మోదీజీ కన్నా నేనే పెద్ద దేశభక్తుణ్ని!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కన్నా తానే పెద్ద దేశ భక్తుడినని దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మిత్రపక్షమైన పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీకి కోపం తెప్పించొద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం జెఎన్ యూ వివాదంలో అసలైన దేశద్రోహులను అరెస్టు చేయడం లేదని కేజ్రీవాల్ మండిపడ్డారు.
'దేశద్రోహం అభియోగాలతో నాపై కేసు పెట్టారు. దళితులు, వెనుకబడిన తరగతులు, పేదల కోసం నేను గళమెత్తుతున్నాను. అందుకే (బీజేపీ) వాళ్లకు నేను దేశద్రోహిలాగా కనిపిస్తున్నాను. అయినా నా గొంతును ఎవ్వరూ అణచివేయలేరు. వారి కోసం నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను' అని కేజ్రీవాల్ సోమవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. 'మోదీజీ కన్నా నేనే పెద్ద దేశభక్తుణ్ని. దేశాన్ని నాశనం చేస్తామంటూ నినాదాలు చేసిన వారిని ఎందుకు ఇంకా అరెస్టు చేయలేదని నేను ప్రశ్నించాను. ఎందుకంటే ఆ నినాదాలు చేసిన కశ్మీరీలు. వారిని అరెస్టుచేస్తే మెహబూబా ముఫ్తీకి కోపం వస్తుంది. అందుకే అరెస్టు చేయడం లేదు. సరిహద్దుల్లో ప్రతిరోజూ సైనికులు అమరులవుతున్నారు. మోదీ మాత్రం కశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం దేశద్రోహులను కాపాడాలని చూస్తున్నారు' అని కేజ్రీవాల్ ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.