breaking news
All england badminton tourney
-
All England 2023: లక్ష్య సేన్, ప్రణయ్ శుభారంభం
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ లక్ష్య సేన్ తొలి రౌండ్లో సంచలన విజయం సాధించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–19తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో చౌ తియెన్ చెన్తో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్ మూడో ప్రయత్నంలో మాత్రం పైచేయి సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ 21–19, 22–20తో జు వె వాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. -
All England Badminton Tourney: సీడింగ్ లేకుండానే బరిలోకి భారత ఆటగాళ్లు
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నేడు (మార్చి 14) బర్మింగ్హామ్లో మొదలుకానుంది. 2001లో పుల్లెల గోపీచంద్ తర్వాత మరో భారత ప్లేయర్ ఈ టోర్నీ టైటిల్ను సాధించలేకపోయాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ టైటిల్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2009 తర్వాత తొలిసారి భారత క్రీడాకారులెవరికీ సీడింగ్ లభించలేదు. -
17 ఏళ్లకు జాతీయ స్థాయిలో దూసుకొచ్చిన కుర్రాడు.. బ్యాడ్మింటన్లో ప్రకాశం
దాదాపు యాభై ఏళ్ల క్రితం.. దక్షిణ భారతదేశంలో బ్యాడ్మింటన్ అంటే బాల్ బ్యాడ్మింటన్ మాత్రమే! దిగువ స్థాయిలో గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయి.. ఆటంటే బాల్ బ్యాడ్మింటన్ మాత్రమే అనేంతగా పరిస్థితి కనిపించేది. నగరాల్లో కూడా ‘షటిల్ బ్యాడ్మింటన్ ’ గా పిలుచుకునే ఆటకు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఇలాంటి స్థితిలో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడొకడు జాతీయ స్థాయిలో దూసుకొచ్చాడు. నేపథ్యం కారణంగా తొలి అవకాశం తొందరగానే లభించినా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు అతనికి పదేళ్లు పట్టింది. ఆ విజయం తర్వాత అతను ఆగలేదు. దేశంలో బాడ్మింటన్ ఆటకే దిక్సూచిగా మారాడు. ఒక దేశంలో ఒక క్రీడ గురించి చెప్పుకోవడం మొదలు పెట్టగానే అందరికంటే ముందుగా ఒక పేరు స్ఫురిస్తుందంటే ఆ ఆటగాడు సాధించిన ఘనత ఏమిటో, ఆ ఆటకు అతను తెచ్చిన గుర్తింపు ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. అతని పేరే ప్రకాశ్ పడుకోణ్.. భారత బ్యాడ్మింటన్కు తొలితరం చిరునామా. ప్రకాశ్ పడుకోణ్ కంటే ముందు కూడా భారత ఆటగాళ్లు అంతర్జాతీయ బ్యాడ్మింట¯Œ లో కొన్ని విజయాలు సాధించారు. ముఖ్యంగా పంజాబ్కు చెందిన దినేశ్ ఖన్నా తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన కెరీర్ ఎక్కువ భాగం ఆసియాకే పరిమితమైంది. 60, 70వ దశకాల్లో బ్యాడ్మింటన్ లో చైనా ఆధిపత్యం లేదు. అలాంటి సమయంలో దినేశ్ ఆసియా స్థాయిలో విజేతగా నిలిచినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అప్పట్లో బ్యాడ్మింటన్ అడ్డా యూరోప్ మాత్రమే. ఇంగ్లండ్, డెన్మార్క్లతో పాటు ప్రతిష్ఠాత్మక యూరోపియన్ లీగ్లు, క్లబ్లలో బ్యాడ్మింటన్ హవా నడిచేది. విజయాలు సాధించిన వారికే అక్కడ అందలం. సరిగ్గా ఇక్కడే ప్రకాశ్ పడుకోణ్ మిగతావారి కంటే భిన్నంగా నిలిచాడు. ఒక వైపు ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూనే యూరోప్లో సత్తా చాటడంతో ప్రకాశ్ ప్రత్యేకత కనిపించింది. కఠోర శ్రమతో.. ప్రకాశ్ తండ్రి మైసూరు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శిగా పని చేస్తుండటంతో సహజంగానే ప్రకాశ్కి ఆ ఆటపై ఆసక్తి కలిగింది. అయితే ఆటలో పదును ఉంటేనే మున్ముందు అవకాశాలు దక్కుతాయని త్వరలోనే ప్రకాశ్కి అర్థమైంది. 1962లో అమితోత్సాహంతో రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ బరిలోకి దిగిన అతను తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత మరో రెండేళ్ల శ్రమతో అదే టైటిల్ గెలుచుకున్నాడు. అయినా సరే, ప్రకాశ్ ఆట ఉత్తరాది షట్లర్లతో పోలిస్తే ఇంకా పేలవంగానే ఉండేది. జాతీయ స్థాయికి ఎదగాలంటే అది సరిపోదని గ్రహించాడు. అందుకే తన ఆట శైలిని మార్చుకున్నాడు. దూకుడును పెంచి ప్రత్యర్థిపై చెలరేగేందుకు తగిన అస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు. అయినా సరే.. రాష్ట్ర స్థాయి విజేత నుంచి జాతీయ స్థాయికి చేరేందుకు ప్రకాశ్కు చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో అతణ్ణి ఎన్నో పరాజయాలు పలకరించాయి. పట్టుదలగా నిలబడ్డాడు. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఫలితంగా.. దాదాపు ఏడేళ్ల తర్వాత తొలిసారి జాతీయ జూనియర్ టైటిల్ ప్రకాశ్ చేతికి చిక్కింది. అప్పటికే.. పదునెక్కిన ప్రకాశ్ ఆట సీనియర్లనూ నిలువరిస్తోంది. దాంతో జూనియర్ చాంపియన్ గా మారిన సంవత్సరమే పడుకోణ్ జాతీయ సీనియర్ చాంపియన్ గానూ మారాడు. అది మొదలు మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా ఏడు సంవత్సరాల పాటు ప్రకాశ్ జాతీయ చాంపియన్ గా నిలబడ్డాడు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో.. భారత బ్యాడ్మింటన్ లో శిఖరానికి చేరాక ప్రకాశ్ తర్వాతి అడుగు అంతర్జాతీయ టోర్నీల వైపే. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించినా.. వ్యక్తిగత విభాగంలో విజయాలకు హైదరాబాద్ నగరమే తొలి వేదికగా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆసియా చాంపియన్ షిప్లో 21 ఏళ్ల ప్రకాశ్ కాంస్యం సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకు కెనడాలోని ఎడ్మాంటన్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల సింగిల్స్లో స్వర్ణపతకంతో మెరిశాడు. వరుసగా రెండు వరల్డ్ కప్లలో పతకాలు, వరల్డ్ గేమ్స్తో పాటు ఆసియా చాంపియన్ షిప్లో మరో పతకంతో ప్రకాశ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అప్పటికే బ్యాడ్మింటన్ అంటే దేశంలో ఒక్క ప్రకాశ్ పడుకోణ్ పేరు మాత్రమే వినిపించేంతగా ప్రసిద్ధికెక్కాడు. యూరోప్ గడ్డపై.. వేర్వేరు అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లిన సమయంలో ప్రకాశ్ ప్రత్యర్థుల ఆటపై దృష్టి పెట్టాడు. ప్రధానంగా యూరోప్ ఆటగాళ్లతో పోలిస్తే తన ఆట చాలా వెనుకబడి ఉన్నట్లు గ్రహించాడు. అప్పటికే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా.. ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆటలో మార్పు తీసుకురాకపోతే వెనుకబడి పోతాననీ అర్థంచేసుకున్నాడు. యూరోప్ వెళ్లి శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే శిక్షణ అంటూ వెళితే ఫలితం ఉండదని.. వీలైనన్ని ఎక్కువ టోర్నీలకు ఆడటంతో ఆటను సానబెట్టుకోవచ్చని అత్యంత సన్నిహితులు అతనికి సూచించారు. దాంతో తన మకాంను యూరోప్కు మార్చుకున్నాడు ప్రకాశ్. ఇంగ్లండ్, డెన్మార్క్, స్వీడన్ , నెదర్లాండ్స్.. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి క్లబ్లలో ఆడుతూ పోయాడు. అతను ఆశించినట్లుగానే అతని ఆట పైస్థాయికి చేరుకుంది. 1979లో లండన్ లో ‘ఈవెనింగ్ ఆఫ్ చాంపియన్స్’ టోర్నీలో విజయంతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఆట చివరకు ఒక చరిత్రాత్మక గెలుపుకి బాటలు వేసింది. కొనసాగిన విజయపరంపర ఆల్ ఇంగ్లండ్ గెలిచిన తర్వాత ప్రకాశ్కు స్వదేశంలో లభించిన స్వాగతం, పెద్ద ఊరేగింపుతో జరిగిన పౌర సన్మానం అప్పట్లో పెద్ద సంచలనం. ఆ విక్టరీ తర్వాత అతని స్థాయి మరింత పెరిగిపోయింది. వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ అందుకోవడంతో పాటు డెన్మార్క్లోని కోపెన్ హాగెన్ లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్లోనూ అతను కాంస్యం గెలుచుకున్నాడు. కోపెన్ హాగెన్ నగరంతో అనుబంధాన్ని ఆ తర్వాత కొనసాగిస్తూ ప్రకాశ్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండి లీగ్లలో పాల్గొన్నాడు (అతని కూతురు, పాపులర్ నటి దీపికా పడుకోణ్ అక్కడే పుట్టింది). 1986 సియోల్ ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో మరో పతకం అతని ఖాతాలో చేరింది. ప్రతిభను ప్రోత్సహిస్తూ.. అర్జున, పద్మశ్రీ పురస్కారాలు గెలుచుకున్న ప్రకాశ్ 90వ దశకం ఆరంభంలో ఆటకు దూరంగా జరిగినా, కోచ్గా కొత్త బాధ్యతను తీసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రకాశ్ పడుకోణ్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చి దిద్దుతోంది. ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ ప్రకాశ్ ముందుచూపుకి ప్రతిరూపం. వేర్వేరు క్రీడాంశాల్లో ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి వారికి శిక్షణ, తగిన డైట్నివ్వడం, టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుగా ఆర్థిక సహకారాన్ని అందించడం.. ఇలా అన్ని రకాలుగా వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ తనదైన రీతిలో అండగా ఉంటోంది. బిలియర్డ్స్ స్టార్ గీత్ సేథీతో కలసి ప్రకాశ్ నెలకొల్పిన ఈ ఫౌండేషన్ ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసింది. ఆల్ ఇంగ్లండ్ ఘనత... బ్యాడ్మింటన్ లో అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్. 1899లోనే మొదలైన ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడం అంటే అతి పెద్ద ఘనత. ఆ సమయంలో వరల్డ్ చాంపియన్ షిప్తో పాటు దానికి సమాన హోదా ఉన్న టోర్నమెంట్ ఇది. యూరోపియన్ సర్క్యూట్లో వరుస విజయాలతో ప్రకాశ్ మంచి ఊపు మీదున్నాడు. కొన్నాళ్ల క్రితమే పెద్ద టోర్నీలు డానిష్ ఓపెన్ , స్వీడిష్ ఓపెన్ లలో అతను టైటిల్ కూడా దక్కించుకున్నాడు. 1980 ఆల్ ఇంగ్లండ్ టోర్నీ మొదలయ్యాక ఏకపక్ష విజయాలతో ఫైనల్ వరకు దూసుకొచ్చాడు. అప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో ఏ గేమ్లోనూ ప్రత్యర్థులు గరిష్ఠంగా 12 పాయింట్లకు మించి సాధించలేకపోయారంటే ప్రకాశ్ దూకుడు ఎలా సాగిందో అర్థమవుతుంది. 15–7, 15–12, 15–0, 15–10, 15–4, 15–4, 15–8, 15–10.. ఇవీ స్కోర్లు! ఫైనల్లో ఇండోనేసియాకు చెందిన లీమ్ స్వీ కింగ్ ఎదురయ్యాడు. ఆ సమయంలో అతను అత్యద్భుత ఫామ్లో ఉండి చెలరేగిపోతున్నాడు. ‘స్మాష్ కింగ్’గా గుర్తింపు తెచ్చుకొని అంతకు ముందు వరుసగా రెండేళ్లు ఇదే టోర్నీలో విజేతగా నిలిచాడు. దాంతో ప్రకాశ్కు కష్టమే అనిపించింది. అయితే భారత స్టార్ ఎక్కడా తొణకలేదు. ప్రత్యర్థి గుర్తింపును పట్టించుకోలేదు. అన్నేళ్లుగా యూరోప్లో ఆడిన తన అనుభవాన్ని రంగరించాడు. ఫలితంగా 15–3, 15–10 తేడాతో ఘన విజయం.. ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు. ‘నన్ను ప్రకాశ్ హిప్నటైజ్ చేసినట్లు అనిపించింది’ అంటూ ఓటమి తర్వాత స్వీకింగ్ చేసిన వ్యాఖ్య ఈ గెలుపు ప్రత్యేకతను మరింత పెంచింది. 1980 నుంచి ఇప్పటి వరకు పుల్లెల గోపీచంద్ (2001) మినహా మరే భారత షట్లర్ పురుషుల, మహిళల విభాగాల్లో ఈ టోర్నీ గెలుచుకోలేకపోయారు. -
శభాష్ సింధు...
తొలి రెండు మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయిన తెలుగు తేజం పీవీ సింధు అసలు సిసలు పోరులో మాత్రం అబ్బురపరిచింది. తన ముందు ప్రపంచ చాంపియన్ ప్రత్యర్థిగా ఉన్నా... మ్యాచ్లో పలుమార్లు వెనుకబడినా... తన వ్యూహాలకు దీటుగా ప్రత్యర్థి జవాబు ఇస్తున్నా... ఏదశలోనూ తొణకకుండా... విజయంపై ఆశలు వదులుకోకుండా... చివరి పాయింట్ వరకు పోరాడిన సింధు ఆఖరికి విజయనాదం చేసి ఔరా అనిపించింది. బర్మింగ్హామ్: కొన్నాళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై భారత స్టార్ పీవీ సింధు మరోసారి పైచేయి సాధించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో అద్వితీయ విజయంతో తెలుగు తేజం సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 84 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 20–22, 21–18, 21–18తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ ఒకుహారాను ఓడించింది. ఈ మెగా ఈవెంట్లో ఆరో ప్రయత్నంలో తొలిసారి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు సింధు, ఒకుహారా 10 సార్లు తలపడగా... ఇద్దరూ 5–5తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ టోర్నీలో సింధు వరుసగా మూడో మ్యాచ్లోనూ మూడు గేమ్లు ఆడి విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. యామగుచితో ముఖాముఖి రికార్డులో సింధు 6–3తో ఆధిక్యంలో ఉంది. గతేడాది ఒకుహారాతో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింటిలో గెలిచి, మరో రెండు ఓడిన సింధు ఈ మ్యాచ్లో మాత్రం పట్టుదలతో పోరాడింది. మూడు గేమ్లూ నువ్వా నేనా అన్నట్లు సాగాయి. తన ఎత్తు కారణంగా పదునైన స్మాష్లు సంధించే వీలున్న సింధుకు ఒకుహారా ఆ అవకాశం ఇవ్వలేదు. ర్యాలీ సుదీర్ఘంగా కొనసాగేలా చూస్తూ అవకాశం దొరకగానే డ్రాప్ షాట్లు సంధిస్తూ పాయింట్లు రాబట్టింది. సింధు కూడా ఏమాత్రం తీసిపోకుండా ఆడుతూ ఆమె వ్యూహాలకు తగినరీతిలో జవాబిచ్చింది. దాంతో స్కోరు పలుమార్లు సమమైంది. తొలి గేమ్లో స్కోరు 20–20 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి గేమ్ చేజార్చుకుంది. మ్యాచ్లో నిలవాలంటే తప్పనిసరిగా రెండో గేమ్లో నెగ్గాల్సిన స్ధితిలో సింధు ఆరంభంలోనే 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 6–4తో.. 9–7తో... 11–9తో...14–11, 16–13తో సింధు ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. ఈ దశలో సింధు తప్పిదాలతో స్కోరు 18–18 వద్ద సమమైంది. కానీ ఈ హైదరాబాద్ అమ్మాయి సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి రెండో గేమ్ దక్కించుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్లో సింధు మూడుసార్లు (1–4, 11–14, 12–16)తో వెనుకబడినా... ఒత్తిడి దరిచేరనీయకుండా ఆడింది. 12–16తో వెనుకంజలో ఉన్నపుడు సింధు వరుసగా నాలుగు పాయిం ట్లు గెలిచి స్కోరును 16–16తో సమం చేసింది. అనంతరం ఇద్దరూ రెండేసి పాయింట్లు సాధించడంతో మళ్లీ 18–18 వద్ద స్కోరు సమమైంది. ఈ దశలో సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా మూడు పాయింట్లు గెలిచి ఒకుహారాను ఇంటిదారి పట్టించింది. శ్రీకాంత్కు నిరాశ గురువారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 21–15, 20–22తో అన్సీడెడ్ హువాంగ్ యుజియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్లో శ్రీకాంత్ 20–18తో విజయానికి చేరువగా వచ్చాడు. అయితే వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయిన ఈ హైదరాబాద్ ప్లేయర్ ఓటమిని మూటగట్టుకున్నాడు. -
ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి
-
ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి
బర్మింగ్హోమ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో 16-21, 21-14, 21-7 తేడాతో సైనా నెహ్వాల్ ఓటమి చెంది అభిమానులను నిరాశ పరిచింది. ఆద్యంతం ఉత్కంఠం రేపిన ఫైనల్ మ్యాచ్ లో సైనా నెహ్వాల్ పోరాడి ఓడింది. అయితే తొలిసెట్లో సైనా నెహ్వాల్ గెలిచి ట్రోఫీపై ఆశలు పెంచినా.. మిగతా రెండు సెట్లలో మాత్రం సైనాకు చుక్కెదురైంది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత్ తరుపున ఫైనల్ కు చేరిన క్రీడాకారిణిగా సైనా చరిత్ర సృష్టించినా.. చివరి అడ్డంకిని మాత్రం దాటకలేకపోయింది.