breaking news
Global rating agency Standard & Poors
-
భారత్ వృద్ధికి ఢోకా లేదు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుతం మందగమనంలో కొనసాగుతున్నా... దేశ ఆర్థిక మూలాల పటిష్టతపై విశ్వాసాన్ని గ్లోబల్ దిగ్గజ రేటింగ్ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. దీర్ఘకాలికంగా చూస్తే, భారత్ ఆర్థిక వృద్ధి క్రమంగా పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న వ్యవస్థాగత సంస్కరణలు, ద్రవ్య, పరపతి, విధాన నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2020–2021లో దేశ వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. 2021–2022లో ఈ రేటు 7 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 7.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. ఈ అంచనాల నేపథ్యంలో దీర్ఘకాలికంగా భారత్ సార్వభౌమ రేటింగ్ను స్టేబుల్ అవుట్లుక్తో ‘బీబీబీ–’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక కంపెనీ లేక దేశం తన ద్రవ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలదని ‘బీబీబీ’ రేటింగ్ సూచిస్తుంది. ఎస్అండ్పీ ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను చూస్తే... ► ఇటీవలి త్రైమాసికాల్లో భారత్ ఆర్థిక వృద్ధి బలహీన ధోరణిని ప్రదర్శిస్తోంది. అయితే దేశ వ్యవస్థాగత వృద్ధి పనితీరు పటిష్టంగా, చెక్కుచెదరకుండా ఉంది. దీనివల్ల వాస్తవిక (ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని) జీడీపీ వృద్ధి క్రమంగా రెండు మూడేళ్లలో రికవరీ చెందుతుందని భావిస్తున్నాం. ► తోటి వర్థమాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చిచూస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ పనితీరు రానున్న కాలంలో మెరుగ్గానే కొనసాగుతుంది. ► తగిన ద్రవ్య, పరపతి విధానాలు, సైక్లికల్ ఫ్యాక్టర్స్ (తప్పనిసరిగా తిరిగి మెరుగుపడే కొన్ని అంశాలు), సానుకూల వ్యవస్థాగత అంశాలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దోహదపడతాయి. విదేశీ మారకద్రవ్య నిల్వల పరిస్థితి మెరుగ్గా ఉండడం ఇక్కడ గమనార్హం. ► జనాభాలో యువత అధికంగా ఉండడం, పోటీపూర్వక కార్మిక వ్యయాలు, సానుకూల కార్పొరేట్ పన్ను విధానాల వంటి అంశాలను వ్యవస్థాగతంగా భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైనవిగా పేర్కొనవచ్చు. 2020–2024లో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు సగటు 7.1 శాతంగా ఉంటుందన్నది విశ్లేషణ. ► అయితే భారత్ ద్రవ్య పరిస్థితులు ఇంకా కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ముఖ్యంగా ద్రవ్యలోటు ప్రభుత్వ ప్రణాళికలను దాటిపోయింది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో దీని కట్టడి కొంత పరిమితంగానే ఉండే వీలుంది. అయితే ఆయా అంశాల్లో భారత్ పురోగతి సాధించగలిగితే, రేటింగ్ పెరిగే అవకాశాలూ ఉంటాయి. వృద్ధి, ద్రవ్యలోటు వంటి అంశాల్లో తన అంచనాలు విఫలమైతే, రేటింగ్ మరింత కోతకు కూడా వీలుంటుంది. ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల బలహీన పరిస్థితులు వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేటు వినియోగాన్ని కట్టడి చేసే వీలుంది. ► జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన అంచనాల ప్రకారం– 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 5 శాతం. అయితే 2020–21లో ఈ రేటు 6 శాతంగా ఉండే వీలుందని ఎన్ఎస్ఓ పేర్కొంది. దీనికి సరిసమానంగా ఎస్అండ్పీ అంచనాలు కూడా ఉండడం గమనార్హం. -
మరో 12 నెలలు...పెట్టుబడులకు గడ్డుకాలమే!
న్యూఢిల్లీ: భారత్లో కంపెనీల పెట్టుబడి వ్యయాలు జోరందుకోవడానికి(రికవరీ) మరో 12 నెలల వ్యవధి పట్టొచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) అభిప్రాయపడింది. ప్రధానంగా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు వేచిచూసే ధోరణితో ఉండటమే దీనికి కారణమని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ‘రానున్న 2015-16 ఆర్థిక సంవత్సరంలో కూడా పెట్టుబడి వ్యయాల క్షీణత కొనసాగనుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అంత్యంత ప్రకాశవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తున్నప్పటికీ ఈ ప్రతికూల ధోరణి కనబడుతోంది. దేశీ కార్పొరేట్లు కొత్త ప్రాజెక్టులకు ముందుకురావడం లేదు. ముందుగా తమ రుణ భారాన్ని తగ్గించుకొని.. లాభాలను పెంచుకోవడంపై అధికంగా దృష్టిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భార త్లో పెట్టుబడుల రికవరీకి ఏడాది కాలం పడుతుం దని భావిస్తున్నాం’ అని ఎస్అండ్పీ వివరించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అగ్రగామి 10 కంపెనీల పెట్టుబడి వ్యయాలు రూ.3.7 లక్షల గరిష్టస్థాయిని తాకాయని నివేదిక పేర్కొంది. తర్వాత రెండేళ్లలో ఈ మొత్తం భారీగా తగ్గుముఖం పడుతోందని తెలిపింది. ‘మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశావహంగానే ఉన్నప్పటికీ.. భారతీయ కార్పొరేట్ల పెట్టుబడులు 2015-16లో 10-15 శాతం మేర క్షీణించనున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు ఫలితాల కోసం కార్పొరేట్లు వేచిచూస్తున్నారు. గతేడాది చివరివరకూ కూడా దేశంలో వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా ఆర్థికపరమైన అనిశ్చితి నెలకొంది. ఇవన్నీ కూడా పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయి’ అని ఎస్అండ్పీ అభిప్రాయపడింది. అయితే, విస్తృత స్థాయిలో పెట్టుబడి వ్యయాల రికవరీకి ముందు ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)లు, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పెట్టుబడులు కొంత చేదోడుగా నిలువనున్నాయని ఎస్అండ్పీ అంచనా వేసింది.