారు. నివేదికపై కేంద్ర బృందం ప్రత్యేక పరిశీలన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో వివరాలు పంపిన తర్వాత ఆ నివేదికలను జాతీయస్థాయిలో పరిశీలిస్తారు. వాస్తవాలపై ఆరా తీసేందుకు కేంద్ర బృందం ప్రత్యేక పరిశీలనకు వస్తుంది. పాఠశాలలో వనరుల వినియోగం ఒకేలా ఉండాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం శాలసిద్ధి కార్యక్రమం చేపట్టింది. అన్ని రాష్ట్రాల్లోని పీఎస్, యూపీఎస్, హైస్కూళ్ల స్థితిగతులు, వనరులపై అంచనాకు వచ్చేందుకు ఈ వివరాల సేకరణ దోహదం చేస్తుంది. నిధుల మంజూరుకు సమాచారమే ప్రామాణికం శాలసిద్ధి ద్వారా ప్రతి పాఠశాల పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో ఇక ఏ పాఠశాల సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. అప్పుడే వసతులు, వనరులు, సమస్యలు, అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుంది. భవిష్యత్లో పాఠశాలల అవసరాల మేరకు ప్రభుత్వం నిధుల మంజూరుకు ఈ సమాచారం దోహదపడుతుంది. – ఉదయ్భాస్కర్రెడ్డి, ఎంఈఓ -
హేతుబద్దీకరణ అంటే స్కూళ్లను మూసివేయటం కాదు
-
' హేతుబద్దీకరణ అంటే స్కూళ్లను మూసివేయటం కాదు'
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ హేతుబద్దీకరణ అంటే స్కూళ్లను మూసివేయటం కాదని అన్నారు. విద్యార్థులు లేని పాఠశాలలను కిలోమీటర్ పరిధిలోని వేరొక పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. అలాగే అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను అదే మండలంలోని పాఠశాలలకు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం కూడా హేతుబద్దీకరణను చేపట్టిందని, మంచి కార్యక్రమం కాబట్టే తాము కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మూడేళ్ల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించే అంశం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.