కింగ్స్‌ పంజాబ్‌దే విజయం

Gayle, Rahul power Kings Punjab beat KKR by 9 wickets - Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శనివారం ఇక్కడ ఈడెన్‌ గార్డెన్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ విజయం 9 వికెట్ల తేడాతో సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం కింగ్స్‌ లక్ష్యా‍న్ని 13 ఓవర్లకు 125 పరుగులకు నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని కింగ్స్‌ పంజాబ్‌ 11.1 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కింగ్స్‌ ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(60;27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రిస్‌ గేల్‌(62 నాటౌట్‌;38 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు)లు విజయంలో ముఖ్య భూమిక పోషించారు.

కింగ్స్‌ పంజాబ్‌ 8.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 96 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఆపై తిరిగి ఆరంభమైన మ్యాచ్‌లో తొలి వికెట్‌కు గేల్‌-రాహుల్‌ జోడి 9.4 ఓవర్లలో 116 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఇక మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి గేల్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. విన్నింగ్‌ షాట్‌ను గేల్‌ సిక్స్‌ కొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ ఘన విజయం నమోదు చేయడంతో పాటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌(74;41 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌(43;28 బంతుల్లో 6 సిక్సర్లు), రాబిన్‌ ఉతప్ప(34;23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) లు మెరుగ్గా ఆడారు. కోల్‌కతాకు ఆదిలోనే నరైన్‌(1) వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఊతప్పతో లిన్‌ కలిసి దాటిగా ఆడాడు. వీరిద్దరు రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 50 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడు పెంచిన ఉతప్ప.. అశ్విన్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్‌ చేరాడు.

దీంతో రెండో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  ఆ వెంటనే నితీష్‌ రానా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ బాధ్యాతాయుతంగా ఆడగా.. మరో వైపు క్రిస్‌లిన్‌ రెచ్చిపోయాడు. ఈ దశలో 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో క్రిస్‌లిన్‌ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 147 పరుగుల వద్ద ఆండ్రూ టై బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌గా క్రిస్‌లిన్‌71(41 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్సులు) పెవిలియన్‌ చేరాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రస్సెల్‌(10) నిరాశపరిచాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top