breaking news
Dr ramdas
-
పీఎంకే మేనిఫెస్టో విడుదల
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశ ఎన్నికల చరిత్రలో మేనిఫెస్టోను ఒక ప్రజాశాసనంగా విడుదల చేసిన ఘనత పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)ది మాత్రమేనని ఆ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ రాందాస్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు పీఎంకే కూడా ఒక సాధారణ మేనిఫెస్టో విడుదల చేయడం లేదు, ఇది ప్రజల ఆకాంక్షలకు అద్దమని అభివర్ణించారు.రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూటములుగా ఏర్పడగా, ఒంటరిపోరుతో ధైర్యంగా రంగంలోకి దిగిన పీఎంకే శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వినూత్న రీతిలో మేనిఫెస్టో తొలి ప్రతిని మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రమణియన్కు అందజేశారు. రాందాస్ మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరిలోనే పీఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగిన అన్బుమణి రాందాస్ ఆనాటి నుంచి ప్రజలను కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారని తెలిపారు. ఇలా ప్రజలతో మమేకమై ప్రభుత్వం నుంచి వారు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుని మేనిఫెస్టో సిద్ధం చేశామని చెప్పారు. ఇది కేవలం మేనిఫెస్టో, ఎన్నికల హామీలతో కూడిన బడ్జెట్ ఎంతమాత్రం కాదని అన్నారు. బడ్జెట్ రూపకల్పనలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారమని అన్నారు. తమిళనాడు ప్రగతి తమ మేనిఫెస్టోలో స్పష్టంగా గోచరిస్తుందని తెలిపారు. చేనేతలు, పారిశ్రామిక వేత్తలు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు ఇలా ఏ ఒక్క కేటగిరిని విస్మరించలేదని అన్నారు. అన్బుమణి అందరినీ కలుసుకుని వారితో చేసుకున్న ఒప్పందం నుంచే తమ మేనిఫెస్టో ఆవిర్భవించిందని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్లో తొలుత సిద్ధం చేసిన మేనిఫెస్టోలో 96 అంశాలు మాత్రమే ఉండగా, ఈ తాజా మేనిఫెస్టో 144 అంశాలకు పెరిగిందని తెలిపారు. సంపూర్ణ మద్య నిషేధం, అవినీతి నిర్మూలన, వికలాంగుల సంక్షేమం, ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, మానవ హక్కుల పరిరక్షణ ఇలా అన్ని అంశాలను సృజించామని అన్నారు. అలాగే ఉచిత, నాణ్యమైన, విధిగా విద్యాభ్యాసం చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. తాత్కాలిక ప్రయోజనాలు కల్పించే ఆకర్షణీయమైన ఉచితాల జోలికి పోకుండా ఆ నిధులను విద్యా ప్రయోజనాలకు వెచ్చిస్తామని తెలిపారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కోటి ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని క్షేత్రస్థాయిలో చూపిస్తామని, మొత్తం 386 గ్రామపంచాయతీలకు సమ ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. విద్యుత్లోటును తీర్చి ప్రకాశవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వీధి కుళాయిల్లో సైతం మినరల్ వాటర్ లభించేలా చర్యలు చేపడతామని అన్నారు. అన్ని అధికారాలు ప్రజలకే ఉండేలా పరిపాలనలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. పథకం అమలును సమీక్షించేందుకు వీలుగా అసెంబ్లీలో ఓ యాక్షన్ టేకన్ రిపోర్టు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న పీఎంకే ప్రభుత్వానికి ఇది ఒక కార్యాచరణ ప్రణాళికగా ఆయన అభివర్ణించా రు. పీఎంకే ప్రభుత్వం వల్ల అన్ని కోర్కెలు నెరవేరాయనే భావన ప్రజలకు కలుగుతుందనే ధీమాను వ్యక్తం చేశారు. మద్యంబాబులకు జైలు శిక్ష: అన్బుమణి తమ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే తొలి సంతకం సంపూర్ణ మద్య నిషేధంపైనేనని పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ హామీ ఇచ్చారు. మద్యం అమ్మకాలపై వెంటనే ఉక్కుపాదం మోపి సమూలంగా నిర్మూలిస్తామని తెలిపారు. చాటుమాటుగా మద్యం తాగేవారి గురించి ఫిర్యాదు చేసిన వారికి రూ.10వేలు బహుమానం, తాగిన వారికి ఆరు నెలల జైలు శిక్ష అని చెప్పారు. తమ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి మద్యం నిషేధం పోరాటం చేస్తూ కేసులు కూడా పెట్టించుకుందని అన్నారు. అధికారంలో ఉన్నపుడు కిమ్మన కుండా ఉన్న జయలలిత నేడు ఎన్నికల వేళ మద్యం నిషేధం పాటపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఎన్నికలు అమ్మ వర్సెస్ అన్బుమణి అని సవాల్ చేశారు. -
బీజేపీ కొత్త కూటమి
చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్సభ ఎన్నికల్లో పొత్తుల కోసం అన్ని పార్టీల్లో కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొత్త కూటమి ఏర్పాటుకు తెరలేపింది. వైగో నాయకత్వంలోని ఎండీఎంకే, డాక్టర్ రాందాస్ నేతృత్వంలోని పీఎంకేతో పొత్తు ఖరారైనట్లు వార్తలు అందాయి. రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ తిరుచ్చిలో నరేంద్ర మోడీ సభ, ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో విజయబావుటా ఎగురవేసిన తర్వాత పుంజుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అనేక ప్రాంతీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించినా వామపక్షాలు జతకలిసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. 2జీ స్పెక్ట్రం కేసు, శ్రీలంకలో ఈలం తమిళుల సమస్య తదితరాలతో కాంగ్రెస్కు దూరమైన డీఎంకే బీజేపీకి స్నేహ హస్తం ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిలో ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 12వ తేదీన ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ ఉన్నత స్థాయి సమావేశంలో తమిళనాడులో పొత్తుల అంశంపై ప్రధానంగా చర్చ చేపట్టారు. ఇందులో పార్టీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్, అగ్రనేత అద్వానీ, మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కారి, అరుణ్జెట్లీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీఎంకే, పీఎంకేలతో పొత్తు ఖరారైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు సైతం బీజేపీ ఆహ్వానం పలుకుతోందని ఆ సమావేశం ప్రకటించింది. తమిళనాడుకు చెందిన ఒక ప్రాంతీయ పార్టీ నేత ఢిల్లీలో కొత్త పొత్తుల పనిలో మునిగితేలుతున్నట్లు సమాచారం. ఆయన చొరవతోనే బీజేపీ ఈ కొత్త పొత్తుల నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. బీజేపీ కోశాధికారి ఖండన ఢిల్లీ సమావేశంలో తీసుకున్నట్లుగా చెబుతున్న ప్రాంతీయ పొత్తులను బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎస్ఆర్ శేఖర్ శుక్రవారం ఖండించారు. పొత్తులపై తమిళ మీడియాలో వచ్చిన కథనాలపై సాక్షి వివరణ కోరగా పొత్తులపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఎండీఎంకే, పీఎంకేలతో పొత్తు ఖరారైనట్లు రాష్ట్ర శాఖకు సమాచారం లేదన్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా అనేక పార్టీలతో చర్చలు జరపడం సహజమని, అంతమాత్రాన పొత్తు కుదిరినట్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు.