అభ్యుదయవాది ఎన్వీ రమణయ్య కన్నుమూత | NV Ramanaiah passed away | Sakshi
Sakshi News home page

అభ్యుదయవాది ఎన్వీ రమణయ్య కన్నుమూత

Jan 17 2018 1:41 AM | Updated on Jan 17 2018 1:41 AM

కావలి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన అభ్యుదయవాది నందనవనం వెంకటరమణయ్య (ఎన్వీఆర్‌) (83) మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన విద్యార్థి దశలోనే బీడీ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసి జైలు జీవితం గడిపారు. సోషలిస్ట్‌ భావాలతో అనేక ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ‘చేతన’మాస పత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తూ సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలు, అసమానతలపై పోరాటం సాగించారు. కావలి విశ్వోదయ విద్యాసంస్థల్లో రాజనీతి శాస్త్రం లెక్చరర్‌గా కూడా పనిచేశారు.

నవ వికాస్‌ సేవా సంస్థ స్థాపనలో వకుళాభరణం లలిత, హేమలతలకు సహకరించి ముందుకు నడిపించారు. దివిసీమలో ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు విద్యార్థుల బృందాన్ని వెంట పెట్టుకొని వెళ్లి ఆర్తులకు సేవలు అందించారు. సొసైటీ ఫర్‌ సోషల్‌ ఛేంజ్‌ అనే సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌గా ఉంటూ అనునిత్యం సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. జవహర్‌ భారతి విద్యా సంస్థలకు సుదీర్ఘకాలం కరస్పాండెంట్‌గా వ్యవహరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎన్వీ రమణయ్య మృతికి వివిధ సంఘాల ప్రతినిధులు, ఆయన సహచరులు, విద్య, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లో జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement