
సాక్షి, ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో భాగంగా మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ సమయంలో కీపర్ హెల్మెట్ ధరించక పోవడంతో హార్దిక్ పాండ్యా త్రో విసిరిన బంతి నేరుగా ఇషాన్ కిషన్ కుడి కనుబొమ్మకు తగిలింది. దీంతో అతను విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ముంబై జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇక కిషాన్ స్థానంలో రంజీ ఆటగాడు ఆదిత్య తారే కీపింగ్ చేశాడు.
ఈ ఆకస్మిక ఘటనతో పాండ్యా మాత్రం తెగ భయపడ్డాడు. అతనికి తీవ్రంగా గాయమైందేమోనని ఆందోళన చెందాడు. అయితే ఈ వ్యవహారంలో పాండ్యా తప్పులేకున్నా.. తన వల్ల ఓ ఆటగాడు గాయపడ్డాడని ఈ ఆల్రౌండర్ తీవ్ర మథనపడ్డాడు. గాయం తీవ్రమైంది కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు పాండ్యా, ఇషాన్ను కలిశాడు. అతడితో ఫొటో దిగి ట్విటర్లో పోస్ట్ చేశాడు. నా ప్రియమైన సోదరుడా నన్ను మన్నించు.. దృఢంగా నిలబడు అని వ్యాఖ్యానించాడు. కాగా, 2018 ఐపీఎల్ వేలంలో ఇషాన్ను రూ.6.2 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
Mera cutie pie 🤕
— hardik pandya (@hardikpandya7) April 18, 2018
Sorry bhai! Stay strong, @ishankishan23. pic.twitter.com/CeN6pF9Xkt