
మగాడిగా పారిపోయి.. మగువగా ప్రత్యక్షం
మగాడిగా ఇంటినుంచి పారిపోయిన ఓ గిరిజన యువకుడు పదినెలల తర్వాత మగువగా మారి ఇంటికి చేరాడు. ఈ సంఘటన అతడి (ఆమె) కుటుంబంలో కలకలం రేపింది.
ఎల్లారెడ్డిపేట : మగాడిగా ఇంటినుంచి పారిపోయిన ఓ గిరిజన యువకుడు పదినెలల తర్వాత మగువగా మారి ఇంటికి చేరాడు. ఈ సంఘటన అతడి (ఆమె) కుటుంబంలో కలకలం రేపింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లికి చెందిన లకావత్ శశికళ, రామచంద్రం దంపతుల రెండో సంతానం లకావత్ సురేశ్. ఇతడికి పెళ్లి చేసేందుకు పెద్దలు సంబంధాలు చూశారు. ఆ సమయంలోనే సురేశ్ పెళ్లికి నిరాకరించాడు.
కుటుంబసభ్యులు బలవంతంగా రెండేళ్లక్రితం అదే మండలం రాచర్లగుండారానికి చెందిన ఓ యువతితో వివాహం చేశారు. వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగినా అప్పుడప్పుడూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సురేశ్ను అతడి అన్న రాజు కొట్టాడు. దీంతో గతేడాది నవంబర్ 21న ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో తన కుమారుడు కనిపించడం లేదని మరుసటి రోజు శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సురేశ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ముంబైలో లింగమార్పిడి..
ఇంటి నుంచి వెళ్లిపోయిన సురేశ్ నేరుగా ముంబై చేరుకున్నాడు. అక్కడ లింగమార్పిడి చేయించుకున్నాడు. లతగా పేరు మార్చుకుని.. మహారాష్ట్రలోని బల్లార్షా వెళ్లాడు. అక్కడున్న తోటివారితో కలిసిపోయాడు.
వేములవాడలో ప్రత్యక్షం
ఇంటి నుంచి వెళ్లిపోయిన సురేశ్ వారం క్రితం ఓ హిజ్రాతో కలిసి కలిసి ఓ కేసు నిమిత్తం వేములవాడ పోలీస్స్టేషన్కు వచ్చాడు (వచ్చింది). అదే సమయంలో శశికళ ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరయ్యేందుకు వేములవాడకు వచ్చింది. అక్కడ తల్లిని చూసిన సురేశ్ (లత) ఆమెను పలకరించాడు. ఉన్నట్టుండి తన కొడుకు అమ్మాయిగా కనిపించడంతో ఆందోళనకు గురైంది. గతంలో శశికళ పెట్టిన కేసు ఉపసంహరించుకునేందుకు ఎస్సై రమేశ్కుమార్ సురేశ్(లత)ను శుక్రవారం ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు.
కంటతడి పెట్టిన భార్య
భర్త వచ్చాడని తెలుసుకున్న భార్య పోలీస్స్టేషన్కు చేరుకోగా.. మగువగా దర్శనమివ్వడంతో కన్నీటి పర్యంతమైంది. తన భార్య తనతోనే ఉంటానంటోందని, కానీ.. తాను మాత్రం బల్లార్ష వెళ్లిపోతానని సురేశ్ పేర్కొన్నాడు. తాను సంసారానికి పనికిరానని పెళ్లికి ముందే చెప్పానని, అయినా ఎవరూ వినిపించుకోలేదని వివరించాడు.