తెలంగాణ తొలిపరీక్షలో స్వల్ప అంతరాయం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఈఈ ఆన్లైన్ పరీక్షలో అంతరాయం చోటుచేసుకుంది. చాలా కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం, కంప్యూటర్లు మొరాయించడం, అభ్యర్థుల సంఖ్యతు అవసరమైన కంప్యూటర్లు పేక పోవడంతో వందలాది మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాల ఏదుట ఆందోళనకు దిగారు. చాలా కేంద్రాల్లో 11.30 గంటలకు కూడా పరీక్ష ప్రారంభం కాలేదు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పేరిగూడ శ్రీదత్తా ఇంజనీరింగ్ కళాశాలలో 200 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఉదయం 9 గంటలకే 200 మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ ముందస్తు సమాచారం లేకపోవడంతో పరీక్షకు ఏర్పాట్లు చేయలేదు. కంప్యూటర్లు అసలు లేవు. దాంతో పరీక్షల నిర్వాహకుడు విద్యార్థులందర్నీ బస్సులో ఎక్కించుకుని పక్కనే ఉన్న శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చారు. అక్కడ కూడా కంప్యూటర్లు, కనీస వసతులు లేకపోవడంతో అతను కూడా చేతులెత్తేశాడు.
11.30 గంటలైనా ఏర్పాట్లు చేయలేకపోయారు. దాంతో ఆందోళనకు గురైన అభ్యర్థులు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ముందస్తు ఆలోచన లేకుండా పరీక్ష నిర్వహించినందువల్ల తాము ఇబ్బందిపడుతున్నామని, తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఆదివారం ఉదయం దాదాపు 99 కేంద్రాల్లో పరీక్ష ప్రారంభమైన సంగతి తెలిసిందే. 931 పోస్టులకు గాను 30,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.