ప్రేమ లేదని...
సాక్షి, సేలం: ప్రేమించిన యువతి ఊరికి వెళ్లిందనే బాధలో ఓ ప్రియుడు (వన్సైడ్ లవ్) 100 అడుగుల ఎత్తున్న ట్యాంకు పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. సేలం జిల్లా జలగండాపురానికి చెందిన పళనిస్వామి కుమారుడు ప్రభు(20). నామక్కల్ జిల్లా రాసిపురంలోని ఓ ప్రైవేటు నూలు కర్మాగారంలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న తిరునెల్వేలికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.
అయితే ఆ యువతి ఆరు నెలల క్రితం ఊరికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమెను మర్చిపోలేక ప్రభు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మద్యం మత్తులో రాసిపురం సమీపంలోని 100 అడుగుల వాటర్ ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. గాయాలతో ఉన్న అతన్ని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ప్రభును విచారిస్తున్నారు.