ప్రజల రాష్ట్రపతిగా.. | Former President APJ Abdul Kalam Dies at 83 | Sakshi
Sakshi News home page

ప్రజల రాష్ట్రపతిగా..

Jul 28 2015 3:32 AM | Updated on Aug 20 2018 3:02 PM

మయన్మార్ పర్యటనలో చిన్నారికి కలాం ఆటోగ్రాఫ్.. - Sakshi

మయన్మార్ పర్యటనలో చిన్నారికి కలాం ఆటోగ్రాఫ్..

రాష్ట్రపతి అయ్యాక తొలిసారిగా కేరళకు వెళ్లిన కలాం తిరువనంతపురంలో రాజ్‌భవన్‌కు ఆహ్వానించిన వారిలో రొడ్డుపక్కనుండే...

రాష్ట్రపతి అయ్యాక తొలిసారిగా కేరళకు వెళ్లిన కలాం తిరువనంతపురంలో రాజ్‌భవన్‌కు ఆహ్వానించిన వారిలో రొడ్డుపక్కనుండే ఓ చిన్న హోటల్ యజమాని కూడా ఉన్నారు. శాస్త్రవేత్తగా అక్కడ పనిచేసిన కాలంలో కలాం ఆ చిన్నిహోటల్‌లోనే భోజనం చేసేవారు. ఏళ్ల తర్వాత కూడా ఆ హోటల్ యజమానికి గుర్తుపెట్టుకొని రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు .
 
అబ్దుల్‌కలాం 2002 - 2007 మధ్య రాష్ట్రపతి పదవి చేపట్టి.. ‘ప్రజల రాష్ట్రపతి’గా ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. కలాంకు భారత ‘మిసైల్ మ్యాన్’గా, అణ్వస్త్ర శాస్త్రవేత్తగా కీర్తిప్రతిష్టలు ఇనుమడించాయి. 2002లో నాటి రాష్ట్రపతిగా ఉన్న కె.ఆర్.నారాయణన్ పదవీకాలం ముగియటంతో ఆ ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం.. అబ్దుల్‌కలాంను తన రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు తెచ్చింది.

బీజేపీతో, ఎన్‌డీఏతో తీవ్రంగా విభేదించే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు, సమాజ్‌వాది పార్టీ కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించింది. అయితే.. కలాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం సారథ్యంలోని వామపక్షాలు ఆయనపై కెప్టెన్ లక్ష్మీసెహగల్‌ను రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో పోటీకి పెట్టాయి. కానీ.. ప్రభుత్వంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం మద్దతు కూడా ఉండటంతో నాటి ఎన్నికల్లో కలాం గెలుపు లాంఛనమే అయింది.  2002 జూలై 25న భారతదేశపు 11వ రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన కలాం.. 2007 జూలై 25 వరకూ ఆ పదవిలో కొనసాగారు.

రాష్ట్రపతి పదవి చేపట్టకముందే.. భారతరత్న అవార్డు పొందిన మూడో వ్యక్తి కలాం. (ఆయనకు ముందు డాక్టర్ సర్వేపల్లి రాథాకృష్ణన్, డాక్టర్ జాకీర్‌హుస్సేన్‌లు.. రాష్ట్రపతి పదవి చేపట్టటానికి ముందే భారతరత్న పురస్కారాలు పొందారు.)
 
* రాష్ట్రపతి అంటే.. భారత ప్రభుత్వాధినేతగా ప్రజలకు దూరంగా ఉంటారన్న పరిస్థితులు నెలకొన్న కాలంలో.. రాష్ట్రపతి భవన్‌ను ప్రజల ముంగిటకు తెచ్చి.. నిత్యం ప్రజలతో మమేమకమయిన కలాం.. ‘ప్రజల రాష్ట్రపతి’గా పేరుగాంచారు. ఎక్కడ ఏ సమావేశాల్లో పాల్గొన్నా.. యువతను ప్రత్యేకించి కాలేజీ, పాఠశాల విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడటం, వారిలో స్ఫూర్తినింపేందుకు తపించటం కలాం విశిష్టత.
* 2004 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కలాం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంతో.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టటానికి సంబంధించి తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్రపతి అబ్దుల్‌కలాం స్వయంగా సోనియా పౌరసత్వం అంశాన్ని ప్రశ్నించటం వల్ల ఆమె వెనక్కు తగ్గారన్న వార్తలు వచ్చాయి. కానీ.. సోనియాగాంధీని ప్రధానమంత్రిగా ప్రమాణం చేయటానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఆహ్వానిస్తూ తాను అప్పటికే లేఖను సిద్ధం చేశానని, ఆమె మన్మోహన్ పేరును నిర్ణయించటంతో ఆ లేఖలో మార్పులు చేయాల్సి వచ్చిందని కలాం ఇటీవల రాసిన ఒక పుస్తకంలో పేర్కొనటం విశేషం.  
 
విమర్శలు, వివాదాలు...
* రాష్ట్రపతిగా పదవిలో ఉన్న ఐదేళ్లలో తనవద్ద పెండింగ్‌లో ఉన్న 21 క్షమాభిక్ష పిటిషన్లలో 20 పిటిషన్లపై కలాం ఎటువంటి చర్యా చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది.. 2001లో భారత పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న అఫ్జల్‌గురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్. అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న ధనంజయ్‌ఛటర్జీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను మాత్రం కలాం తిరస్కరించారు.
* ఇక 2005 మే 23న బిహార్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన ఉదంతంలో కలాం రాజ్యాంగాన్ని, తన పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారని సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది.
 
కర్ణాటక సంగీతమంటే మక్కువ!
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్ కలాంకు శాస్త్రీయ సంగీతం.. అందులోనూ కర్ణాటక సంగీతమంటే ఎంతో అభిమానం. డీఆర్‌డీఎల్ డెరైక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన ప్రత్యేకంగా వీణ వాయిద్యం నేర్చుకున్నారు. ఓ అధ్యాపకురాలి పర్యవేక్షణలో వీణ నేర్చుకునేవారని ఆయనతో కలసి పనిచే సిన సహోద్యోగులు తెలిపారు. సంతూర్ వాయిద్యం అన్నా ఆయనకు ఎంతో మక్కువ. పరిశోధనల్లో ఎంత బిజీగా ఉన్నా తీరిక వేళల్లో సంగీత సాధనకు సమయం కేటాయించేవారు. ‘ఎందరో మహానుభావులు’ అనే త్యాగరాజ కీర్తనను అమితంగా ఇష్టపడేవారు. ‘హైదరాబాద్‌లో ఉన్నపుడు వీణ నేర్చుకున్నాను. మేడమ్ కల్యాణి గొప్ప టీచర్’ అని ఒకసారి గుర్తుచేసుకున్నారాయన.
 
ఎంతో స్ఫూర్తినిస్తూ..
శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించి ఎన్నో రచనలు చేసిన కలాం.. యువతలో ఉత్తేజం నింపే పుస్తకాలు కూడా ఎన్నో రచించారు. ఆయన రచనలో కొన్ని..
* ఇండియా 2020
* వింగ్స్ ఆఫ్ ఫైర్ (కలాం ఆత్మకథ)
* ఇగ్నైటెడ్ మైండ్స్
* ద ల్యూమినస్ స్పార్క్స్
* ఇన్‌స్పైరింగ్ థాట్స్
* యు ఆర్ బార్న్ టు బ్లాసమ్
* టర్నింగ్ పాయింట్స్: ఎ జర్నీ త్రూ చాలెంజెస్
* టార్గెట్ 3 బిలియన్స్
* మై జర్నీ: ట్రాన్స్‌ఫామింగ్ డ్రీమ్స్ ఇన్‌టు యాక్షన్స్
* ట్రాన్స్ మై స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ ప్రముఖ్ స్వామిజీ
 
అవార్డులు కోకొల్లలు..
ప్రపంచ దేశాల్లోని దాదాపు 40 ప్రఖ్యాత వర్సిటీల నుంచి కలాం గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. విద్యార్థులకు గొప్ప ప్రేరణ అందించినందుకు ఐక్యరాజ్యసమితి కలాం జన్మదినాన్ని(అక్టోబర్ 15) ‘వరల్డ్ స్టూడెంట్స్ డే’గా ప్రకటించింది. స్విట్జర్లాండ్ అయితే.. కలాం తమ దేశాన్ని సందర్శించిన రోజు(మే 26)ను సైన్స్ డేగా ప్రకటించుకుంది. కలాంను వరించిన ముఖ్య అవార్డులివీ..
 పద్మభూషణ్(1981), పద్మ విభూషణ్(1990), భారత రత్న(1997), ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు(1997), వీర సావర్కర్ అవార్డు(1998)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement