‘ఇరిగేషన్’.. పరేషాన్! | Junior Technical Officer posts in Irrigation Department | Sakshi
Sakshi News home page

‘ఇరిగేషన్’.. పరేషాన్!

Aug 17 2014 10:35 PM | Updated on Sep 2 2017 12:01 PM

‘ఇరిగేషన్’.. పరేషాన్!

‘ఇరిగేషన్’.. పరేషాన్!

నీటిపారుదల శాఖను ఖాళీల కొరత పట్టిపీడిస్తోంది.

సాక్షి, సంగారెడ్డి: నీటిపారుదల శాఖను ఖాళీల కొరత పట్టిపీడిస్తోంది. ఎస్‌ఈ మొదలు.. క్షేత్రస్థాయిలోని జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో సాగునీటి పనులపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో చిన్ననీటి వనరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఎంతో ప్రాముఖ్యమున్న నీటిపారుదల శాఖలో క్షేత్రస్థాయిలో ఇంజనీర్ల కొరత కారణంగా సాగునీటి పనులు సక్రమంగా అమలు కావటంలేదు. ఫలితంగా రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలో నీటిపారుదల శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సహా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడేళ్లుగా ఆయా పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సాగునీరు అందిస్తామని, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి మెతుకుసీమను భాగ్యసీమగా మారుస్తామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వంపైనే ఇప్పుడు మెతుకుసీమ రైతాంగం ఆశలు పెట్టుకుంది.
 
ఐదేళ్లలో ఇద్దరే ఎస్‌ఈలు
నీటి పారుదల శాఖకు ఎస్‌ఈ కార్యాలయం గుండెకాయలాంటింది. పర్యవేక్షక ఇంజనీరు పాలనలో జిల్లావ్యాప్తంగా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి పనులు అమలు జరుగుతూ ఉంటాయి. అత్యంత ముఖ్యమైన పర్యవేక్షక ఇంజనీర్లు(ఎస్‌ఈ)లు పూర్తిస్థాయిలో పనిచేసింది ఇప్పటివరకు ఇద్దరే ఇద్దరు అధికారులంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం ఉన్న ఎస్‌ఈ కూడా ఇన్‌చార్జి అధికారే. జిల్లాలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ కార్యాలయం జనవరి, 2009లో సంగారెడ్డిలో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది ఎస్‌ఈలుగా పనిచేశారు. వీరిలో మే, 2011 నుంచి డిసెంబర్, 2011 వరకు కె. శ్యాంసుదర్ పూర్తిస్థాయి ఎస్‌ఈగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ తర్వాత ఏప్రిల్, 2012 నుంచి ఫిబ్రవరి 2013 వరకు పి. శ్యాంసుందర్ పూర్తిస్థాయి ఎస్‌ఈగా పనిచేశారు. ఈ ఇద్దరు అధికారులు మినహా 11 మంది ఎస్‌ఈలు ఇన్‌చార్జిగా విధులు నిర్వహించారు. ఇన్‌చార్జి ఎస్‌ఈల కారణంగా ఏ అధికారి పూర్తిస్థాయిలో నీటిపారుదల పనులపై శ్రద్ధగా పనిచేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఇన్‌చార్జి ఎస్‌ఈ పనిచేస్తున్నారు. గత పాలకుల హయాంలో సాగిన ఇన్‌చార్జి ఎస్‌ఈ పాలనకు తెలంగాణ ప్రభుత్వం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. పూర్తిస్థాయి ఎస్‌ఈని నియమిస్తే నీటిపారుదల సంస్కరణలకు న్యాయం జరుగుతుంది.
 
జిల్లాలో 34 పోస్టులు ఖాళీ
నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి విభాగంలో జిల్లావ్యాప్తంగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సిద్దిపేట, అందోలు డీఈ పోస్టులతోపాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ఐబీ డివిజన్‌ల పరిధిలో 8 మంది ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ ఒకటి, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 12, ప్రింట్ టెక్నీషియన్ పోస్టు ఒకటి, డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ 3, జూనియర్ అసిస్టెంట్ ఒకటి, టైపిస్టు 2, స్టెనో ఒకటి, ఆఫీసు సబార్డినేట్ 3 పోస్టులు చాలాకాలాంగా భర్తీ కాకుండా ఉన్నాయి. డీఈ, ఏఈ, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల ఖాళీల కారణంగా నీటిపారుదల శాఖ చేపట్టే పనులపై ప్రభావం చూపుతోంది. ఇకనైనా ప్రభుత్వం ఖాళీగా ఉన్న టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement