
2015 జనవరిలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో..
పేదరికమనే నేలను దాటి నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసిన క్షిపణి.
పేదరికమనే నేలను దాటి నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసిన క్షిపణి. భారత శాస్త్ర పరిశోధనను అంతరిక్షంలో సరికొత్త దూరాలకు తీసుకెళ్లిన రాకెట్టు. ఈ దేశ అమ్ములపొదిని మరింత బలోపేతం చేసిన అణ్వస్త్రం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఏనాడూ కించిత్ గర్వం ప్రదర్శించటం తెలియని నిగర్వి. స్వార్థం వల్లే అవినీతికి పాల్పడతారన్న తన ఆలోచనలతో.. తనకు ఏ స్వార్థం ఉండరాదని వైవాహిక, కుటుంబ జీవితమే వద్దని.. జగమంతా తన కుటుంబమని భావించిన నిస్వార్థపరుడు. భారతదేశం వైజ్ఞానికంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందటానికి ఒక ‘విజన్’ అందించిన మార్గదర్శి.
దేశ రాజ్యాధినేతగా ఉండి.. రాజసౌధానికే పరిమితం కాకుండా.. నిరంతరం సాధారణ జనంతో మమేకమైన సామాన్యుడు. మతమేదైనా మానవత్వమే మిన్న అని నినదించిన ప్రబోధకుడు. బడికి వెళ్లే చిన్నారుల్లో, కాలేజీల్లో చదివే యువతరంలో కలలు పుట్టిస్తూ.. ఆశల రెక్కలు తొడుగుతూ నిరంతర స్ఫూర్తిని నింపటమే ధ్యేయంగా పనిచేసిన నిత్య ఉపాధ్యాయుడు. ఆ మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాంకు ‘సాక్షి’ సలాం!
* బాల్యంలో కటిక దారిద్య్రం అనుభవించిన కలాం
* కుటుంబానికి సాయంగా పేపర్బాయ్గా పనిచే సిన ‘మిసైల్ మ్యాన్’
* చిన్నప్పట్నుంచే ఎంతో క్రమశిక్షణ
* కిరోసిన్ దీపాల వెలుతురులో చదువు.. స్కూల్లో టీచర్ల ప్రేరణతో మున్ముందుకు..
అది పేద ముస్లిం కుటుంబం.. తండ్రి బోటు యజమాని.. చాలీచాలని సంపాదన.. ఆరుగురు తోబుట్టువులు.. కటిక పేదరికం..! అత్యంత సాధారణమైన ఆ కుటుంబం నుంచే దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పుట్టుకొచ్చాడు. తన ఆలోచనలతో యువత గుండెలో ‘అగ్ని’ రగిలించాడు. యువతనే కాదు.. దేశాన్నే నవ్యపథంలోకి నడిపించాడు. ఆయనే ‘భారత మిసైల్ మ్యాన్’గా పేరొందిన అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం!!
కరెంటు లేని ఇంటి నుంచి..
1931, అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జైనులబ్దీన్, ఆషియమ్మ దంపతులకు జన్మించిన కలాం.. చిన్నతనంలో కడు పేదరికాన్ని చవిచూశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు బాల్యం నుంచే ఆయన ఆలోచనలు విభిన్నం. కష్టపడే మనస్తత్వం. ఇంట్లో, స్కూల్లో చాలా క్రమశిక్షణతో నడుచుకునేవాడు. తల్లిదండ్రుల కష్టాలు చూసి వారికి చేదోడువాడుగా నిలిచేందుకు పేపర్బాయ్గా పనిచేశాడు. చిన్నప్పట్నుంచే వేకువజామున 4 గంటలకు నిద్ర లేవడం కలాంకు అలవాటు.
లేవగానే గణితం నేర్చుకునేందుకు మాస్టారు వద్దకు వెళ్లేవాడు. తర్వాత సమీప బంధువు షంషుద్దీన్తో కలిసి రామేశ్వరంలో పేపర్ వేసేందుకు వెళ్లేవాడు. ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. రాత్రి, వేకువజామున కిరోసిన్ దీపాల వెలుతురులోనే చదువుకునేవాడు. కలాం కష్టపడే మనస్తత్వాన్ని చూసి టీచర్లు ఎంతగానో ప్రోత్సహించేవారు.
పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే... ‘ఎందుకో జరగలేదంతే’ అనేది కలాం సమాధానం. ఇంత పెద్ద కుటుంబంలో (ఐదుగురు అబ్బాయిలు, ఒక సోదరి) ఒక్కరు పెళ్లి చేసుకోకపోతే నష్టమేంటి. వీరిలో చాలామందికి నేను అండగా ఉన్నాను. బంధువులతో టచ్లో ఉంటాను. ఎప్పుడూ ఒంటరితనం ఫీలవ్వలేదు’ అని చెప్పేవారాయన.
కలాం శాకాహారి. 1950లో తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో స్కాలర్షిప్తో చదువుకున్నారు. స్కాలర్షిప్ కింద వచ్చే డబ్బుతో మాంసం, చేపలు తినడం అయ్యే పనికాదని మానేశారు. ‘ఆర్థిక పరిస్థితులే నన్ను శాకాహారిని చేశాయి. అయితే నాకు అదే నచ్చడంతో అలా శాకాహారిగానే ఉండిపోయాను’ అని ఒక సందర్భంలో చెప్పారు.
పైలట్ అవకాశం కొద్దిలో కోల్పోయి..
గణితంపై మక్కువ పెంచుకున్న కలాం.. రామనాథపురంలో మెట్రిక్యులేషన్ పూర్తికాగానే తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరారు. 1954లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో పీజీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఏడాది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివేందుకు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో చేరారు. ఓ ప్రాజెక్టు విషయంలో సరైన ప్రతిభ కనబర్చకపోవడంతో ప్రొఫెసర్.. కలాంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
మూడ్రోజుల్లో ప్రాజెక్టు పూర్తి చేయకుంటే స్కాలర్షిప్ నిలిపివేస్తానని చెప్పాడు. ఆశ్చర్యంగా ఆ మూడ్రోజుల్లో కలాం ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రొఫెసర్తో శెభాష్ అనిపించుకున్నారు. యుద్ధవిమానాల పైలట్ కావాలని కలాం ఆశించినా.. కొద్దిలో ఆ అవకాశాన్ని కోల్పాయారు. అప్పుడు భారత వైమానిక దళంలో ఎనిమిది పోస్టులే ఉండగా.. కలాం తొమ్మిదో స్థానంలో నిలవడంతో అవకాశం చేజారింది! ఎంఐటీలో విద్యాభ్యాసం తర్వాత కలాం డీఆర్డీవోలో చేరి, అంచెలంచలుగా ఎదిగారు. 1969లో ఇస్రోకు బదిలీ అయిన కలాం అక్కడ.. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ను ప్రపంచ దేశాల సరసన నిలబెట్టే అద్భుత విజయాలను అందించారు.
దేశానికి మొదటి బ్రహ్మచారి రాష్ట్రపతి..
దేశానికి తొలి బ్యాచిలర్ రాష్ట్రపతిగా ఎన్నికైన కలాం.. ఆ పదవికే వన్నె తెచ్చారు. 2002, జూలై 18న ఆయన దేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2007 వరకు పూర్తికాలం రాష్ట్రపతిగా కొనసాగారు. ఓ శాస్త్రవేత్త ఈ అత్యున్నత పీఠాన్ని అధిష్టించడం కూడా అదే తొలిసారి! రాష్ట్రపతి ఓ ‘రబ్బర్స్టాంపు’ అనే అపోహను కూడా తుడిచిపారేశారు. లాభదాయక బిల్లును వెనక్కి తిప్పి పంపి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఆ మరుసటి రోజే నాటి ప్రధాని మన్మోహన్సింగ్.. కలాం వద్దకు వెళ్లి వివరణ ఇచ్చుకొని, బిల్లుకు ఆమోదముద్ర వేయించుకున్నారు.
- సాక్షి, సెంట్రల్ డెస్క్
కలలు కనండి.. ఆ కలల్ని నిజం చేసుకోండి
విభిన్నంగా ఆలోచించే, కొత్త ఆవిష్కరణలు చేసే, తెలియని కొత్త మార్గంలో వెళ్లేలా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా ధైర్యాన్ని కూడగట్టుకోండి. సమస్యలను అణచివేయండి. విజయం సాధించండి.. ఇదే యువతకు నా సందేశం
♦ అడ్డంకులను అధిగమించినప్పుడే, ఓటమి చెందినప్పుడే మనలో దాగి ఉన్న ధైర్యం, సామర్థ్యం బయటపడతాయి.
♦ ఎత్తుకు ఎదగాలంటే సామర్థ్యం ఉండాలి. అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్నా.. మీ ప్రస్తుత కెరీర్లో ఎదగాలన్నా..
♦ మన పిల్లల మంచి రేపటి (భవిష్యత్) కోసం.. మనం ఈ రోజును త్యాగం చేద్దాం..
♦ శ్రమించి పనిచేసేవారికే దేవుడు తనవంతు తోడ్పాటు అందిస్తాడు. ఇది చాలా సుస్పష్టం.
♦ మనుషులకు కష్టాలు అవసరమే. అవి ఉంటేనే విజయాన్ని ఆస్వాదించగలం
♦ మనం ఎప్పటికీ లొంగిపోవద్దు, సమస్యలు మనల్ని ఓడించేందుకు అంగీకరించొద్దు
♦ విద్యార్థికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ప్రశ్నించేతత్వం. వారిని ప్రశ్నించనివ్వండి
♦ హృదయపూర్వకంగా పనిచేయనివారు గెలవగలరు, కానీ అది అసంపూర్ణమే. హృదయపూర్వకం కాని విజయం చేదునే మిగుల్చుతుంది
♦ మనపై మనకు నమ్మకం, విశ్వాసంతోనే ఆత్మగౌరవం వస్తుందని మనం గుర్తించలేమా?
- వివిధ సందర్భాల్లో అబ్దుల్ కలాం చెప్పిన స్ఫూర్తిదాయక మాటలివీ..
(కలాం సంతకం)