breaking news
employees recruitment
-
భారత టెకీలకు క్యాప్జెమిని శుభవార్త
న్యూఢిల్లీ : ఫ్రెంచ్ టెక్ దిగ్గజం క్యాప్జెమిని భారత టెకీలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారత్లో 30,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థకు ఇప్పటికే భారత్లో దాదాపు 1.15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. నూతన నియామకాలతో తమ కంపెనీ విలువ భారత్లో మరింతగా పెరుగుతోందని క్యాప్జెమిని భావిస్తోంది. అనుభవవజ్ఞులతో పాటు ప్రెషర్స్కు కూడా ఈ నియామకాల్లో అవకాశం కల్పించిననున్నట్టు క్యాప్జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్విన్ యార్డి పీటీఐకు తెలిపారు. తమ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నవారిలో భారత్లోనే సగం మంది ఉన్నారని చెప్పారు. తమ వ్యాపారంలో భారత్ది కీలకమైన భాగమని యార్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 25,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో నూతన సాంకేతికతపై నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా మారిందని అన్నారు. తమ కంపనీ ఉద్యోగుల్లో 65 శాతం కంటే ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారేనని చెప్పారు. 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న మధ్య స్థాయి ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీరిని ప్రాజెక్ట్ నిర్వాహకులుగా గానీ ఆర్కిటెక్ట్ లుగా నియమించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ మేరకు ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. -
రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగ నియామకాలు
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారీగా ఉద్యోగాల నియామకాలకు తెరతీసింది. ఈ ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది. కంపెనీ విస్తరణ ప్రక్రియలో భాగంగా ఈ నియామకాలను జియో చేపడుతోంది. ఈ నియామకాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో నిపుణులైన ప్రొఫిషనల్స్ను జియో నియమించుకోవడం ప్రారంభించింది. జియో నియమించుకునే ఈ ఏఐ టీమ్ ఆకాశ్ అంబానీ నేతృత్వంలో పనిచేయనున్నారని మింట్ రిపోర్టు చేసింది. ఈ ఏఐ టీమ్ను నిర్మించడానికి జియో కొంతమంది సీనియర్ అధికారులను నియమించిందని, బెంగళూరు లేదా హైదరాబాద్లో ఈ టీమ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తుందని తెలిపింది. ఆకాశ్ అంబానీ ఈ టీమ్పై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను ఆయన తన భుజాలపై వేసుకున్నారని జియో అధికారులు చెప్పినట్టు రిపోర్టు కోడ్ చేసింది. ఏఐతో పాటు బెంగళూరులో మిగత నియామకాల ప్రక్రియను కూడా జియో ప్రారంభించింది. మిషన్ లెర్నింగ్, బ్లాక్చెయిన్పై పనిచేసే వారిని కంపెనీ తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపారు. ఇప్పటి వరకు కంపెనీలో 1,57,000 మంది ఉద్యోగులున్నారని, మరో 75 వేల నుంచి 80 వేల మందిని నియమించుకోనున్నామని జియో చీఫ్ హ్యుమన్ రిసోర్సస్ ఆఫీసర్ సంజయ్ జాగ్ కూడా చెప్పారు. కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని, దీనిలో టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లు కూడా ఉన్నట్టు జాగ్ చెప్పారు. ‘రిలయన్స్ రెడీ’అనే దాని కోసం కొన్ని కోర్సులను కూడా ఈ కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సహకారంతో కూడా నియామకాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రిఫెరల్స్ ద్వారా 60 శాతం నుంచి 70 శాతం నియమిస్తున్నామని, తమ రిక్రూట్మెంట్ ప్లాన్లో కాలేజీలు, ఎంప్లాయీ రిఫెరల్స్ ప్రధాన భాగాలని జాగ్ చెప్పారు. -
ఏపీ సచివాలయంలో ఇష్టారాజ్యం
-
ఎస్బీఐలో భారీగా ఉద్యోగాల నియామకం
ముంబై : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీగా ఉద్యోగ నియామకాలకు తెరతీయబోతుంది. సుమారు 9500 మంది జూనియర్ అసిస్టెంట్లను నియమించుకోనున్నట్టు బ్యాంకు తెలిపింది. వీరిని కస్టమర్ సపోర్ట్, సేల్స్ ఫంక్షన్ల కోసం వీరిని ఉపయోగించుకోనున్నట్టు పేర్కొంది. 2013 నుంచి బ్యాంకు చేపట్టిన నియామకాల్లో ఇదే అతిపెద్ద రిక్రూట్మెంట్ అని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. కాగ, ఎస్బీఐ తన అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకున్న అనంతరం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టడంతో, ఈ క్వార్టర్లో బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 10వేలకు పైగా తగ్గిపోయింది. అంతేకాక డిజిటల్ బ్యాంకింగ్, నేరుగా ప్రాసెసింగ్ వంటి వాటిని ప్రవేశపెట్టడంతో బ్యాంకులో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా తగ్గిపోయింది. కానీ కస్టమర్ ఫేసింగ్ ఎంప్లాయీస్ అవసరం ఎక్కువగా ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా క్లిరికల్ గ్రేడ్ పొజిషన్లకు బ్యాంకు ఈ ప్రకటన విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ ముగింపు నాటికి బ్యాంకు ఉద్యోగులు సంఖ్య 2,69,219 మందికి తగ్గిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో బ్యాంకు ఉద్యోగులు 2,79,803గా ఉన్నారు. అంటే 10,584 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఈ క్రమంలోఎంట్రీ లెవల్ ఉద్యోగులను ఎక్కువగా నియమించుకోవాల్సినవసరం వచ్చిందని బ్యాంకింగ్ అధికారులు పేర్కొన్నారు. ఎక్కువగా నియామకాలు ఉత్తరప్రదేశ్లో ఉండనున్నాయని, అనంతరం మహారాష్ట్రలో ఉండబోతున్నట్టు చెప్పారు. -
తెలంగాణ సాహిత్యం ‘ప్రత్యేకం’
* ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర * పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల సరళిపై నిశిత పరిశీలన అవసరం * తెలుగు సాహిత్యంపై నందిని సిధారెడ్డి ఇంటర్వ్యూ * సాహిత్యంలో ప్రశ్నలు ఎలా అడిగారన్న అవగాహనతో జవాబులు రాయాలని సూచన తెలంగాణ ఉద్యమంలో సాహిత్యానికి ఉన్న పాత్ర ప్రత్యేకమైంది. సాహిత్యంతోపాటు సంస్కృతి, కళలు ప్రజలను ఏకం చేసి ఉద్యమం వైపు నడిపించాయి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేలా తోడ్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో ఉద్యోగులుగా చేరబోయే వారికి తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు, పాటల ప్రాధాన్యం తెలిసి ఉండాలి. అందుకే టీఎస్పీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో వీటిపై కచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. ఉద్యమ సమయంలో సాహిత్యంతో చైతన్యం తెచ్చిన వారిలో నందిని సిధారెడ్డి ఒకరు. ‘నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ..’ వంటి పాటలు, రచనలతో ఉద్యమానికి చేదోడుగా నిలిచిన ఆయన టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పోటీ పరీక్షలకు సిలబస్ను ప్రకటించిన నేపథ్యంలో సాహిత్యం విషయంలో అభ్యర్థులు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై నందిని సిధారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో ఉద్యోగంలోకి వచ్చే వారికి తెలంగాణ ఉద్యమ సమయం, అంతకుముందు తెలంగాణ సాహిత్య చరిత్ర తదితర అంశాలపై అవగాహన ఉండాలన్నదే ప్రతి ఒక్కరి ఉద్దేశం. ప్రధానంగా గ్రూప్-1 జనరల్స్టడీస్లో 11వ అంశంగా, గ్రూప్-2 జనరల్ స్టడీస్లో 7వ అంశంగా ‘సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ’ గురించి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సాహిత్యాన్ని ప్రత్యేకంగా చదువుకోవాలి. అభ్యర్థులు దృష్టి సారించాల్సిన ప్రధాన అంశాలివి.. సంస్కృతి: ఒక జాతి జీవన విధానమే సంస్కృతి. ఆచార వ్యవహారాలు వేషభాషలు, అలవాట్లు, పండుగలు, వేడుకలు. సుఖదుఃఖాలు, భావోద్వేగాలు, కళలు, సాహిత్యం మతం, రాజకీయాలు అన్నింటి మౌలిక అంశాలు సంస్కృతిలో ఉంటాయి. తెలంగాణ సాహిత్యం, భాష: భాషకు సంబంధించిన చర్చను సంస్కృతిలో భాగంగా అధ్యయనం చేయా లి. తెలుగు మౌలిక స్వరూపం తెలంగాణ భాషలోనే ఉంది. అనేక శాసనాలు దీనిని చెబుతున్నాయి. తెలంగాణ అనే పదం ఆధారంగానే ఏర్పడింది తెలుగు. ఆదివాసులైన గోండుల మూల పురుషుడికి నలుగు రు కొడుకులు. వారు టేకం, మాసం, పూనం, తెలిం గం. నాలుగో కొడుకు తెలింగం. అతని సంతతిగా ఉన్నవారే తెలుంగులు లేదా తెలంగాణ వారు. తెలుంగు ఆధారంగానే ఇక్కడ ఏర్పడిన సంతతికి తెలుంగణం అనే పేరుంది. 15వ శతాబ్దానికి సంబంధించిన ఒక శాసనంలో తెలంగాణపురం అనే ప్రస్తావ న ఉంది. దాని ఆధారంగానే తెలంగాణ అనేది తెలు గు యొక్క ప్రాతినిధ్యాన్ని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలి. కళలు: ఇప్పుడు కళలన్నీ (జానపద కళలు, సంప్రదాయ కళలు) బతికి ఉన్న ప్రాంతం ఏదంటే తెలంగాణ అనే చెప్పాలి. తెలంగాణలో జానపద కళకు ఎంత ప్రాధాన్యం ఉందో ఉద్యమ కాలంలో కళలకు అంతే ప్రాధాన్యం ఉంది. 18 ఏళ్ల ఉద్యమకాలంలో విసృ్తతంగా ప్రజల్లో నానింది గానకళ. పాట అనేది తెలంగాణ ప్రజల ప్రతి మూలమలుపులో, ప్రజల భావోద్వేగాల్లో ఉంది. ఉద్యమానికి పాట ప్రక్రియ వేదికగా నిలిచింది. దీనిని గమనంలోకి తీసుకోవాలి. తెలంగాణలో శిల్పకళ బాగా వర్ధిల్లింది. రామప్ప అనే శిల్పి పేరున దేవాలయమే ఉంది. ఆయన చెక్కిన నాగిని శిల్పం, ఒక స్త్రీ కాలికి ముల్లు గుచ్చితే తీస్తున్నట్లు చెక్కిన శిల్పం అరుదైనవి. అలాగే వేయి స్తంభాల గుడి, కాకతీయుల కాలపు కళాతోరణం ఇక్కడి శిల్పకళకు ప్రతీకగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఖ్యాతి చెందిన చిత్రకారులు ఇక్కడి వారే. కాపు రాజయ్య, లక్ష్మాగౌడ్, వైకుంఠం, పీటీ రెడ్డి వంటి వారు ఎంతో ఆదరాభిమానాలు పొందారు. ఇంకా వెలుగు చూడాల్సిన పెయింట్స్ అనేక గుహల్లో ఉన్నాయి. వాటిపై పరిశోధన, అన్వేషణ జరగాలి. సాహిత్యం: శాతవాహనుల కాలానికి సంబంధించి ప్రాకృత సాహిత్యం, అనంతర దశలో చాళుక్య యుగంలో సంస్కృత సాహిత్యం, కాకతీయులకు ముందు దశలో ఉన్న కుర్క్యాల సాహిత్యం ఉన్నాయి. 946 సంవత్సరానికి సంబంధించిన కుర్క్యాల శాసనంలో సాహిత్యం పరిఢవిల్లినట్లు ఉంది. అందులో మూడు కంద పద్యాలు ఉన్నాయి. నన్నయ కంటే ముందు యుగానిదీ శాసనం. నన్నయ మహాభారతం రచన కంటే ముందే ఇక్కడ పద్య రచన ఉన్నట్లు ఈ శాసనం చెబుతోంది. నన్నయ-సోమన మధ్య తేడా..: ఇక కాకతీయుల యుగం నాటిది శైవ సాహిత్యం. పాల్కురికి సోమన తెలంగాణకు సంబంధించిన ఆదికవి. స్థానికంగా జీవించిన శైవభక్తుల కథలను ఆయన సాహిత్యానికి వస్తువుగా స్వీకరించారు. నన్నయ్యది అనువాద సాహిత్యమైతే సోమనది స్వతంత్ర సాహిత్యం. ఇక్కడ జానపద సాహిత్యం ఎంత విస్తృతంగా ఉందో ఆయ న రచనల్లో పేర్కొన్నారు. ఆయన రాసిన వృశాధిప శతకం తెలుగులోనే మొదటి శతకం. అయితే అభ్యర్థు లు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేపుడు సాధారణంగా ఆదికవి ఎవరని అడిగితే నన్నయ అనే రాయాలి. తెలంగాణ ఆదికవి ఎవరు? లేదా మన ఆదికవి ఎవరని అడిగితే సోమనాథుడు అని రాయాలి. యుగ విభజన ఎలా చేయాలంటే..: తెలుగు సాహిత్యం అధ్యయనంలో సోమనాథుని కేంద్రంగా సాహిత్య యుగ విభజన చేయాలి. 1.సోమనకు పూర్వయుగ సాహిత్యం, పరిశీలన; 2.సోమన యుగ సాహిత్యం; 3.బమ్మెర పోతన యుగం సాహిత్యం; 4.కురవి గోపరాజు యుగ సాహిత్యంగా విభజన చేసుకొని చదువుకోవాలి. సోమన యుగ సాహిత్యం తె నుగు భాషలో, దేశీ చందస్సులో (ద్విపద సాహిత్యంలో) ఉండగా... పోతన సంస్కృతాన్ని తెలుగును కలిపి మధ్యేమార్గంలో కవిత్వాన్ని రాశారు. ఇక కురవి గోపరాజు యుగంలో చాలా సాహిత్యం వచ్చింది. ఇది కుతుబ్షాహీల పరిపాలనకు సంబంధించింది. ఈ కాలంలోనే తెలుగులో అచ్చతెనుగు కావ్యం వచ్చింది. అది పొన్నగంటి తెలగన రాసిన యయాతి చరిత్ర. గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యం రాశారు. అలాగే అద్దంకి గంగాధర కవి తపతి సంహరణోపాఖ్యానం రాశారు. మల్లారెడ్డి రాజుగా ఉండి షట్చక్రవర్తి చరిత్ర రాశారు. ఆధునిక సాహిత్యం: ఆధునిక సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. 19వ శతాబ్ది అనంతరం కాలం అంతా ఆధునిక సాహిత్యం. 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ చరిత్ర అనేక మలుపులు తిరిగిం ది. ఈ శతాబ్దంలోనే తెలంగాణలో కథ, నవల, వచన కవిత, పాట, పద్యం, నాటకం, వ్యాసం, విమర్శ, ఆత్మకథలు, గేయ కవిత వచ్చాయి. మిగతా ప్రాంతా ల్లో లేనట్లుగా ఇక్కడ సామాజిక ఉద్యమాలు విరివిగా జరగడం వల్ల సాహిత్యం దానిని ప్రతిఫలించింది. తొలి ఉద్యమంలో...: నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాయుధ ఉద్యమం చేశారు. అది సాహిత్యంలో ప్రతిబింబించింది. వీటిని చిత్రిస్తూ సురవరం ప్రతాపరెడ్డి పలు రచనలు రాశారు. అలాగే నిజాం ఆంధ్రలో తెలుగు కవులు పూజ్యం అని ముడుంబై రాఘవాచార్యులు అనే పండితుడు పేర్కొంటే సురవరం ప్రతాపరెడ్డి స్పందించి ఇక్కడి తెలుగు కవులు రాసిన 354 కవితలను సేకరించి గోలుకొండ కవుల పేరుతో సంచిక వేశారు. అయితే దీనిని తెలుగు సాహిత్య చరిత్రలో పేర్కొనలేదు. ఇది ఆంధ్రా కవుల వివక్షకు నిదర్శనం. ఇక వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, గంగు లాంటి నవలలు రాశారు. దాశరథి రంగాచార్యులు జానపదం, మోదుగుపూలు నవలలు రాశారు. నెల్లూరు కేశవస్వామి యుగాంతం వంటి కథ రాశారు. ఆవుల పిచ్చయ్య కథలు, దాశరథి కథలు రాశారు. కవితలు: దాశరథి రాసిన అగ్నిధార, కాళోజీ రాసిన నా గొడవ, సుద్దాల హన్మంతు పాటలు, బండి యాదగిరి (బండెనుక బండి కట్టి) వంటివన్నీ అప్పటి పోరాటాన్ని చిత్రించాయి. 1950లలో విశాలాంధ్ర సాహిత్యం: ఇక తరువాతి కాలంలో తెలుగు వాళ్లకు ఒక రాష్ట్రం ఉండాలనే ఉద్యమం నడిచింది. అందులో తెలంగాణ ప్రజలు రెండు భాగాలుగా ఆలోచించారు. విశాలాంధ్ర సాహిత్యం వచ్చింది. దాశరథి రాసిన మహాంధ్రోదయం, వనమామలై వరదాచర్యులు రాసిన కవిత్వాలు వచ్చాయి. దేవులపల్లి రామానుజరావు రాసిన వ్యాసాలు విశాలాంధ్ర వైపు నడిపించాయి. 1969లో రెండో ఉద్యమం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడిన ఇబ్బందులు, వివక్ష, అణ చివేత, అన్యాయానికి వ్యతిరేకంగా 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇందులో సాహిత్యం, పాటలు వచ్చాయి. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలిచి అన్ని భావోద్వేగాలను ప్రకటించిన కవి కాళోజీ నారాయణరావు. భాషా సాహిత్యాన్ని ప్రశ్నిస్తూ అనేక కవితలు రాశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించారు. విశాలాంధ్రవాదం నుంచి ప్రత్యేకవాదంపైకి వచ్చారు. విప్లవోద్యమం: ఆ తరువాత విప్లవోద్యమం. మూడు దశాబ్దాలపాటు విప్లవోద్యమం ప్రధానంగా సాగింది. ఇది మూడో పెద్ద సామాజిక ఉద్యమం. ఈ సమయంలో చాలా సాహిత్యం వచ్చింది. చెరబండరాజు, వరవరరావు వంటి వారు జైలు జీవితం అనుభవిస్తూ సాహిత్యం సృష్టించారు. గూడ అంజయ్య (ఊరు మనదిరా), గద్దర్ (సిరిమల్లే చెట్టుకింద లచ్చుమమ్మా) వంటి పాటలు విసృ్తతంగా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాయి. వరవరరావు రాసిన భవిష్యత్తు చిత్రపటం కవిత సంపుటిని అప్పటి ప్రభుత్వం నిషేధించింది కూడా. సంస్కృతి: సంస్కృతులు, పండుగల్లో తెలంగాణ ముద్ర ఉన్న వాటిపై దృష్టిపెట్టాలి. బతుకమ్మ, బోనాలు, పీరీలు, దసరా వంటివి తెలుసుకోవాలి. పీరీల పండుగ ముస్లింలది అయినా హిందువులు ఆడుతారు. మత సామరస్యం, ఐక్యత. సహజీవనానికి ఇది ప్రతీక. ఇక్కడ ఎక్కువగా తిరుగుబాట్లు, ఉద్యమాలు ఉన్నాయి. ఇవన్నీ సంస్కృతిలో భాగమే. ఎలా చదవాలంటే... సిలబస్పై అవగాహన తెచ్చుకోవాలి, తరువాత కావాల్సిన సమాచారం, గ్రంథాలను సేకరించుకోవాలి. వాటి ప్రత్యేకతలను గుర్తించి చదువుకోవాలి. సాహిత్యం, చరిత్ర, సంస్కృతి ఏ అంశమైనా వాటి ప్రత్యేకతలను గుర్తించాలి. ప్రత్యేకతలపైనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తొలి రచనను ప్రత్యేక అంశంగా భావించవచ్చు. కొన్నిసార్లు ఉద్యమ ప్రతిబింబంగా ఉన్న రచనలను ప్రత్యేకంగా భావించవచ్చు. కొన్నిసార్లు వస్తురూపాల మేళవింపు ప్రాచుర్యాన్ని ప్రత్యేకంగా భావించ వచ్చు. ఉదాహరణకు తడకమళ్ల కృష్ణారావు 1860లో రాసిన కంబుకందర చరిత్ర తెలంగాణ మొదటి నవల అంటాం. కాని దానికి నవల లక్షణాలు లేవన్న వాదన వచ్చింది. అయినా తెలంగాణ మొదటి నవలగా దానినే పేర్కొంటాం. అయితే నవలల్లో పరిణతి పొందిన నవల ఏదంటే వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ప్రజలమనిషి. నవలల్లో ప్రత్యేకమైన శిల్పాన్ని సాధించిన వ్యక్తిగా అంపశయ్య నవీన్ ‘అంపశయ్య’ను చెప్పవచ్చు. హాస్టల్ విద్యార్థి ఒకరోజు దినచర్యలను చైతన్య స్రవంతి శిల్పంలో నవీన్ రాసిన నవల అంపశయ్య. అలాంటి ప్రత్యేకతను గుర్తించాలి. మలిదశ ఉద్యమం అందరి కళ్ల ముందు జరిగిందీ, తెలంగాణ కలసాకారమైందీ మలి దశ ఉద్యమంతోనే. ఈ సమయంలో వచ్చిన అల్లం రాజయ్య కథలు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథ, బీఎస్ రాములు కథలు, సాహు కథలు ప్రత్యేకంగా చదువుకోవాలి. ఆ సమయంలోనే వచ్చిన కొమురం భీం నవలా ముఖ్యమైందే. ఈ మలిదశ ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించింది. గోరటి వెంకన్న, గద్దర్, సిధారెడ్డి, గూడ అంజయ్య, అంద్శైమొదలైనవాళ్లు తెలంగాణ ఉద్యమాన్ని పదును పెట్టే పాటలు అందించారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన మత్తడి, పొక్కిలి, వేముగంటి మురళీకృష్ణ మునుము రచనలు ఉద్యమాలకు ప్రతిబింబంగా నిలిచాయి. అందుబాటులో ఉన్న పుస్తకాలు.. సాహిత్యంలో: ముదిగంటి సుజాతారెడ్డి రాసిన తెలంగాణ సాహిత్య చరిత్ర. ఎస్సీ రామారావు రాసిన తెలంగాణ సాహిత్య చరిత్ర, తూర్పు మల్లారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ సాహిత్యం జీవిత చిత్రణం. సంస్కృతికి సంబంధించి: ఇగురం-తెలంగాణ భాష సాంస్కృతిక వ్యాసాలు. వట్టికోట ఆళ్వారుస్వామి సంకలనం చేసిన తెలంగాణం - తెలంగాణ సంస్కృతి సాంస్కృతిక ప్రచురించిన ఆర్ట్ ఎట్ తెలంగాణ పుస్తకాలు చదవొచ్చు. -
తెలంగాణ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపడుతున్నారు. 15 శాఖల్లో 15 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. సోమవారం నోటిఫికేషన్ వివరాలతో ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 15,522 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయోపరిమితిని 10 ఏళ్లకు సడలించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ ఫైలుపై ఆదివారమే సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ రోజు నోటిఫికేషన్ వివరాలతో ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయం, వైద్యశాఖ, మున్సిపల్, విద్యుత్, ఎక్సైజ్ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.