breaking news
adbul kalam passed away
-
కలలు కనడం నేర్పిన గురుబ్రహ్మ
-
ప్రజల రాష్ట్రపతిగా..
రాష్ట్రపతి అయ్యాక తొలిసారిగా కేరళకు వెళ్లిన కలాం తిరువనంతపురంలో రాజ్భవన్కు ఆహ్వానించిన వారిలో రొడ్డుపక్కనుండే ఓ చిన్న హోటల్ యజమాని కూడా ఉన్నారు. శాస్త్రవేత్తగా అక్కడ పనిచేసిన కాలంలో కలాం ఆ చిన్నిహోటల్లోనే భోజనం చేసేవారు. ఏళ్ల తర్వాత కూడా ఆ హోటల్ యజమానికి గుర్తుపెట్టుకొని రాజ్భవన్కు ఆహ్వానించారు . అబ్దుల్కలాం 2002 - 2007 మధ్య రాష్ట్రపతి పదవి చేపట్టి.. ‘ప్రజల రాష్ట్రపతి’గా ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. కలాంకు భారత ‘మిసైల్ మ్యాన్’గా, అణ్వస్త్ర శాస్త్రవేత్తగా కీర్తిప్రతిష్టలు ఇనుమడించాయి. 2002లో నాటి రాష్ట్రపతిగా ఉన్న కె.ఆర్.నారాయణన్ పదవీకాలం ముగియటంతో ఆ ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. అబ్దుల్కలాంను తన రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు తెచ్చింది. బీజేపీతో, ఎన్డీఏతో తీవ్రంగా విభేదించే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటు, సమాజ్వాది పార్టీ కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించింది. అయితే.. కలాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం సారథ్యంలోని వామపక్షాలు ఆయనపై కెప్టెన్ లక్ష్మీసెహగల్ను రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో పోటీకి పెట్టాయి. కానీ.. ప్రభుత్వంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం మద్దతు కూడా ఉండటంతో నాటి ఎన్నికల్లో కలాం గెలుపు లాంఛనమే అయింది. 2002 జూలై 25న భారతదేశపు 11వ రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన కలాం.. 2007 జూలై 25 వరకూ ఆ పదవిలో కొనసాగారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందే.. భారతరత్న అవార్డు పొందిన మూడో వ్యక్తి కలాం. (ఆయనకు ముందు డాక్టర్ సర్వేపల్లి రాథాకృష్ణన్, డాక్టర్ జాకీర్హుస్సేన్లు.. రాష్ట్రపతి పదవి చేపట్టటానికి ముందే భారతరత్న పురస్కారాలు పొందారు.) * రాష్ట్రపతి అంటే.. భారత ప్రభుత్వాధినేతగా ప్రజలకు దూరంగా ఉంటారన్న పరిస్థితులు నెలకొన్న కాలంలో.. రాష్ట్రపతి భవన్ను ప్రజల ముంగిటకు తెచ్చి.. నిత్యం ప్రజలతో మమేమకమయిన కలాం.. ‘ప్రజల రాష్ట్రపతి’గా పేరుగాంచారు. ఎక్కడ ఏ సమావేశాల్లో పాల్గొన్నా.. యువతను ప్రత్యేకించి కాలేజీ, పాఠశాల విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడటం, వారిలో స్ఫూర్తినింపేందుకు తపించటం కలాం విశిష్టత. * 2004 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కలాం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంతో.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టటానికి సంబంధించి తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్రపతి అబ్దుల్కలాం స్వయంగా సోనియా పౌరసత్వం అంశాన్ని ప్రశ్నించటం వల్ల ఆమె వెనక్కు తగ్గారన్న వార్తలు వచ్చాయి. కానీ.. సోనియాగాంధీని ప్రధానమంత్రిగా ప్రమాణం చేయటానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఆహ్వానిస్తూ తాను అప్పటికే లేఖను సిద్ధం చేశానని, ఆమె మన్మోహన్ పేరును నిర్ణయించటంతో ఆ లేఖలో మార్పులు చేయాల్సి వచ్చిందని కలాం ఇటీవల రాసిన ఒక పుస్తకంలో పేర్కొనటం విశేషం. విమర్శలు, వివాదాలు... * రాష్ట్రపతిగా పదవిలో ఉన్న ఐదేళ్లలో తనవద్ద పెండింగ్లో ఉన్న 21 క్షమాభిక్ష పిటిషన్లలో 20 పిటిషన్లపై కలాం ఎటువంటి చర్యా చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది.. 2001లో భారత పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న అఫ్జల్గురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్. అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న ధనంజయ్ఛటర్జీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను మాత్రం కలాం తిరస్కరించారు. * ఇక 2005 మే 23న బిహార్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన ఉదంతంలో కలాం రాజ్యాంగాన్ని, తన పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారని సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. కర్ణాటక సంగీతమంటే మక్కువ! సాక్షి, హైదరాబాద్: అబ్దుల్ కలాంకు శాస్త్రీయ సంగీతం.. అందులోనూ కర్ణాటక సంగీతమంటే ఎంతో అభిమానం. డీఆర్డీఎల్ డెరైక్టర్గా ఉన్న సమయంలో ఆయన ప్రత్యేకంగా వీణ వాయిద్యం నేర్చుకున్నారు. ఓ అధ్యాపకురాలి పర్యవేక్షణలో వీణ నేర్చుకునేవారని ఆయనతో కలసి పనిచే సిన సహోద్యోగులు తెలిపారు. సంతూర్ వాయిద్యం అన్నా ఆయనకు ఎంతో మక్కువ. పరిశోధనల్లో ఎంత బిజీగా ఉన్నా తీరిక వేళల్లో సంగీత సాధనకు సమయం కేటాయించేవారు. ‘ఎందరో మహానుభావులు’ అనే త్యాగరాజ కీర్తనను అమితంగా ఇష్టపడేవారు. ‘హైదరాబాద్లో ఉన్నపుడు వీణ నేర్చుకున్నాను. మేడమ్ కల్యాణి గొప్ప టీచర్’ అని ఒకసారి గుర్తుచేసుకున్నారాయన. ఎంతో స్ఫూర్తినిస్తూ.. శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించి ఎన్నో రచనలు చేసిన కలాం.. యువతలో ఉత్తేజం నింపే పుస్తకాలు కూడా ఎన్నో రచించారు. ఆయన రచనలో కొన్ని.. * ఇండియా 2020 * వింగ్స్ ఆఫ్ ఫైర్ (కలాం ఆత్మకథ) * ఇగ్నైటెడ్ మైండ్స్ * ద ల్యూమినస్ స్పార్క్స్ * ఇన్స్పైరింగ్ థాట్స్ * యు ఆర్ బార్న్ టు బ్లాసమ్ * టర్నింగ్ పాయింట్స్: ఎ జర్నీ త్రూ చాలెంజెస్ * టార్గెట్ 3 బిలియన్స్ * మై జర్నీ: ట్రాన్స్ఫామింగ్ డ్రీమ్స్ ఇన్టు యాక్షన్స్ * ట్రాన్స్ మై స్పిరిచ్యువల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ప్రముఖ్ స్వామిజీ అవార్డులు కోకొల్లలు.. ప్రపంచ దేశాల్లోని దాదాపు 40 ప్రఖ్యాత వర్సిటీల నుంచి కలాం గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. విద్యార్థులకు గొప్ప ప్రేరణ అందించినందుకు ఐక్యరాజ్యసమితి కలాం జన్మదినాన్ని(అక్టోబర్ 15) ‘వరల్డ్ స్టూడెంట్స్ డే’గా ప్రకటించింది. స్విట్జర్లాండ్ అయితే.. కలాం తమ దేశాన్ని సందర్శించిన రోజు(మే 26)ను సైన్స్ డేగా ప్రకటించుకుంది. కలాంను వరించిన ముఖ్య అవార్డులివీ.. పద్మభూషణ్(1981), పద్మ విభూషణ్(1990), భారత రత్న(1997), ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు(1997), వీర సావర్కర్ అవార్డు(1998) -
స్వదేశీ రాకెట్లు, క్షిపణుల సృష్టికర్త
నేటి ప్రయోగాలకు నాడే బీజం సాక్షి, సూళ్లూరుపేట: నేడు ఇస్రో భారీ రాకెట్ ప్రయోగాలు చేస్తోందంటే.. ఆనాడు కలాం వేసిన బీజాలే అందుకు కారణం. 1973 నుంచి 1982 దాకా ఎస్ఎల్వీ ప్రాజెక్ట్ డెరైక్టర్గా ఆయన పనిచేశారు. 1979, ఆగస్టు 10న కలాం చేపట్టిన ఎస్ఎల్వీ-2ఇ1 ప్రయోగం విఫలం కావడంతో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. ఆ సయమంలో ఒక అపజయం.. మున్ముందు విజయాలకు కారణమవుతుందంటూ శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. అదే ఎస్ఎల్వీ రాకెట్ను 1980లో మరోసారి ప్రయోగించి విజయం సాధించారు. ఆ విజయమే ఇప్పుడే దేశం గర్వించే ప్రయోగాలకు రాచబాటగా మారింది. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పట్టాపొందిన తర్వాత 1960లో డాక్టర్ అబ్దుల్కలాం భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ముఖ్య శాస్త్రవేత్తగా చేరారు. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ను రూపొందించటం ద్వారా తన కెరీర్ను ఆరంభించారు. ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధకుడైన విక్రమ్సారాభాయ్ ఆధ్వర్యంలోని ఇన్కోస్పార్ కమిటీలో సభ్యుడిగా కూడా కలాం పనిచేశారు. 1965 లోనే డీఆర్డీఓలో విస్తృతపరచగలగిన రాకెట్పై స్వతంత్రంగా పరిశోధనలు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 1969లో ప్రభుత్వ అనుమతి లభించటంతో మరింత మంది ఇంజనీర్లను ప్రాజెక్టులో చేర్చుకున్నారు. ఇస్రోలో స్వదేశీ రాకెట్ల అభివృద్ధి... 1969లో ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు బదిలీ అయ్యారు. అక్కడ తొలిసారి దేశీయంగా తయారు చేసిన ఉపగ్రహ వాహక నౌక (ఎస్ఎల్వీ-3) ప్రాజెక్టుకు డెరైక్టర్గా పనిచేశారు. ఎస్ఎల్వీ-3 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి సమీప కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 1963-64 మధ్య కాలంలో కలాం అమెరికాలోని నాసాకు చెందిన లాంగ్లే రీసెర్చ్ సెంటర్ (వర్జీనియాలోని హ్యాంప్టన్లో), గోడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (మేరీల్యాండ్లోని గ్రీన్బెల్ట్లో), వ్యాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ (వర్జీనియా తూర్పు తీరంలో)లను సందర్శించారు. 1970-90 దశకాల మధ్య పోలార్ ఎస్ఎల్వీ, ఎస్ఎల్వీ-3 రాకెట్ల అభివృద్ధి కోసం కలాం కృషి చేశారు. అవి రెండూ విజయవంతమయ్యాయి. స్వదేశీ రాకెట్ల నుంచి క్షిపణుల తయారీ... 1970 దశకంలోనే కలాం రెండు ప్రాజెక్టులకు డెరైక్టర్గా వ్యవహరించారు. ఒకటి ప్రాజెక్ట్ డెవిల్, రెండోది ప్రాజెక్ట్ వాలియంట్. విజయవంతమైన ఎస్ఎల్వీ రాకెట్ల కార్యక్రమం నుంచి ఖండాంతర క్షిపణులు తయారు చేయటం ఈ ప్రాజెక్టుల లక్ష్యం. నాటి రక్షణమంత్రి ఆర్.వెంకటరామన్ సూచనల మేరకు.. ఒక క్షిపణి తర్వాత మరొక క్షిపణిని ప్రణాళిక మేరకు అభివృద్ధి చేయటం కాకుండా.. ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ఒక క్షిపణుల శ్రేణిని అభివృద్ధి చేయటంపై కలాం, నాటి రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు వి.ఎస్.అరుణాచలంలు కృషిచేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. అగ్ని (మధ్య శ్రేణి ఖండాంతర క్షిపణి), పృథ్వి (భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే వ్యూహాత్మక క్షిపణి) అభివృద్ధిలో కలాం ప్రధాన భూమిక పోషించారు. ఈ కార్యక్రమంతో కలాంకు ‘మిసైల్ మ్యాన్’ అనే మారు పేరు వచ్చింది. పోఖ్రాన్.. అణ్వస్త్ర పరిశోధకుడిగా ఖ్యాతి కలాం.. 1992 జూలై నుంచి 1999 డిసెంబర్ వరకూ ప్రధానమంత్రికి ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా, డీఆర్డీఓ కార్యదర్శిగా పనిచేశారు. 1998లో పోఖ్రాన్-2 పేరుతో భారత అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించారు. ఈ విషయంలో కలాం చాలా క్రియాశీలమైన సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. అణ్వస్త్ర పరీక్షల దశలో కలాం మరో శాస్త్రవేత్త ఆర్.చిదంబరంతో కలిసి చీఫ్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఆ పరీక్షలతో భారత దేశపు ఉన్నతస్థాయి అణుశాస్త్రవేత్తగా జాతీయ హీరోగా కలాం ఖ్యాతిపొందారు. -
పేదరికాన్ని ఓడించి..
పేదరికమనే నేలను దాటి నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసిన క్షిపణి. భారత శాస్త్ర పరిశోధనను అంతరిక్షంలో సరికొత్త దూరాలకు తీసుకెళ్లిన రాకెట్టు. ఈ దేశ అమ్ములపొదిని మరింత బలోపేతం చేసిన అణ్వస్త్రం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఏనాడూ కించిత్ గర్వం ప్రదర్శించటం తెలియని నిగర్వి. స్వార్థం వల్లే అవినీతికి పాల్పడతారన్న తన ఆలోచనలతో.. తనకు ఏ స్వార్థం ఉండరాదని వైవాహిక, కుటుంబ జీవితమే వద్దని.. జగమంతా తన కుటుంబమని భావించిన నిస్వార్థపరుడు. భారతదేశం వైజ్ఞానికంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందటానికి ఒక ‘విజన్’ అందించిన మార్గదర్శి. దేశ రాజ్యాధినేతగా ఉండి.. రాజసౌధానికే పరిమితం కాకుండా.. నిరంతరం సాధారణ జనంతో మమేకమైన సామాన్యుడు. మతమేదైనా మానవత్వమే మిన్న అని నినదించిన ప్రబోధకుడు. బడికి వెళ్లే చిన్నారుల్లో, కాలేజీల్లో చదివే యువతరంలో కలలు పుట్టిస్తూ.. ఆశల రెక్కలు తొడుగుతూ నిరంతర స్ఫూర్తిని నింపటమే ధ్యేయంగా పనిచేసిన నిత్య ఉపాధ్యాయుడు. ఆ మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాంకు ‘సాక్షి’ సలాం! * బాల్యంలో కటిక దారిద్య్రం అనుభవించిన కలాం * కుటుంబానికి సాయంగా పేపర్బాయ్గా పనిచే సిన ‘మిసైల్ మ్యాన్’ * చిన్నప్పట్నుంచే ఎంతో క్రమశిక్షణ * కిరోసిన్ దీపాల వెలుతురులో చదువు.. స్కూల్లో టీచర్ల ప్రేరణతో మున్ముందుకు.. అది పేద ముస్లిం కుటుంబం.. తండ్రి బోటు యజమాని.. చాలీచాలని సంపాదన.. ఆరుగురు తోబుట్టువులు.. కటిక పేదరికం..! అత్యంత సాధారణమైన ఆ కుటుంబం నుంచే దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పుట్టుకొచ్చాడు. తన ఆలోచనలతో యువత గుండెలో ‘అగ్ని’ రగిలించాడు. యువతనే కాదు.. దేశాన్నే నవ్యపథంలోకి నడిపించాడు. ఆయనే ‘భారత మిసైల్ మ్యాన్’గా పేరొందిన అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం!! కరెంటు లేని ఇంటి నుంచి.. 1931, అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జైనులబ్దీన్, ఆషియమ్మ దంపతులకు జన్మించిన కలాం.. చిన్నతనంలో కడు పేదరికాన్ని చవిచూశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు బాల్యం నుంచే ఆయన ఆలోచనలు విభిన్నం. కష్టపడే మనస్తత్వం. ఇంట్లో, స్కూల్లో చాలా క్రమశిక్షణతో నడుచుకునేవాడు. తల్లిదండ్రుల కష్టాలు చూసి వారికి చేదోడువాడుగా నిలిచేందుకు పేపర్బాయ్గా పనిచేశాడు. చిన్నప్పట్నుంచే వేకువజామున 4 గంటలకు నిద్ర లేవడం కలాంకు అలవాటు. లేవగానే గణితం నేర్చుకునేందుకు మాస్టారు వద్దకు వెళ్లేవాడు. తర్వాత సమీప బంధువు షంషుద్దీన్తో కలిసి రామేశ్వరంలో పేపర్ వేసేందుకు వెళ్లేవాడు. ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. రాత్రి, వేకువజామున కిరోసిన్ దీపాల వెలుతురులోనే చదువుకునేవాడు. కలాం కష్టపడే మనస్తత్వాన్ని చూసి టీచర్లు ఎంతగానో ప్రోత్సహించేవారు. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే... ‘ఎందుకో జరగలేదంతే’ అనేది కలాం సమాధానం. ఇంత పెద్ద కుటుంబంలో (ఐదుగురు అబ్బాయిలు, ఒక సోదరి) ఒక్కరు పెళ్లి చేసుకోకపోతే నష్టమేంటి. వీరిలో చాలామందికి నేను అండగా ఉన్నాను. బంధువులతో టచ్లో ఉంటాను. ఎప్పుడూ ఒంటరితనం ఫీలవ్వలేదు’ అని చెప్పేవారాయన. కలాం శాకాహారి. 1950లో తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో స్కాలర్షిప్తో చదువుకున్నారు. స్కాలర్షిప్ కింద వచ్చే డబ్బుతో మాంసం, చేపలు తినడం అయ్యే పనికాదని మానేశారు. ‘ఆర్థిక పరిస్థితులే నన్ను శాకాహారిని చేశాయి. అయితే నాకు అదే నచ్చడంతో అలా శాకాహారిగానే ఉండిపోయాను’ అని ఒక సందర్భంలో చెప్పారు. పైలట్ అవకాశం కొద్దిలో కోల్పోయి.. గణితంపై మక్కువ పెంచుకున్న కలాం.. రామనాథపురంలో మెట్రిక్యులేషన్ పూర్తికాగానే తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరారు. 1954లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో పీజీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఏడాది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివేందుకు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో చేరారు. ఓ ప్రాజెక్టు విషయంలో సరైన ప్రతిభ కనబర్చకపోవడంతో ప్రొఫెసర్.. కలాంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మూడ్రోజుల్లో ప్రాజెక్టు పూర్తి చేయకుంటే స్కాలర్షిప్ నిలిపివేస్తానని చెప్పాడు. ఆశ్చర్యంగా ఆ మూడ్రోజుల్లో కలాం ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రొఫెసర్తో శెభాష్ అనిపించుకున్నారు. యుద్ధవిమానాల పైలట్ కావాలని కలాం ఆశించినా.. కొద్దిలో ఆ అవకాశాన్ని కోల్పాయారు. అప్పుడు భారత వైమానిక దళంలో ఎనిమిది పోస్టులే ఉండగా.. కలాం తొమ్మిదో స్థానంలో నిలవడంతో అవకాశం చేజారింది! ఎంఐటీలో విద్యాభ్యాసం తర్వాత కలాం డీఆర్డీవోలో చేరి, అంచెలంచలుగా ఎదిగారు. 1969లో ఇస్రోకు బదిలీ అయిన కలాం అక్కడ.. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ను ప్రపంచ దేశాల సరసన నిలబెట్టే అద్భుత విజయాలను అందించారు. దేశానికి మొదటి బ్రహ్మచారి రాష్ట్రపతి.. దేశానికి తొలి బ్యాచిలర్ రాష్ట్రపతిగా ఎన్నికైన కలాం.. ఆ పదవికే వన్నె తెచ్చారు. 2002, జూలై 18న ఆయన దేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2007 వరకు పూర్తికాలం రాష్ట్రపతిగా కొనసాగారు. ఓ శాస్త్రవేత్త ఈ అత్యున్నత పీఠాన్ని అధిష్టించడం కూడా అదే తొలిసారి! రాష్ట్రపతి ఓ ‘రబ్బర్స్టాంపు’ అనే అపోహను కూడా తుడిచిపారేశారు. లాభదాయక బిల్లును వెనక్కి తిప్పి పంపి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఆ మరుసటి రోజే నాటి ప్రధాని మన్మోహన్సింగ్.. కలాం వద్దకు వెళ్లి వివరణ ఇచ్చుకొని, బిల్లుకు ఆమోదముద్ర వేయించుకున్నారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ కలలు కనండి.. ఆ కలల్ని నిజం చేసుకోండి విభిన్నంగా ఆలోచించే, కొత్త ఆవిష్కరణలు చేసే, తెలియని కొత్త మార్గంలో వెళ్లేలా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా ధైర్యాన్ని కూడగట్టుకోండి. సమస్యలను అణచివేయండి. విజయం సాధించండి.. ఇదే యువతకు నా సందేశం ♦ అడ్డంకులను అధిగమించినప్పుడే, ఓటమి చెందినప్పుడే మనలో దాగి ఉన్న ధైర్యం, సామర్థ్యం బయటపడతాయి. ♦ ఎత్తుకు ఎదగాలంటే సామర్థ్యం ఉండాలి. అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్నా.. మీ ప్రస్తుత కెరీర్లో ఎదగాలన్నా.. ♦ మన పిల్లల మంచి రేపటి (భవిష్యత్) కోసం.. మనం ఈ రోజును త్యాగం చేద్దాం.. ♦ శ్రమించి పనిచేసేవారికే దేవుడు తనవంతు తోడ్పాటు అందిస్తాడు. ఇది చాలా సుస్పష్టం. ♦ మనుషులకు కష్టాలు అవసరమే. అవి ఉంటేనే విజయాన్ని ఆస్వాదించగలం ♦ మనం ఎప్పటికీ లొంగిపోవద్దు, సమస్యలు మనల్ని ఓడించేందుకు అంగీకరించొద్దు ♦ విద్యార్థికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ప్రశ్నించేతత్వం. వారిని ప్రశ్నించనివ్వండి ♦ హృదయపూర్వకంగా పనిచేయనివారు గెలవగలరు, కానీ అది అసంపూర్ణమే. హృదయపూర్వకం కాని విజయం చేదునే మిగుల్చుతుంది ♦ మనపై మనకు నమ్మకం, విశ్వాసంతోనే ఆత్మగౌరవం వస్తుందని మనం గుర్తించలేమా? - వివిధ సందర్భాల్లో అబ్దుల్ కలాం చెప్పిన స్ఫూర్తిదాయక మాటలివీ.. (కలాం సంతకం) -
కలలు కనడం నేర్పిన గురుబ్రహ్మ
అది 2002. చెన్నైలో అన్నా యూనివర్సిటీలో కలాం తనకెంతో ఇష్టమైన పని చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ప్రధాని వాజ్పేయి నుంచి ఫోన్. క్లాస్రూములో ఉన్నందువల్ల ఫోన్ను రిసీవ్ చేసుకోలేకపోయారు. బయటికొచ్చాక ప్రధానికి కాల్ చేశారు. వాజ్పేయి... ‘రాష్ట్రపతి పదవి చేపడతారా?’. గంట సమయం అడిగారు కలాం. ఈలోగా హితులు, శ్రేయోభిలాషులు, మిత్రులతో మాట్లాడారు. 60 శాతం మంది బాగుంటుందని చెబితే, 40 శాతం వద్దన్నారు. మెజారిటీ వైపే మొగ్గారు కలాం. ఎందుకో తెలుసా... రాష్ట్రపతి అయితే దేశం గురించి, విద్య గురించి, యువత గురించి తన ఆలోచనలను పంచుకోవడానికి ఓ పెద్ద వేదిక దొరుకుతుందనేది ఆయన భావన. మనం మన తల్లిదండ్రుల తర్వాత అంత విలువనిచ్చే గురువు ఎలా ఉండాలో నేర్పిన ‘గురుబ్రహ్మ’ అబ్దుల్ కలాం. పిల్లలంటే ఎంతో ఇష్టపడే ఆయనకు.. వారికి పాఠాలు నేర్పడమూ అంతే ఇష్టం. విద్యార్థులకు ‘చదువు చెప్పడం’ కాదు.. ‘చదువు నేర్పాల’న్న అధ్యాపకుడు ఆయన. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వాన్ని పాదుకొల్పాలని, అదే జ్ఞానానికి మార్గమని కలాం తరచూ చెప్పేవారు. స్వతంత్ర భారతావనిలో జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ల తరువాత బాలలు, విద్యార్థి లోకంతో అంతటి అనుబంధం ఉన్నది అబ్దుల్ కలాంకే. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా... పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఇలా విద్యా సంస్థలను సందర్శించి, అక్కడి పిల్లలతో గడిపేందుకు, వారితో ఎక్కువసేపు మాట్లాడేందుకే ప్రాధాన్యమిచ్చేవారు. సృజనాత్మకతను మేలుకొల్పాలి.. తన కెరీర్ తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అబ్దుల్ కలాం.. ఉద్యోగం నుంచి రిటైరైన తర్వాత 2001లో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో టెక్నాలజీ, సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రొఫెసర్గా చేరారు. 2002 నుంచి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన... ఆ బాధ్యతల నుంచి రిలీవ్కాగానే తిరిగి బోధనా వృత్తినే చేపట్టారు. విద్యార్థిలోకాన్ని, యువతను తన ప్రసంగాలు, రచనల ద్వారా అబ్దుల్ కలాం వెన్నుతట్టి లేపారు. ప్రాథమిక స్థాయిలోనే టీచర్లు పిల్లల్లో సృ జనాత్మకతను తీసుకురావడానికి మంచి సమయమని చెప్పేవారు. దేశంలో యూనివర్సిటీ విద్యను సమూలంగా సంస్కరించాలని అబ్దుల్ కలాం సూచించారు. ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకులుగా నిలవాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని గట్టిగా చెప్పిన కలాం... దేశంలోని పిల్లలందరికే కాదు టీచర్లకూ మార్గదర్శకుడిగా నిలిచారు. -
హైదరాబాద్తో విడదీయరాని బంధం
నగరమంటే కలాంకు ఎంతో ఇష్టం ఆ మాట ఆత్మకథలోనూ రాసుకున్నారు శాస్త్రవేత్తగా ఇక్కడపలు కీలక పరిశోధనలు వందకు పైగా స్కూళ్లు, కాలేజీల్లో ప్రసంగాలు సెంట్రల్ వర్సిటీతోనూ ఎంతో అనుబంధం పిల్లలకు, యువతకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ ఎంతో అందమైన నగరం. నగరంలో రాక్ గార్టెన్స్ అద్భుతంగా ఉంటాయి. నగర శివార్లలో కనిపించే గుట్టలు, కొండలు చూస్తుంటే కదలాలనిపించదు. ఒకదానిపైన ఒకటి ఎవరో పేర్చినట్టుండే రాళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ నగరమంటే నాకెంతో ఇష్టం’’- హైదరాబాద్పై కలామ్కున్న ప్రేమ ఆయన నోట వచ్చిన ఈ వాక్యాల్లోని ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. నగరంతో ఆయనకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. హైదరాబాద్తో తన బంధాన్ని తన జీవిత చరిత్రలోనూ ఆప్యాయంగా రాసుకున్నారాయన. శాస్త్రవేత్తగానే గాక పరిశోధకుడిగా, తత్వవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కలాం హైదరాబాద్ ప్రజల మనస్సు దోచుకున్నారు. సెంట్రల్ వర్సిటీకి చిరకాల నేస్తం హైదరాబాద్ డిఫెన్స్ లేబొరేటరీలో విధులు నిర్వహించే రోజుల్లోనే క్రమం తప్పకుండా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లేవారు. విద్యార్థులతో ఇష్టాగోష్ఠుల్లో ఎంతో ఇష్టంగా పాల్గొనేవారు. వారితో మమేకమయ్యేవారు. అప్పటి వైస్ చాన్సలర్ పల్లె రామారావు, కలాం గొప్ప స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘కలాం రావూస్’ స్కూల్ పెట్టాలనుకున్నారు కూడా. చదువులో వెనకబడే విద్యార్థులను మాత్రమే అందులో చేర్చించుకొని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని భావించారు. అందుకోసం హైటెక్ సిటీలో స్థలం కొనుగోలు చేశారు కూడా. ఎందుకోగానీ అది కార్యరూపం దాల్చలేదు. కోట హరినారాయణ సెంట్రల్ వర్సిటీ వీసీగా ఉండగా ఎన్నో ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నారు కలాం. విద్యార్ధి సంఘాలతోనూ ఆయనకు పరిచయముంది. ఎప్పుడైనా ప్రసంగం తరవాత ‘ఎనీ క్వశ్చన్స్?’ అని అడగడం కలాంకు బాగా అలవాటు. ఓసారి అలాగే సెంట్రల్ వర్సిటీ స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం తర్వాత కూడా అలాగే అడగటంతో విస్తుపోవడం విద్యార్థుల వంతైంది. నగరవాసులకు ఎంతో ఇష్టుడు కలాం గొప్ప ప్రకృతి ప్రేమికుడు. ఇక పిల్లలంటే ఆయనకెంతో ప్రేమ. కొద్దిగా మూసిన కళ్లు, పెదాలపై చెరగని చిరునవ్వుతో చేయి పెకైత్తి చేసే అభివాదం, పొడవాటి జులపాలను పైకి ఎగదోసుకుంటూ చేసే గంభీరమైన ఉపన్యాసాలు, సభికుల నుంచి ప్రశ్నలు ఆహ్వానిస్తూ, వాటికి సమాధానాలిస్తూ సాగే కలాం సభల దృశ్యాలు అందరికీ చిరపరిచితమే. హైదరాబాద్లో వందకు పైగా స్కూళ్లు, కాలేజీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. పిల్లలు, యువకులతో ఎప్పుడు మాట్లాడినా శాస్త్ర పరిశోధనలపైనే ఎక్కువగా చర్చించేవారు. ‘స్కోప్’తో కలిసి ఉద్యమం ప్రాణాంతక పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా నగరంలో స్కోప్ అనే స్వచ్చంద సంస్థ చేపట్టిన ప్రచారోద్యమానికి కూడా కలాం స్పూర్తిగా నిలిచారు. వంద కోట్ల సంతకాల సేకరణలో తొలి సంతకం తానే చేశారు. లీడ్ ఇండియా సంస్థతో కలిసి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతిగా కూడా భారతీయ విద్యాభవన్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ మహీంద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 2015 మే 14న వచ్చిందే హైదరాబాద్లో కలాం చివరి కార్యక్రమం. -
హైదరాబాద్లో ఆర్సీఐ సృష్టికర్త
హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గొప్ప క్షిపణి శాస్త్రవేత్త, దివంగత మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్ నగరంతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఎనభయ్యో దశకంలో ఒకవైపు డీఆర్డీఎల్ (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లేబొరేటరీ) సారథ్య బాధ్యతలను నిర్వహిస్తున్న సమయంలోనే హైదరాబాద్ శివార్లలోని మల్లాపూర్లో క్షిపణి ప్రయోగాలకు సంబంధించి రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) కు సృష్టికర్తగా నిలిచారు. కలాం ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆర్సీఐ ప్రారంభ డెరైక్టర్గా ఆయనను నియమించింది. ఆయన మార్గదర్శకత్వంలో అగ్ని,ఆకాశ్ క్షిపణుల ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్నట్లు ప్రస్తుతం ఆర్సీఐలో అసోసియేట్ డెరైక్టర్గా పనిచేస్తున్న మూర్తి ‘సాక్షి’కి తెలిపారు. ఆయనతో తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్సీఐ బాధ్యతలు చేపట్టిన కలాం అందరితో కలివిడిగా,స్నేహపూర్వకంగా ఉండేవారని,హోదా రీత్యా ఏనాడూ గర్వంగా వ్యవహరించలేదన్నారు. తాను ఎంతో కష్టపడి పనిచేయడంతోపాటు ప్రయోగ సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడూ మొక్కవోని దీక్ష,పట్టుదలతో వ్యవహరించి ఆ సమస్యను పరిష్కరించే వరకూ అక్కడి నుంచి వెనుదిరిగే వారు కాదని గుర్తుచేసుకున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అర్థరాత్రి రెండు గంటల సమయం అయినా తమతోనే ఉండేవారన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో అందరినీ పరిశోధనల దిశగా ప్రోత్సహించేవారని,ఉత్తేజపూరితంగా పనిచేసేవారన్నారు. మా అందరిలో స్ఫూర్తిని నింపిన ఆయన లేని లోటు తీరనిదన్నారు. క్షిపణి ప్రయోగాల్లో ఆయన సృష్టించిన సాంకేతికతే నేటికీ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. భారతదేశ ఖ్యాతి దశదిశలా వ్యాపింపజేసిన ‘ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’కు ఆయనే సారథి అని కొనియాడారు. ఆర్సీఐ డెరైక్టర్గా ఉన్నప్పుడు ల్యాబ్లో పనిచేస్తున్నవారు ఎంత చిన్నవారైనా వారిని నేరుగా తనతో మాట్లాడేందుకు అనుమతించడం ఆయన సమున్నత వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. -
సలాం సర్..
జననం: 15-10-1931, మరణం: 27-7-2015 నిప్పులు చిమ్ముతూ నింగికేగే ‘క్షిపణి’ అతడు.. ప్రేమను నింపుతూ గుండెను తాకే మనిషి అతడు! ఒక తరం యువజనాన్ని కలల అంచున నడిపించిన సారథి.. ఆ కలలకు ఆవలి తీరం చేరగలిగే మంత్రాన్ని ఉపదేశించిన మహామహోపాధ్యాయుడు మన కాలపు మహాద్భుతం అతడు! మన దేశపు జాతీయ పతాకం అతడు!! రాజ మందిరాన్ని సామాన్యుడికి చేరువ చేసిన తత్వజ్ఞాని అతడు అతడు రాజు... అతడు పేద రాజు మరణించె.. ఒక తార రాలిపోయే, ఈ పేద మరణించె.. ధ్రువతార గగనమేగె!!