నగల కోసం వృద్ధురాలి హత్య
తిరుపతి క్రైం: తిరుపతిలో ఆదివారం రాత్రి నగల కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నగరంలోని అరవపల్లె వీధిలో నివాసం ఉంటున్న కె.లక్ష్మమ్మ (67) టీటీడీలో పనిచేసి రిటైరయ్యారు. సోమవారం ఉదయం ఆమె మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం రాత్రి లక్ష్మమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఆమె గొంతు నులిమి, అనంతరం దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.అనంతరం ఆమె వద్ద ఉన్న 100 గ్రాములకుపైగా బంగారు నగలను దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. వెస్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. మృతురాలి చిన్న కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో మృతురాలి సొంత మనవడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.