భారతీయ కళల విశిష్టత... చావు, పుట్టుక, పునర్జన్మ గురించి అవి ఏమంటాయో వివరించేందుకు జేఎన్యూ ప్రొఫెసర్ ఒకరు ప్రత్యేకంగా కళాప్రదర్శన నిర్వహిస్తున్నారు.
రహస్యాలను ఛేదించే ప్రదర్శన
Mar 15 2014 10:58 PM | Updated on Apr 3 2019 5:44 PM
న్యూఢిల్లీ: భారతీయ కళల విశిష్టత... చావు, పుట్టుక, పునర్జన్మ గురించి అవి ఏమంటాయో వివరించేందుకు జేఎన్యూ ప్రొఫెసర్ ఒకరు ప్రత్యేకంగా కళాప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘ది బాడీ ఇన్ ఇండియన్ ఆర్ట్’ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రదర్శనలో చారిత్రక విశిష్టత గల పలు చిత్రాలు, కళాఖండాలు, వస్తువులను చూపిస్తున్నారు. వివిధ భారతీయ నాగరికతల్లోని కళాఖండాలను పరిశీలించడం ద్వారా రహస్యాలను ఛేదించడం ఈ ప్రదర్శన ముఖ్యభావన అని నిర్వాహకులు చెబుతున్నారు. ది బాడీ ఇన్ ఇండియన్ ఆర్ట్ ప్రదర్శన బ్రస్సెల్స్ నగరంలో నాలుగు నెలలపాటు కొనసాగింది. ఢిల్లీలో దీనిని శుక్రవారం ప్రారంభించగా, ఇది జూన్ ఏడు వరకు కొనసాగుతుంది. ఇక్కడి జాతీయ మ్యూజియంలో ప్రారంభమైన ప్రదర్శనలో 44 సంస్థల నుంచి సేకరించిన 300 విశిష్ట వస్తువులు, వర్ణచిత్రాలు, విగ్రహాలు, శిల్పాలను వీక్షించవచ్చు. బాడీ ఇన్ ఇండియన్ ఆర్ట్ భావనను వెలుగులోకి తెచ్చిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాచీన భారత కళ, వాస్తుశిల్ప విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ నమన్ అహూజా ఈ ప్రాజెక్టు ఆచరణరూపం దాల్చేందుకు ఎంతగానో శ్రమించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 20 ఏళ్లుగా నిర్వహించిన వివిధ పరిశోధనల ఫలితమే ఈ ప్రదర్శన అని చెప్పారు. కొన్ని శతాబ్దాల క్రితం విలసిల్లిన హరప్పా, సింధూలోయ, గుప్తుల కాలం నాటి కళాఖండాలను సేకరించి ఆయన ఈ ప్రదర్శనలో ఉంచారు. ‘నాగరికతకు దేహమే కీలకం. పుట్టుక, చావు, పునర్జన్మ గురించి ప్రస్తావనకు రాని ఎన్నో ప్రశ్నలకు ఇక్కడ వివిధ జవాబులు ఉన్నాయి’ అని అన్నారు. నాగరికతల గురించి వివరించడానికి ఎనిమిది విభాగాలను ఏర్పాటు చేశారు. వీటిని వీక్షించడం ద్వారా చావుపుట్టుకలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించవచ్చని అహుజా అన్నారు. ఉదాహరణకు చావు గురించి ప్రశ్నిస్తే.. నాగరికతలు, కర్మ సిద్ధాంతం, మతం దాని గురించి ఏమంటాయో నిర్వాహకులు వివరిస్తున్నారు.
Advertisement
Advertisement