కృష్ణమ్మ పరవళ్లు! | Huge Inflow Into Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ పరవళ్లు!

Aug 13 2019 2:51 AM | Updated on Aug 13 2019 2:56 AM

Huge Inflow Into Nagarjuna Sagar - Sakshi

నాగార్జునసాగర్‌ 26 క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు విడుదలవుతున్న కృష్ణమ్మ..

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జిల్లా రైతులకు ఆనందం నింపుతూ రెండు పంటలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించేలా సాగర్‌ జలాశయం పూర్తిగా నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి పెరుగుతుండటంతో సాగర్‌లో జలకళ ఉట్టిపడుతోంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 255 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.045 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 569 (248.0438 టీఎంసీలు) అడుగులకు చేరుకోగానే డ్యామ్‌ భద్రతను పరిగణనలోకి తీసుకుని సోమవారం ఉదయం 7.30 గంటలకే క్రస్ట్‌గేట్లు తెరిచారు. 26 క్రస్ట్‌ గేట్లను 10 అడుగులు ఎత్తడంతో 3,33,832 క్యూసెక్కుల (31 టీఎంసీలు) నీరు దిగువకు వెళ్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు, జల విద్యుత్‌ కేంద్రాల నుంచి కలిపి   7,89,094 క్యూసెక్కుల (68 టీఎంసీలు) ఇన్‌ఫ్లో ఉండగా, 3.67 లక్షల ఔట్‌ఫ్లో ఉంది. పులిచింతల   నిండే అవకాశం ఉండటంతో అక్కడా గేట్లెత్తారు.  

పెరుగుతున్న నీటిమట్టం 
సాగర్‌ జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరకముందే దిగువకు నీటిని వదులుతున్నామని ప్రాజెక్టు అధికార వర్గాలు చెప్పాయి. 2000, 2015లో మాత్రమే సాధారణం కంటే 60 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అప్పుడు జూన్, జూలై ల్లో బాగా కురిసిన వర్షాలతో ముందుగానే గేట్లు ఎత్తారు. ఇదే పరిస్థితి 1992లో కూడా ఓసారి వచ్చింది. 2005వ సంవత్సరం నుంచి వరుసగా 2006, 2009, 2010, 2011, 2013, 2014, 2018 సంవత్సరాలలో దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నిండినా.. ఎక్కువ వరద రాని కారణంగా 2015, 2016, 2017 సంవత్సరాల్లో మాత్రం సాగర్‌ గేట్లను ఎత్తలేదు. 

సోమవారం నాగార్జునసాగర్‌ గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఉవ్వెత్తున పరుగులు తీస్తున్న కృష్ణమ్మ   
సెల్ఫీ దిగుతూ ఒకరి గల్లంతు 
కృష్ణమ్మ అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులు కొంతమంది పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా కృష్ణానది తీరంలోగల శివాలయం పుష్కరఘాట్‌లోకి ఈతకు దిగారు. జహీరాబాద్‌కు చెందిన నర్సింహ (42) అనే వ్యక్తి సెల్ఫీ దిగేందుకు లోపలికి వెళ్లగా కాలు జారడంతో కృష్ణానదిలో గల్లంతయ్యాడు. బయటపడేందుకు ప్రయత్నించినా వరద ఉధృతికి రాలేకపోయాడు. అందరూ చూస్తుండగానే అతను నదిలో మునిగిపోయాడు. 

నిండు కుండలా.. 
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో జూరాల జలాశయం నిండు కుండలా మారింది. మొత్తం 8.34 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అన్ని గేట్లను పైకెత్తి 8.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీకి 28 వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.3 అడుగులు నమోదైంది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 179.51 టీఎంసీలు ఉంది. తుంగభద్ర జలాశయం సైతం పూర్తిగా నిండటంతో అక్కడి నుంచి శ్రీశైలానికి 2.12 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. దీంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement