breaking news
Boundary problem
-
సత్వరమే పరిష్కరించుకుందాం
సరిహద్దు వివాదంపై భారత్, చైనా నిర్ణయం న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యకు సత్వర పరిష్కారం కనుక్కోవాలని భారత్, చైనాలు నిర్ణయించుకున్నాయి. సరిహద్దు వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని అభిప్రాయపడ్డాయి. భారత పర్యటనలో భాగంగా చెనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జరిపిన శిఖరాగ్ర చర్చల్లోనూ సరిహద్దు అంశమే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చర్చ ల సారాంశంపై ఇరు దేశాలు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సరిహద్దు వివాదంపై ఇరువురు నేతలూ తమ అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నారని, ఈ విషయంలో ద్వైపాక్షిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. సరిహద్దుల్లో శాంతి యుత వాతావరణం నెలకొనడం అత్యంత ముఖ్యమని, ఇందుకోసం సంయుక్తంగా కృషి చేయాలని తీర్మానించినట్లు తెలిపాయి. సరిహద్దు సమస్యకు సత్వర పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, ఇరుదేశాల ప్రయోజనాల దృష్ట్యా దీన్ని వ్యూహాత్మక అంశంగా పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని నిర్ణయించి నట్లు భారత్, చైనాలు పేర్కొన్నాయి. ఇక ఇప్పటివరకు ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు సరిహద్దు సమస్య పరిష్కారానికి చేసిన కృషిని మోదీ, జిన్పింగ్ ప్రశంసించారు. అలాగే నాలుగోసారి సంయుక్త సైనిక విన్యాసాలను చేపట్టాలని, ఏడో ఆర్థిక సదస్సును కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కీలక పాత్ర పోషించాలన్న భారత ఆకాంక్షకు మద్దతిస్తామని కూడా చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలు కాపాడుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు అవగాహనకు వచ్చినట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. -
అస్సాంలో పోలీసు కాల్పులు
ముగ్గురి మృతి, 20 మందికి గాయాలు అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో కొనసాగుతున్న నిరసనలు గోలాఘాట్: అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో తొమ్మిది మంది హత్యకు నిరసనగా కొనసాగుతున్న వరుస ప్రదర్శనలు బుధవారం రక్తసిక్తమయ్యాయి. నిరసనకారులు పట్టణంలోని డిప్యూటీ పోలీసు కమిషనర్ కార్యాలయంతో పాటు ఓ పోలీసు స్టేషన్కు నిప్పుపెట్టేందుకు ప్రయత్నించడం, ఓ ఆసుపత్రిపై దాడికి యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు మరణించగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గోలాఘాట్ జిల్లాలోని ఉరియమ్ఘాట్లో ఆగస్టు 12న కొందరు దుండగులు కొంత మందిని కాల్చిచంపడం, వారు పొరుగునున్న నాగాలాండ్కు చెందినవారని భావిస్తుండటంతో అస్సాంలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. రాన్గజన్ ప్రాంతంలో మంగళవారం స్థానికులను పోలీసులు ఇళ్ల నుంచి బయటికి లాక్కొచ్చి మరీ చితక్కొట్టిన ఉదంతాన్ని నిరసిస్తూ బుధవారం ఎరెంగపడ చరైలీ ప్రాంతంలో ఆందోళనలు చేపట్టారు. డీసీపీ కార్యాలయం, పోలీసు స్టేషన్ వద్ద గుమిగూడిన వెయ్యిమందికిపైగా ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తొలుత బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అల్లరిమూక రాళ్లు విసరడంతోపాటు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. నిరసనకారులు కుషాల్ కన్వర్ ఆస్పత్రిపై దాడికి పూనుకోవడంతో పాటు రాళ్లు రువ్వి పౌరులనూ గాయపర్చారని స్థానిక ఎస్పీ శిలాదిత్య చేటియా పేర్కొన్నారు. తాజా ఘటనల నేపథ్యంలో అస్సాంలోని నాగాలాండ్ సరిహ ద్దు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి, సైన్యాన్ని మోహరించారు. కాగా, నిరసనకారులపై కాల్పుల ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో హింసపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ నివేదికను సమర్పించింది. గొగోయ్, నాగాలాండ్ సీఎం టీఆర్ జిలియాంగ్లతో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడి వివాదాన్ని త్వరగా సద్దుమణిగేలా చేయాలని సూచించారు. ఇదీ అల్లర్ల నేపథ్యం: అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వివాదం 50 ఏళ్ల క్రితం.. నాగాలాండ్ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచీ కొనసాగుతోంది. ప్రతిసారీ మీరంటే మీరే దురాక్రమణలకు దిగుతున్నారంటూ ఇరురాష్ట్రాల వారూ ఆరోపించుకుంటూ వస్తున్నారు. ఈ సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వహించినా.. సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యలో తాజాగా అస్సాంలోని ఏడు సరిహద్దు గ్రామాల్లో ఇటీవల 15 మంది హత్యకు గురయ్యారు. -
ఈశాన్యంలో అలజడి!
సంపాదకీయం సమస్యను నాన్చడం ఏ పరిణామాలకు దారితీస్తుందో, ఎంతగా వికటిస్తుందో అస్సాం-నాగాలాండ్ సరిహద్దులమధ్య మరోసారి చెలరేగిన ఘర్షణలు తెలియజెబుతున్నవి. గత కొన్నిరోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో 14మంది పౌరులు మరణించారు. మరికొందరి ఆచూకీ తెలియడంలేదు. తమకు రక్షణ కల్పించడంలోనూ, ఈ సమస్యకు పరిష్కారం సాధించడంలోనూ విఫలమయ్యారన్న ఆగ్రహంతో సహాయ శిబిరాలను సందర్శించడానికి సోమవారం వెళ్లిన అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్పై జనం దాడికి కూడా ప్రయత్నించారు. ఆయన కాన్వాయ్లోని రెండు వాహనాలను ధ్వంసం చేశారు. ఒకపక్క బ్రహ్మపుత్ర ఎప్పటిలానే ఉగ్రరూపం దాల్చి అనేక ప్రాంతాలను ముంచెత్తి, వేలాదిమందిని నిరాశ్రయులను చేస్తుండగా...దానికి సమాంతరంగా ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోనూ పరస్పర హననం కొనసాగుతున్నది. రెండు ఇరుగు పొరుగు రాష్ట్రాలు శత్రు దేశాల్లా సంఘర్షించుకోవడం... హత్యలకు, కిడ్నాప్లకు, గృహదహనాలకు పాల్పడటం మనం ఈశాన్యంలోనే చూస్తాం. అంతేకాదు...నాగా మిలిటెంటు సంస్థలు రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతంలో బంకర్లు సైతం నిర్మించారు. ఈ ఘర్షణలన్నిటికీ గోలాఘాట్ జిల్లాలోని మేరపాని ప్రధాన వేదికగా ఉంటూ వస్తున్నది. తరుణ్ గోగోయ్పై దాడికి ప్రయత్నించిన ప్రాంతం కూడా ఇదే. గొడవ జరిగిన ప్రతిసారీ అవతలి పక్షాన్ని తప్పుపట్టడం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టారని ఆరోపించడం పరిపాటి. ఇప్పుడు కూడా అలాంటి కథనాలే వినిపిస్తున్నాయి. నాగాలాండ్ లోపలికి చొచ్చుకొచ్చిన కొందరు ఆదివాసీ మిలిటెంట్లు రెండు గ్రామాలను చుట్టుముట్టి ఇళ్లను ధ్వంసం చేశారని, ప్రతిఘటించబోయిన పౌరులపై కాల్పులు జరిపారని నాగాలాండ్లోని నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, నాగా మిలిటెంట్లు అస్సాంలోకి ప్రవేశించి 13 గ్రామాల్లోని ఇళ్లను తగలబెట్టారని ఇటువైపు వారు చెబుతున్నారు. పర్యవసానంగా అస్సాంలో నాగాలాండ్కు దారితీసే రహదారిని దిగ్బంధించారు. ఈ దిగ్బంధంవల్ల నాగాలాండ్కు నిత్యావసర సరుకుల రవాణా నిలిచిపోయింది. రెండు రాష్ట్రాల మధ్యా సరిహద్దు ఘర్షణ ఈనాటిది కాదు. 1963లో నాగాలాండ్ ఏర్పడిననాటినుంచీ ఆ ఘర్షణ అడపా దడపా స్వల్పస్థాయి ఘర్షణగా...అప్పుడప్పుడు అత్యంత తీవ్రంగా రేగుతూనే ఉన్నది. 1985లో అస్సాం-నాగాలాండ్ పోలీసుల మధ్య వివాదం ముదిరి పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో వందమందికి పైగా మరణించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ సరిహద్దు వద్ద కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ను ఉంచాలని నిర్ణయించింది. అయితే, దీనివల్ల పరిస్థితి చక్కబడిందేమీ లేదు. ఇప్పుడు వారి కళ్లముందే ఇరు ప్రాంతాల పౌరులూ ఘర్షణలకు దిగారు. అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గనుక దాన్ని అస్థిరపరచాలన్న దురుద్దేశంతోనే సీఆర్పీఎఫ్ తగిన చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నియంత్రించిందన్నది తరుణ్ గోగోయ్ ఆరోపణ. ఈ ఆరోపణల సంగతెలా ఉన్నా అస్సాంలోని గోలాఘాట్, శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లో తమకు చెందిన 4,974 చదరపు మైళ్ల భూమి ఉన్నదని, దాన్ని వెంటనే బదలాయించాలని నాగాలాండ్ సర్కారు డిమాండుచేస్తోంది. తమ భూమే నాగాలాండ్కు అక్రమంగా బదిలీ అయిందని అస్సాం వాదిస్తున్నది. ఈ సమస్య సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న కర్బీ, రేంగ్మా జాతులను శత్రువులుగా మార్చింది. పొట్టకూటి కోసం రెండు రాష్ట్రాల్లోనూ సంచరించక తప్పని ఈ జాతుల ప్రజలు తరచు మిలిటెంటు సంస్థలకు టార్గెట్లుగా మారుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నెల 12న మళ్లీ ప్రారంభమైన మారణహోమంలో బలైనదీ ఇలాంటివారే. గోలాఘాట్ జిల్లాలోని ఒక గ్రామంలో తొమ్మిది మృత దేహాలు దొరకగా, ఆ మర్నాడు ఇంకొక గ్రామంలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ హత్యలకు ప్రతీకారంగా నాగాలాండ్ గ్రామాలపై దాడులు, గృహదహనాలు జరిగాయి. తమ గ్రామంనుంచి ఇద్దరు పౌరులను అపహరించుకుపోయారని, వారి ఆచూకీ తెలియడంలేదని నాగాలాండ్లోనివారు ఆరోపిస్తున్నారు. సోదరభావం పెంపొందించుకోవాలని, శత్రువైఖరిని విడనాడాలని ఎన్నికల సమయంలో నాయకులు ప్రజలకు సుద్దులు చెబుతారుగానీ, సాధారణ సమయంలో ఆ ఘర్షణలను రెచ్చగొట్టే శక్తులకు మద్దతుగా నిలుస్తారు. అందువల్లే సమస్య రాను రాను జటిలమవుతున్నది. సమస్యలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న రెండు రాష్ట్రాలూ సరిహద్దు వివాదంపై మాట్లాడుకోవు. విభ జన రేఖలు గీసిన కేంద్ర ప్రభుత్వమూ మౌనం పాటిస్తుంది. కానీ, సీఆర్పీఎఫ్పై తమకు నమ్మకం పోయింది గనుక...సరిహద్దు ప్రాంతంలో నిఘాకు యువకులతో సొంతంగా గస్తీ దళాన్ని ఏర్పరుస్తామని అస్సాం ముఖ్యమంత్రి గోగోయ్ ప్రకటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి దళం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్వేషించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నాలుగేళ్లక్రితం ముందుకొచ్చింది. చెన్నైకి చెందిన శ్రీరాం పంచూ, గుజరాత్ హైకోర్టుకు చెందిన నిరంజన్ భట్ అనే న్యాయవాదులను మధ్యవర్తులుగా నిమించింది. సుప్రీంకోర్టు చేతుల్లోకి వెళ్లింది కదానని చేతులు దులుపుకోవడం కాక రెండు రాష్ట్రాలూ, కేంద్రమూ ఆ మధ్యవర్తుల పని మరింత సులభం కావడానికి తాము కూడా చొరవ తీసుకుని కదిలివుంటే పరిష్కారం ఈసరికే వచ్చి ఉండేదేమో! ఆ పని జరగకపోవడంవల్లే మరోసారి అస్సాం-నాగాలాండ్ సరిహద్దులు నెత్తురోడాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వమైనా ఈ సమస్యపై దృష్టిపెట్టి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి. అమాయక పౌరుల ప్రాణాలను కాపాడాలి.