breaking news
Adoni yard
-
త్వరలో మరి కొన్ని యార్డులలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు
జేడీఏ రామాంజినేయులు ఆదోని: మార్కెట్లో పత్తి దర తగ్గిపోవడంతో రైతులను అదుకునేందుకు మార్కెటింగ్ కడప రీజియన్ పరిధిలో మరి కొన్ని యార్డులలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని జేడీఏ రామాంజినేయులు తెలిపారు. బుధవారం ఆయన ఆదోని యార్డును పరిశీలించారు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ-టెండర్ల అమలు, అమలులో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారంపై యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి రామారావు, అధికారులతో చర్చించారు. సెస్సు వసూలును సమీక్షించారు. నిర్ణీత లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్లో పత్తి ధర తగ్గిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోందని అన్నారు. మద్దతు ధర క్వింటాలు రూ.4050 అమ్ముకోడానికి సీసీఐ వద్దకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కడప రీజన్లో సీసీఐ దాదాపు రూ.4.5 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసిందని తెలిపారు. అయితే రైతుల నుంచి మరింత ఒత్తిడి పెరుగడంతో మరి కొన్ని కొనుగోలు కేంద్రాలు అవసరమని తాము ప్రతి పాదనలు పంపగా ఇందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. జిల్లాలో ఆలూరు, పత్తికొండ, డోన్, కడప జిల్లాలో గుత్తిలో కొత్తగా కేంద్రాలు ప్రారంబిస్తున్నామని తెలిపారు. సీసీఐ అధికారులు ఇందుకు అవసరం అయిన చర్యలు తీసుకుంటారని అన్నారు. వారంలోగా అన్ని అదనపు కేంద్రాలు ప్రారంభం అవుతాయని ఒక ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. ఆదోని యార్డులో విస్తరణకు అనుగుణంగా సెక్యూరిటీని పెంచకపోవడం వల్ల దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా సెక్యూరిటీ నియామకంపై నిషేదం ఉందని పేర్కొన్నారు. అయితే యార్డులో దాదాపు రూ.50 లక్షలతో 36 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, నిర్వహణను ప్రేవేటు వ్యక్తులకు ఇస్తున్నామని, సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని ఆయన వివరించారు. కాటన్ యార్డులో ప్లాట్ ఫారం పై కప్పు నిర్మాణం నెలల తరబడి ఎందుకు వాయిదా పడుతోందని ప్రశ్నించగా నైపుణ్యత కలిగిన కాంట్రాక్టర్లు టెండర్లతో పాల్గొనడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు ఆరు సార్లు టెండర్లు పిలిచినా ప్రయోజన ం లేకుండా పోయిందని, మళ్లీ టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. రిజయన్లో మొత్తం 10 మార్కెట్ యార్డులకు ప్రభుత్వం పాలక మండళ్లను నియమించిందని, మిగిలిన యార్డులకు త్వరలోనే పాలక మండళ్లు నియమించే అవకాశం ఉందని తెలిపారు. పిడబ్ల్యూడీఆర్ స్వీం కింద రీజియన్లో రూ.2 కోట్లతో గోదాముల మరతమ్మతు చేపడుతున్నామని అన్నారు. కడప రీజియన్లో మొత్తం 60 మార్కెట్ యార్డులు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.78.34 కోట్లు సెస్సు వసూలు చేయాలని లక్షంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 78 శాతం రూ.57.8 కోట్లు వసూలు చేశామని తెలిపారు. మిగిలిన మొత్తంను మార్చిలోగా వసూలు చేయాలని యార్డు అధికారులను ఆదేశించామని చెప్పారు. -
తెల్లబంగారం మందగమనం
ఆదోని, న్యూస్లైన్: ఆదోని మార్కెట్ యార్డుకు విక్రయానికి తరలివచ్చే పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో స్థానిక జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీల యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణంలో ఉన్న సుమారు 90 వరకు ఫ్యాక్టరీలకు రోజుకు 18వేల క్వింటాళ్ల పత్తి అవసరమవుతుండగా ప్రస్తుతం మార్కెట్కు 8 నుంచి 12వేల క్వింటాళ్లకు మించి పత్తి రావడం లేదు. దీంతో పత్తి కొరత ఏర్పడి ఫ్యాక్టరీల నిర్వహణ కష్టమవుతోందని నిర్వాహకులు వాపోతున్నారు. గత ఏడాది వరకు పట్టణంలో 65 జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆదోని పరిసర ప్రాంతాల్లో పత్తి సాగు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ మేరకు యార్డుకు వచ్చే దిగుబడులు కూడా పెరిగాయి. దీంతో స్థానిక పారిశ్రామిక వేత్తల దృష్టి ఇటువైపు మళ్లడంతో పట్టణంలో ఫ్యాక్టరీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 20వరకు జిన్నింగ్ ఫ్యాక్టరీలు, 6 ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. మరో 12వరకు జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే వ్యసాయ సీజన్ ప్రారంభంలోగా వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా సమస్య..: గత నెల రెండోవారం వరకు కూడా సగటున మార్కెట్ యార్డుకు 20వేల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. దీంతో ఫ్యాక్టరీలకు ముడి సరుకు కొరత ఏర్పడలేదు. పట్టణంలోని అన్ని ఫ్యాక్టరీలు మూడు షిఫ్టుల్లో నడిచాయి. దాదాపు 10వేల మంది కార్మికుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే మెట్టభూములతోపాటు కొన్ని ప్రాంతాల్లో బోర్లు, కాల్వల కింద సాగు చేసిన పంట నుంచి దిగుబడులు పూర్తిగా చేతికందడం, రైతుల్లో చాలా మంది వాటిని ఇప్పటికే అమ్ముకోవడంతో యార్డుకు పత్తిరాక మందగించింది. దీంతో స్థానిక ఫ్యాక్టరీలకు ముడిసరుకు కొరత ఏర్పడింది.