breaking news
Cabinet position
-
క్రీడా శాఖ మంత్రిగా మనోజ్ తివారి
మాజీ క్రికెటర్ మనోజ్ తివారికి కొత్తగా ఏర్పడిన బెంగాల్ కేబినెట్లో చోటు దక్కింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అతను ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశాడు. తివారి శివ్పూర్ నియోజకవర్గంనుంచి విజయం సాధించాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారి... 16 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 50.36 సగటుతో 8965 పరుగులు చేశాడు. 2012లో ఐపీఎల్ గెలిచిన కోల్కతా నైట్రైడర్స్ జట్టులో మనోజ్ తివారి కూడా సభ్యుడు. -
డజను కార్పొరేషన్లకు కేబినెట్ హోదా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావస్తోంది. రికార్డు స్థాయిలో 89 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడంతో పాటు, ఇతర పార్టీల శాసనసభ్యుల చేరికతో ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్కు 104 మంది సభ్యుల బలం ఉంది. 40 మంది సభ్యులు ఉండే శాసన మండలిలోనూ టీఆర్ఎస్కు సంపూర్ణ బలం ఉండటంతో మంత్రివర్గంలో చోటు కోసం సీనియర్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. అయితే గత ఏడాది డిసెంబర్ 13న రెండో పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది మొదలుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 8న జరిగిన మూడో విడత మంత్రివర్గ విస్తరణ వరకు మంత్రిమండలి సభ్యుల సంఖ్య సీఎం కేసీఆర్తో కలుపుకుని 18కి చేరుకుంది. మంత్రివర్గంలో వివిధ సామాజిక వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని చోటు కల్పించాల్సి రావడంతో పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర పార్టీల నుంచి చేరిన ముఖ్య నేతలకు మంత్రివర్గంలో సీఎం చోటు క ల్పించలేకపోయారు. దీంతో పలు కార్పొరేషన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలకు సంకేతాలు ఇచ్చారు. కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు టీఆర్ఎస్ వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు హౌజింగ్ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ సంస్థల పాలక మండళ్ల చైర్మన్ల పదవీ కాలాన్ని మాత్రమే సీఎం కేసీఆర్ పొడిగించారు. పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా సిద్దిపేట జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాస్రెడ్డిని నియమించారు. మంత్రివర్గంలో చోటు ఆశించిన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి, శాసన మండలి చైర్మన్ పదవి అప్పగించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ను రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో నియమించారు. కేబినెట్లో స్థానం ఆశించిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయభాస్కర్, శాసన మండలి సభ్యులు బోడకుంట వెంకటేశ్వర్లును ప్రభుత్వ చీఫ్ విప్గా నియమిస్తూ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విప్లుగా, శానసన సభ కమిటీ చైర్మన్లుగా నియమిస్తూ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. తాజాగా శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డిని కేబినెట్ హోదాలో రైతు సమన్వయ సమితి చైర్మన్గా నియమించారు. మరో డజను మందికి కేబినెట్ హోదా? పలు ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియమించాలనే యోచనలో ఉన్న సీఎం కేసీఆర్, కొందరికి కేబినెట్ హోదా కూడా కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల 29 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ జాబితాలో మూసీనది పరివాహక (రివర్ఫ్రంట్) అభివృద్ధి కార్పొరేషన్ (ఎంఆర్డీసీ), రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు సంస్థ, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ), హైదరాబాద్ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ, రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలు, తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికార సంస్థ, తెలుగు అకాడమీ, హాకా, అధికార భాషా కమిషన్, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సంఘం (టీఆర్ఈఐ), హజ్ కమిషన్, సాహిత్య అకాడమీ, టీఎస్జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ డిస్కమ్ చైర్మన్లు కేబినెట్ హోదా జాబితాలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం టీఆర్ఎస్లో పోటీ తీవ్రంగా ఉన్నా, కేబినెట్ హోదా పదవులను బాజిరెడ్డి గోవర్దన్, జోగు రామన్న, రెడ్యా నాయక్, తుమ్మల నాగేశ్వరరావు, పద్మా దేవేందర్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు ఆశిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
‘ప్రతిభ’కు పట్టం కడితే...
శ్రీకాకుళం : జిల్లా నుంచి అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రతిభాభారతికి ఏదైనా కీలక పదవి లభిస్తే తమ పరిస్థితి ఏమిటన్నదానిపై స్వపార్టీలోనే ప్రత్యర్థి వర్గీయులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమెకు మండలి చైర్మన్పదవిగానీ, ఏదైనా కేబినెట్ పదవిగానీ లభిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆమెపై వ్యతిరేకంగా ఉన్నవారిలో గుబులు మొదలైంది. వాస్తవానికి ప్రతిభకు ప్రతిపక్ష పార్టీలకంటే సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా, శాసనసభ స్పీకర్గా పనిచేసినప్పుడు ఆమెకు పార్టీలోని అందరూ సన్నిహితంగానే ఉండేవారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రిజర్వేషన్ మారి రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చిననాటి నుంచి కళా వెంకటరావుతో విభేదాలు తలెత్తాయి. తొలిసారి రాజాం నుంచి పోటీచేసినప్పుడు అంతంతమాత్రంగా ఉన్న విభేదాలు రెండో సారి పోటీ చేసేసరికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తన పరాజయానికి కారణం కళావెంకటరావేనన్న వేదన ప్రతిభాభారతిలో ఉంది. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ప్రతిభాభారతి హయాంలోనే అభివృద్ధి చెందినా వారంతా ప్రస్తుతం కళా అణుచరులుగా మారారు. పదవి లేకపోవడంతో ప్రతిభాభారతి ఇప్పటివరకు మౌనంగా ఉండాల్సి వచ్చింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కడం ఆమెకు మంత్రి పదవి కానీ, శాసనమండలి చైర్మన్ పదవి కానీ దక్కేవీలుందని ప్రచారం జరుగుతుండడంతో ప్రత్యర్థుల్లో కలవరం మొదలైంది. తమపై కక్ష సాధింపునకు పాల్పడతారేమోనన్న ఆందోళనలో కళా వర్గీయులు ఉన్నారు. ఇటువంటి వాటిని తప్పించుకునేందుకు కొందరు ఇప్పటికే ప్రతిభ ప్రసన్నం కోసం యత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కింజరాపు కుటుంబంతో తొలినుంచి కళా కుటుంబానికి అభిప్రాయ భేదాలున్నాయి. అటు రాజాం నియోజకవర్గంలోనూ, ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ కళావర్గాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా చిత్తు చేసేందుకు కింజరాపు వర్గం పాటుపడింది. ఎచ్చెర్లలో కళా వెంకటరావును ఎదుర్కొనేందుకు చౌదరి ధనలక్ష్మిని జెడ్పీ చైర్మన్గా ఎంపికయ్యేట్టు చేశారు. రాజాం నియోజకవర్గంలో ప్రతిభా భారతిని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆమెకు పదవి లేకపోవడం వల్ల కింజరాపు కుటుంబీకులే నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం అభ్యర్థిగా ప్రకటించిన జూపూడి అనర్హుడు కావడంతో అచ్చెన్న చక్రం తిప్పారు. తన ప్రత్యర్థి అయిన కళాకు రాజాంలో చెక్ పెట్టాలంటే ప్రతిభాభారతికి పదవి అవసరమని గుర్తించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా అధినాయకుడిని ఒప్పించగలిగారు. అయితే ప్రతిభకు మంత్రి పదవి ఇస్తే కేబినెట్ హోదా కలిగిందే ఇవ్వాలి. అదే జరిగితే సహాయమంత్రిగా ఉన్న కింజరాపు ప్రాధాన్యం కోల్పోయే ప్రమాదం ఉంది. శాసనమండలి చైర్మన్ పదవి కూడా ఆ స్థాయిదే. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా ప్రత్యర్థికి చెక్పెట్టనిదే ఆమె నిద్రపోరని ఆ పార్టీ వర్గీయులే గుసగుసలాడుతున్నారు.