‘కోడి మెడ’పైనే డ్రాగన్ కన్ను!
‘సిలిగురి కారిడార్’పై పట్టు బిగించేందుకు చైనా కుయుక్తులు
- భూటాన్లోని డోకాలా వరకు రహదారి నిర్మాణానికి యత్నాలు
- ఆ కారిడార్ను దిగ్బంధిస్తే భారత్–ఈశాన్య రాష్ట్రాల సంబంధాలు కట్
- రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న భారత్.. ఫలితమే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
ఈశాన్యరాష్ట్రాలతో భారత ప్రధాన భూభాగానికి ఉన్నది ఒకేఒక దారి. అది బెంగాల్లోని సిలిగురి మీదుగా వెళుతుంది. భౌగోళికంగా భారత్కు అత్యంత కీలకమైన ఈ భూభాగం గుండానే రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ఈశాన్యాన్ని దేశంతో కలుపుతున్నాయి. ఉత్తరాన నేపాల్, దక్షిణాన బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య సన్ననిపాయలా ఉన్న భూభాగాన్నే ‘సిలిగురి కారిడార్’గా పిలుస్తారు. దీనికే మరోపేరు కోడి మెడ. అవసరమైతే గంటల్లో ఈ కోడి మెడను పట్టేసేందుకు వీలుగానే చైనా... భూటాన్ భూభాగంలో ఉన్న డోకాలాలో రహదారిని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది.
భూటాన్లో అంతర్భాగమైన డోక్లామ్ పీఠభూమిలో డోకాలా ఉంది. భారత్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులు కలిసే ‘ట్రై జంక్షన్’కు సమీపంలో ఉంది. తమ సరిహద్దులోని యడాంగ్ నుంచి డోకాలాకు రోడ్డు నిర్మిస్తే... అవసరమైనపుడు భారత సరిహద్దుల సమీపంలోకి అత్యంత వేగంగా చైనా బలగాలను, ట్యాంకులను తరలించేందుకు వీలుంటుందనేది డ్రాగన్ ఆలోచన. దీన్ని భారత్ వ్యతిరేకించి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. ఫలితంగా చైనా– భారత్ల మధ్య తాజా ఉద్రిక్తతలు. భూటాన్తో మనకు 2007లో కుదిరిన ఒప్పందం ద్వారా... ఆ దేశ భద్రతకు మనం హామీదారుగా వ్యవహరిస్తున్నాం. అత్యంత సన్నిహితమైన మిత్రదేశానికి అండగా నిలవడం భారత్ ధర్మం. వ్యూహాత్మకంగా కూడా చైనా ఆర్మీ మన సరిహద్దులవైపు చొచ్చుకురాకుండా నిరోధించడం కూడా మనకు అవసరమే.
ఈశాన్యానికి లైఫ్లైన్
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారత్తో కలిసే సిలిగురి కారిడార్కు ఒక వైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దులున్నాయి. 200 కిలోమీటర్ల పొడవు, సగటున 60 కిలోమీటర్ల వెడల్పున్న భూభాగం. సిలిగురి కారిడార్ వెడల్పు ఒకచోటైతే 17 కిలోమీటర్లే. దీన్ని ఒకవేళ చైనా ఆధీనంలోకి తీసుకుంటే.. బెంగాల్లోని సిలిగురి, డార్జిలింగ్, జల్పాయ్గురిలతో పాటు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు (సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర) దిగ్బంధనమైనట్లే.
(చదవండి: భారత్-చైనా.. ఎవరి సత్తా ఎంత?)
వీటిని చేరుకోవడానికి భారత్కు మరో రోడ్డు మార్గం లేదు. ఈశాన్య రాష్ట్రాలకు నలువైపులా చైనా, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలున్నాయి. జలమార్గం అసల్లేని ప్రాంతం. దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలకు సరుకు రవాణా మార్గాలు మూసుకుపోతాయి. మిగతా భారతావనితో సంబంధాలు తెగిపోతాయి. విమానాల ద్వారా మాత్రమే ఈశాన్యానికి చేరుకోగలం. కాబట్టి సిలిగురి కారిడార్ భౌగోళికంగా అత్యంత కీలకం. డోకాలా నుంచి దాదాపు 130 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తే చైనా ఆర్మీ సిలిగురి కారిడార్ను తమ ఆధీనంలోకి తీసుకోగలదు. అంతేకాకుండా ఈశాన్యంలో చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులకు సరఫరాలు నిలిచిపోతాయి. కొత్తగా బలగాలను తరలించాలన్నా వీలుండదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే... అవసరమైతే కోడి మెడను పట్టుకోగలిగే స్థితిలో ఉండాలని చైనా భావిస్తోంది.
దిగ్బంధిస్తే ఏంజరుగుతుంది?
ఈశాన్యానికి భారతీయ రైలు మార్గాన్ని అనుసంధానించే జంక్షన్ న్యూజల్పాయ్గురి రైల్వేస్టేషన్. అక్కడి నుంచి గౌహతితో పాటు పలు రాష్ట్రాలకు రైల్వే లింకు ఉంది. జాతీయ రహదారి 31 సిలిగురి– గౌహతిని కలుపుతుంది. రవాణాపరంగా ఈ రెండు మార్గాలు భారత్కు ఆయువు పట్టు. అస్సాం నుంచి అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్కు రోడ్డుమార్గం ఉంది. వాస్తవాధీన రేఖకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తవాంగ్లో భారత సైన్యానికి చెందిన ఫోర్ కార్ప్స్ మొహరించి ఉంది. ఫోర్ కార్ప్స్లో 60 వేల మంది సైనికులు ఉంటారు.
న్యూజల్పాయ్గురి నుంచి దిమాపూర్ (నాగాలాండ్), దిబ్రూఘడ్ (ఉత్తర అస్సాం)లకు రైల్వే లైన్ ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా నాగాలాండ్, పశ్చిమ అరుణాచల్ప్రదేశ్లు అనుసంధానమవుతాయి. ఇక్కడ మరో 60 వేల మంది భారత సైనికులతో కూడిన త్రీ కార్ప్స్ ఉంది. సిక్కింలో ఉన్న 33 కార్ప్స్ను కూడా రైల్వే అనుసంధానిస్తుంది. ఒకవేళ సిలిగురి కారిడార్ దిగ్బంధనం జరిగితే... భారత సైనికులకు ఆయుధ, నిత్యావసర సరఫరాలు మొత్తం నిలిచిపోతాయి. భారత సైన్యం అయోమయంలో పడుతుంది. రెండోది... పాలనావ్యవహారాలపై భారత్కు నేరుగా అజమాయిషీ లేని పరిస్థితి వస్తే... ఈశాన్యంలో సంక్షోభం ముదురుతుంది. పలు రాష్ట్రాల్లో వేర్పాటువాదులు, తీవ్రవాద సంస్థలు ఉన్నందున ఈశాన్యంలో శాంతిభద్రతలను కాపాడి... పరిస్థితిని అదుపులో ఉంచడం కష్టతరమవుతుంది. కాబట్టి భారత్తో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీస్తే మొదట డ్రాగన్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కోడి మెడపైనే దృష్టి సారిస్తుంది.
ఎదురుదెబ్బ కొట్టొచ్చు...
సిక్కిం, భూటాన్ల మధ్య చైనా భూబాగం చిన్న ద్వీపకల్పంగా చొచ్చుకు వచ్చినట్లు ఉంటుంది. యడాంగ్ నుంచి ట్రై జంక్షన్ వైపు వస్తున్న కొద్దీ కుచించుకుపోతుంది. చైనా తమ బలగాలను భారత్ దిశగా ఇక్కడి చుంబీ లోయ గుండా ముందుకు నడపాల్సి ఉంటుంది. ఇది బాగా ఇరుకైన ప్రాంతమని, ఇటు సిక్కిం, అటు భుటాన్ (సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే)లలో యుద్ధట్యాంకులు మొహరించి క్షిపణులను ప్రయోగించినా, వైమానిక దళాల ద్వారా బాంబుదాడులను దిగినా భారత్... చైనా సైన్యాన్ని కకావికలం చేయగలదని... వ్యూహాత్మకంగా భారత్కు ఇది అనుకూలించే అంశమని సైనిక నిపుణుల అభిప్రాయం. చైనా సిలిగురి కారిడార్ను ఆక్రమిస్తే... మనం చుంబీ లోయపై గురిపెట్టడం ద్వారా చైనా వెనక్కి తగ్గేలా చేయవచ్చని వారి అభిప్రాయం. - సాక్షి నాలెడ్జ్ సెంటర్