స్వదేశీ రాకెట్లు, క్షిపణుల సృష్టికర్త | Former President APJ Abdul Kalam Dies at 83 | Sakshi
Sakshi News home page

స్వదేశీ రాకెట్లు, క్షిపణుల సృష్టికర్త

Jul 28 2015 3:29 AM | Updated on Aug 20 2018 3:02 PM

2003లో కశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్లతో.. - Sakshi

2003లో కశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్లతో..

నేడు ఇస్రో భారీ రాకెట్ ప్రయోగాలు చేస్తోందంటే.. ఆనాడు కలాం వేసిన బీజాలే అందుకు కారణం.

నేటి ప్రయోగాలకు నాడే బీజం
సాక్షి, సూళ్లూరుపేట: నేడు ఇస్రో భారీ రాకెట్ ప్రయోగాలు చేస్తోందంటే.. ఆనాడు కలాం వేసిన బీజాలే అందుకు కారణం. 1973 నుంచి 1982 దాకా ఎస్‌ఎల్‌వీ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా ఆయన పనిచేశారు. 1979, ఆగస్టు 10న కలాం చేపట్టిన ఎస్‌ఎల్‌వీ-2ఇ1 ప్రయోగం విఫలం కావడంతో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. ఆ సయమంలో ఒక అపజయం.. మున్ముందు విజయాలకు కారణమవుతుందంటూ శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. అదే ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను 1980లో మరోసారి ప్రయోగించి విజయం సాధించారు. ఆ విజయమే ఇప్పుడే దేశం గర్వించే ప్రయోగాలకు రాచబాటగా మారింది.
 
మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పట్టాపొందిన తర్వాత 1960లో డాక్టర్ అబ్దుల్‌కలాం భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ముఖ్య శాస్త్రవేత్తగా చేరారు. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్‌ను రూపొందించటం ద్వారా తన కెరీర్‌ను ఆరంభించారు. ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధకుడైన విక్రమ్‌సారాభాయ్ ఆధ్వర్యంలోని ఇన్‌కోస్పార్ కమిటీలో సభ్యుడిగా కూడా కలాం పనిచేశారు. 1965 లోనే డీఆర్‌డీఓలో విస్తృతపరచగలగిన రాకెట్‌పై స్వతంత్రంగా పరిశోధనలు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 1969లో ప్రభుత్వ అనుమతి లభించటంతో మరింత మంది ఇంజనీర్లను ప్రాజెక్టులో చేర్చుకున్నారు.
 
ఇస్రోలో స్వదేశీ రాకెట్ల అభివృద్ధి...
1969లో ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు బదిలీ అయ్యారు. అక్కడ తొలిసారి దేశీయంగా తయారు చేసిన ఉపగ్రహ వాహక నౌక (ఎస్‌ఎల్‌వీ-3) ప్రాజెక్టుకు డెరైక్టర్‌గా పనిచేశారు. ఎస్‌ఎల్‌వీ-3 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి సమీప కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 1963-64 మధ్య కాలంలో కలాం అమెరికాలోని నాసాకు చెందిన లాంగ్లే రీసెర్చ్ సెంటర్ (వర్జీనియాలోని హ్యాంప్టన్‌లో), గోడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో), వ్యాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ (వర్జీనియా తూర్పు తీరంలో)లను సందర్శించారు. 1970-90 దశకాల మధ్య పోలార్ ఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎల్‌వీ-3 రాకెట్ల అభివృద్ధి కోసం కలాం కృషి చేశారు. అవి రెండూ విజయవంతమయ్యాయి.
 
స్వదేశీ రాకెట్ల నుంచి క్షిపణుల తయారీ...
1970 దశకంలోనే కలాం రెండు ప్రాజెక్టులకు డెరైక్టర్‌గా వ్యవహరించారు. ఒకటి ప్రాజెక్ట్ డెవిల్, రెండోది ప్రాజెక్ట్ వాలియంట్. విజయవంతమైన ఎస్‌ఎల్‌వీ రాకెట్ల కార్యక్రమం నుంచి ఖండాంతర క్షిపణులు తయారు చేయటం ఈ ప్రాజెక్టుల లక్ష్యం. నాటి రక్షణమంత్రి ఆర్.వెంకటరామన్ సూచనల మేరకు.. ఒక క్షిపణి తర్వాత మరొక క్షిపణిని ప్రణాళిక మేరకు అభివృద్ధి చేయటం కాకుండా..

ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరుతో ఒక క్షిపణుల శ్రేణిని అభివృద్ధి చేయటంపై కలాం, నాటి రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు వి.ఎస్.అరుణాచలంలు కృషిచేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. అగ్ని (మధ్య శ్రేణి ఖండాంతర క్షిపణి), పృథ్వి (భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే వ్యూహాత్మక క్షిపణి) అభివృద్ధిలో కలాం ప్రధాన భూమిక పోషించారు. ఈ కార్యక్రమంతో కలాంకు ‘మిసైల్ మ్యాన్’ అనే మారు పేరు వచ్చింది.
 
పోఖ్రాన్.. అణ్వస్త్ర పరిశోధకుడిగా ఖ్యాతి
కలాం.. 1992 జూలై నుంచి 1999 డిసెంబర్ వరకూ ప్రధానమంత్రికి ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా, డీఆర్‌డీఓ కార్యదర్శిగా పనిచేశారు. 1998లో పోఖ్రాన్-2 పేరుతో భారత అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించారు. ఈ విషయంలో కలాం చాలా క్రియాశీలమైన సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. అణ్వస్త్ర పరీక్షల దశలో కలాం మరో శాస్త్రవేత్త ఆర్.చిదంబరంతో కలిసి చీఫ్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆ పరీక్షలతో భారత దేశపు ఉన్నతస్థాయి అణుశాస్త్రవేత్తగా జాతీయ హీరోగా కలాం ఖ్యాతిపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement