breaking news
diputations
-
‘సంక్షేమ’ శాఖలో..డిప్యుటేషన్ల షాక్!
సాక్షి, హైదరాబాద్: ‘‘జిల్లా సంక్షేమ కార్యాలయాల బలోపేతం కోసం మిమ్మల్ని బదిలీ చేస్తున్నాం. ఇకపై డిప్యుటేషన్ల పద్దతిలో మీరంతా డీడబ్ల్యూఓ కార్యాలయాల్లో పని చేయండి. వెంటనే అక్కడ విధుల్లో చేరండి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్కడే కొనసాగండి ఇదీ మహిశాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మినిస్టీరియల్ ఉద్యోగులకు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఆ శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ‘న్యూ ఇయర్ షాక్’.క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యను అధిగమించేందుకు సర్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 109 మంది సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్లతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆ శాఖ స్థానచలనంకలిగించింది. ఒకవైపు ఎన్నికల కోడ్ ఉండగా... ఉద్యోగులకు అకస్మాత్తుగా డిప్యుటేషన్లు ఇవ్వడంతో వారంతా అవాక్కయ్యారు. ఎలాంటి సమాచారం లేకుండా... వ్యక్తిగత స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా వేరేచోట విధులు నిర్వహించాలని ఆదేశించడంపై భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల ఆధారంగా ప్రస్తుతం ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా పని ఒత్తిడి తగ్గిన నేపథ్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మినిస్టీరియల్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈమేరకు చర్యలు తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ను ఆదేశించింది. ఈమేరకు గడచిన డిసెంబర్ 30వ తేదీన మెమో జారీ చేసింది. వెంటనే రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ స్పందిస్తూ డిప్యుటేషన్లు ఇస్తే సంబంధిత ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా బదిలీ అయిన వారిలో హైదరాబాద్ ఆర్జేడీ పరిధిలో 43 మంది, వరంగల్ ఆర్జేడీ పరిధిలో 66 మంది ఉన్నారు. జిల్లా పరిధిలోనే డిప్యూటేషన్ ఇవ్వాల్సి ఉండగా... కొంతమందికి అంతర్జిల్లాకు కూడా ఇచ్చారు. ఆ ఉద్యోగుల్లో అ‘సమ్మతి’... డిప్యుటేషన్ ఉత్తర్వులు అందడంతో మెజార్టీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కనీస సమాచారం ఇవ్వకుండా, ఉద్యోగుల నుంచి సమ్మతి తీసుకోకుండా ఎలా ఇస్తారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సూచించినట్లుగా ఉద్యోగులతో మాట్లాడాలని, వారి నుంచి సమ్మతి పత్రాలు తీసుకున్న తర్వాతే డిప్యుటేషన్ ఇవ్వాలి. అవేమీ లేకుండానే జిల్లా కార్యాలయాల్లో పనిచేయాలని ఆదేశించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియార్టీని పట్టించుకోకుండా, కౌన్సెలింగ్ నిర్వహించకుండా ఇష్టానుసారంగా స్థానచలనం కలిగించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, కుటుంబాన్ని తరలిస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు వస్తాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ఎన్నికల విధుల్లో ఉండాల్సిన కొందరు ఉద్యోగులకూ డిప్యుటేషన్ ఇచ్చినట్లు సమాచారం. తక్షణాదేశాలు కావడంతో మెజార్టీ ఉద్యోగులు అయిష్టంగానే విధుల్లో చేరారు. -
తెలంగాణ, ఏపీల మధ్య డిప్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భార్యాభర్తల్లో ఒకరు కేంద్ర ప్రభుత్వం, మరొకరు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి. భర్త లేదా భార్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే.. రెండో వ్యక్తికి తెలుగు రాష్ట్రాల మధ్య డిప్యుటేషన్కు అనుమతించాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు దినేశ్కుమార్, ఎస్.పి. సింగ్ సంయుక్తంగా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే భార్య, భర్తల విషయంలో మాత్రమే అంతర్రాష్ట్ర బదిలీలకు అవకాశం ఉంది. కానీ, ఒకరు కేంద్ర ప్రభుత్వం, మరొకరు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే భార్యాభర్తలకు ఈ వెసులుబాటు లేదు. దీంతో తమకూ అంతర్రాష్ట్ర బదిలీలకు అవకాశం కల్పించాలంటూ వీరి నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో వీరికి ఊరట కలిగిస్తూ రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉదాహరణకు.. భర్త తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ లేదా బ్యాంకు ఉద్యోగిగా ఉండి.. భార్య ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తుంటే, ఏపీ ప్రభుత్వం ఆమె (భార్య)ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్పై పంపిస్తుంది. అలాగే భార్య ఏపీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా లేదా బ్యాంకులో పనిచేస్తుంటే.. భర్త తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తుంటే భర్తను తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి డిప్యుటేషన్పై పంపిస్తుంది. తొలుత మూడేళ్ల పాటు డిప్యుటేషన్పై పంపిస్తారు. అనంతరం రెండేళ్లు పొడిగిస్తారు. అయితే, డిప్యుటేషన్ కోరుకునే ఉద్యోగులపై ఎటువంటి కేసులు ఉండరాదని, టీఏ, డీఏలు వర్తించవని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. అలాగే, డిప్యుటేషన్ కోరిన చోట ఖాళీ ఉండాల్సి ఉంది. -
అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి
నల్లగొండ టూటౌన్ : ఉపాధ్యాయులను సంబంధించిన అక్రమ డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు డిమాండ్ చేశారు. ఆదివారం యూటీఎఫ్ భవన్లో జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం తీసుకున్న చోటే పనిచేయాల్సి ఉన్నా ఈ మధ్య కాలంలో విద్యార్థుల అవసరాల దృష్ట్యా కాకుండా ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఇతర మండలాలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారని తెలిపారు. సూర్యాపేట నుంచి భువనగిరికి, తుంగతుర్తికి అక్రమంగా సర్దుబాటు చేశారని విమర్శించారు. ప్రజా ప్రతినిధుల వద్ద ముగ్గురు ఉపాధ్యాయులు పీఏలుగా పనిచేస్తున్నారని వెంటనే వారి డిప్యూటేషన్ రద్దు చేయాలన్నారు. సమావేశంలో యూటీఎప్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పేరుమాళ్ల వెంకటేశం, యాదయ్య, అరుణ, రామలింగయ్య, సైదులు, సయ్యద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.