breaking news
edida nageswararao
-
కంటతడి పెట్టిన గాయని జానకి
హైదరాబాద్: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయానికి అంజలి ఘటించిన సందర్భంగా ప్రముఖ గాయని జానకి భావోద్వేగానికి గురయ్యారు. ఏడిద భౌతిక కాయాన్ని చూసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏడిద నాగేశ్వరరావు సతీమణిని తన ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులపాటు తనవద్దే ఉంచుకుంటానని చెప్పారు. -
అపురూప చిత్రాల నిర్మాత అస్తమయం
శంకరాభరణం, సాగరసంగమం, సీతాకోక చిలుక, సితార, స్వాతిముత్యం, స్వయం కృషి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలను వెండితెర మీద ఆవిష్కరించిన సాహసి ఆయన. ఆర్ట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు వేరు వేరుగా ఉంటాయన్న అపవాదును చెరిపేస్తూ మంచి కథాబలం ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నిరూపించిన నిర్మాత. కథ కోసం హీరోలు కావాలి గాని, హీరోల కోసం కథలు రాయకూడదని నమ్మిన అసలుసిసలు సినీ జ్ఞాని. ముప్పై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కేవలం పది చిత్రాలను మాత్రమే నిర్మించినా.. వేయ్యేళ్ల పాటు చెరగని కీర్తి సంపాదించుకున్న సినీ శిఖరం. ఆ మహోన్నత వ్యక్తే పూర్ణోదయ బ్యానర్ పై ఎన్నో కళాత్మక చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. నటుడు కావాలన్న ఆలోచనతో కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేసిన నాగేశ్వరరావు, సినీ రంగంలో అడుగుపెట్టి 25కు పైగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తరువాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొంత మంది నటులకు గాత్ర దానం చేశారు. 'నేను చిన్నతనం నుంచి విలువల కోసమే బతికాను. ఆ విలువలతోనే సినిమాలు నిర్మిస్తున్నాను` అన్న ఏడిద నాగేశ్వరరావు సినీ నిర్మాణం వ్యాపారాత్మకంగా మారిన తరువాత సినిమాలకు దూరమయ్యారు. ఏడిద నాగేశ్వరరావు 1934 ఏప్రిల్ 24 న తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించారు. సత్తిరాజు నాయుడు, పాపలక్ష్మీ ఆయన తల్లిదండ్రులు. కాలేజీ రోజుల నుంచే నాటకాలు వేయటం ప్రారంభించిన నాగేశ్వరావు తరువాత సినీ రంగం వైపు అడుగులు వేశారు. అదే సమయంలో ప్రముక దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి కళా ప్రపూర్ణ రాఘవ కళా సమితిని స్థాపించి ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. ఇలా నాటకరంగంలో ఆయనకు ఉన్న అనుభవమే తరువాత సినీ రంగంలో ఉపయోగపడింది. అలా నాటకాలలో ఉన్న అనుభవం వల్ల సినిమాల్లో నటించేందుకు మద్రాసు చేరారు నాగేశ్వరరావు. అయితే అనుకున్నట్టుగా ఆయనకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. తిరిగి ఊరు వెళ్లి మొహం చూపించే పరిస్థితి లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆల్ ఇండియా రేడియో లో ఏగ్రేడ్ ఆర్టిస్ట్ గా ఆడిషన్ లభించింది. తరువాత ఆ సర్టిఫికేట్ తోనే సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కొంత కాలం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, అనంతరం నటుడిగా కొనసాగారు. అయినా ఏదో వెలితి. సినిమా రంగంలోనే ఇంకా ఏదో సాధించాలనే ఆశయంతో నలుగురు మిత్రలతో కలిసి తమిళ సినిమాలను అనువాదం చేసి రిలీజ్ చేయటం ప్రారంభించారు. అలా నిర్మాతగా మారారు ఏడిద నాగేశ్వరరావు. మరికొంత మంది మిత్రులతో కలిసి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తొలి ప్రయత్నంగా సిరిసిరిమువ్వ సినిమాను నిర్మించారు. తొలి సినిమాతోనే సంచలన విజయం సాదించారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంవుడు ప్రతి సినిమా ఓ సంచలనం. మరే నిర్మాత తాకడానికి కూడా సాహసం చేయని ప్రయోగాత్మక కథలు.. అయినా అన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ లు.. అందుకే ఆయన ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. ఏడాది నాగేశ్వరావు ఈ రోజు (ఆదివారం కన్నుమూశారు) భౌతికంగా దూరమైనా ఆయన గత 17 ఏళ్లుగా తెలుగు సినిమాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కళాత్మకంగా ఉండాల్సిన సినిమా వ్యాపారంగా మారిన తరువాత ఆయన సినిమాలు తీయడం మానేశారు. అయితే ఆయన చేసిన పది సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో పది అపూర్వఘట్టాలు.. కళాత్మక సినిమా నిర్మించే అభిరుచి మాత్రమే కాదు సాహసం కూడా ఉన్న ఏడిద నాగేశ్వరరావు లాంటి నిర్మాతలు మళ్లీ వస్తారని ఆశించటం కూడా అత్యాశే అవుతుందేమో.. తెలుగు సినీ అభిమానుల కోసం అపురూప చిత్ర రాజాలను అందించిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. -
రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి..
హైదరాబాద్: దాదాపు దశాబ్దకాలంపాటు (1970-1980) తెలుగు చిత్రసీమపై ఏడిద నాగేశ్వరరావు ప్రభావం అమోఘం. పూర్తిగా కళాభిరుచి ఉన్న సాంప్రదాయబద్ధమైన చిత్రాలను నిర్మించి విమర్శకులు ప్రశంసలను నాగేశ్వరరావు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన నిర్మించిన శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషివంటి చిత్రాలు ఆయనకే కాకుండా మొత్తం తెలుగు చిత్రసీమకే గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. పలు చిత్రాలు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతోపాటు నంది అవార్డులను కూడా సాధించాయి. అంతర్జాతీయ వేదికలపై ఆయన నిర్మించిన చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. కొన్ని చిత్రాలు రష్యా భాషలోకి కూడా అనువాదం అయ్యాయి. రంగస్థల నటుడిగా కెరీర్ను ప్రారంభించిన ఆయన చిత్ర నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రయాణం సాగించి చివరకు సినిమా నిర్మాతగా మారారు. నిర్మాణ రంగం నుంచి వైదొలగిన తర్వాత తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా, నంది అవార్డుల కమిటీ చైర్మన్గా, నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ సభ్యుడిగా కూడా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. -
నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత
-
నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 8లోని ఆయన స్వగృహానికి తరలించారు. 1934లో ఏప్రిల్ 24న తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించారు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రాల్లో ఆణిముత్యాల్లాంటివి కొన్ని.. ఆపద్బాంధవుడు (1992) స్వరకల్పన (1989) స్వయంకృషి (1987) సిరివెన్నెల (1986) స్వాతిముత్యం (1985) సాగర సంగమం (1983) సితార (1983) సీతాకోకచిలుక (1981) తాయారమ్మ బంగారయ్య (1979) శంకరాభరణం (1979) సిరిసిరిమువ్వ (1978)