విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న
న్యూఢిల్లీ: విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురు వ్యక్తులను వేర్వేరు సంఘటనల్లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కోటి రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన వివరాలను శనివారం విలేకరులకు తెలిపారు. నైజీరియాకు చెందిన ఇజేఫులుక్వే(35) వినియోగదారులను కలిసి మాదక ద్రవ్యాలను అందించే సమయంలో దాడి చేసి 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలి పారు. మరో ఘటనలో నైజీరియాకే చెందిన మైక్(27)ని సెంట్రల్ ఢిల్లీ పంచకుయెన్ రోడ్లో అరెస్టు చేశారు.
నిందితుని నుంచి 40 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. కాగా, మరో ఘటనలో తెలంగాణకు చెందిన బోడా లాలు(27), భూక్యా లింగర్(29)ని ఈ నెల 12న మయూర్ విహార్ ఫేజ్-1లో గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి నుంచి మొత్తం 32 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చివరి ఘటనలో ఢిల్లీకి చెందిన ముహిద్దీన్(49)ని నిగమ్ బోధ్ ఘాట్ ప్రాంతంలో అరెస్టు చేసి 200 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనల్లో 200 గ్రాముల హెరాయిన్, 60 గ్రాముల కొకైన్, 32 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.