
గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి అప్పారావు, చల్లా శంకరరావు, గన్ని కృష్ణ
సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ : రాజ మహేంద్రవరం నగర నియోజకవర్గ టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టిక్కెట్ కోసం గ్రూపుల పోరు ఊపందుకుంది. టిక్కెట్ ఎవరికి దక్కుతుం దో తెలియదు గానీ ఎన్ని కల ముందే కోట్లాది రూ పాయలను నీళ్లలా ఖర్చు పెడుతుండడం గమనార్హం. రాజమహేంద్రవరం సిటీ టిక్కెట్ రేసులో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫ్యామిలీ, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు, గుడా చైర్మన్ గన్ని కృష్ణ ఉన్నారు. రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి ఈసారి సిటీలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో రేసులోకి వచ్చారు. తనకున్న సామాజిక వర్గ పలుకుబడితో టిక్కెట్ దక్కించుకోవచ్చన్న యోచనలో ఉన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తూ టీడీపీలోకి ఫిరాయించిన ఆదిరెడ్డి అప్పారావు కూడా పోటీ చేసేందుకు యత్నిస్తున్నారు. తన కోడలి కుటుంబం (కింజరాపు అచ్చన్నాయుడు ఫ్యామిలీ) అంతా టీడీపీలో ఉండటంతోపాటు అధిష్టానంతో సన్నిహితంగా ఉండటం తనకు కలిసి వస్తుందన్న ధీమాను ఆదిరెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. తనకు లేదంటే తన కుమారుడు, కోడలు ఇలా ఎవరికైనా టిక్కెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి అప్పారావుల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది.
గన్ని కూడా...
మరో వైపు గుడా చైర్మన్ గన్ని కృష్ణ కూడా తనదైన శైలిలో టిక్కెట్టు కోసం పావులు కదుపుతున్నారు. ఇంకోవైపు ఆదిరెడ్డి అప్పారావు తోడల్లుడు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు కూడా నేనున్నానంటూ రేసులోకి వచ్చారు. దీంతో ఆశావహులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదిరెడ్డి ఫ్యామిలీకి టిక్కెట్ రాకూడదని గోరంట్ల చెక్ పెడుతుండగా, సిటీలో ఆయనకేం పని...రూరల్ చూసుకోవచ్చు కదా అని గోరంట్లపై ఆదిరెడ్డి గుర్రుగా ఉన్నారు. సిటీ టిక్కెట్ తనకు దక్కకపోతే ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావుకైనా ఇవ్వాలన్న డిమాండ్తో గోరంట్ల పావులు కదుపుతున్నారు. తనకైనా టిక్కెట్ ఇవ్వండి...లేదంటే ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఇచ్చినా ఫర్వాలేదన్నట్టుగా గన్ని కృష్ణ ముందుకెళ్తున్నట్టు సమాచారం.
బలం కోసం ప్రలోభాలు...
ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన ‘జయహో బీసీ’ కార్యక్రమంలో అటు ఆదిరెడ్డి అప్పారావు, ఇటు చల్లా శంకరరావులు ఎవరికి వారు తమ పేర్లతో ఉన్న టీ షర్ట్లు వేయించి తమ అనుచరులతో చంద్రబాబు ముందు షో చేశారు. టిక్కెట్ వచ్చేంతవరకు ఇదే పంథా కొనసాగించాలన్న ఉద్దేశంతో కేడర్ను పెంచి పోషించే పనిలో పడ్డారు. ఒకాయన పుట్టిన రోజని, మరొక కార్యక్రమం అని రూ.10 వేల నుంచి రూ. 50 వేల వరకు ఇచ్చి కేడర్ను కాపాడుకుంటుండగా, మరొకాయన యువతకు క్రికెట్ కిట్లు, ఇతరత్రా పరికరాలను పంచి పెడుతున్నారు. ఇందులో కూడా తమ వెంట చిత్తశుద్ధితో ఉంటారన్న ఉద్దేశంతో వారి సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువగా ఇస్తుండగా, మిగతా సామాజిక వర్గాల వారికి కాసింత తగ్గించి ఇస్తున్నారు. దీనిపై కూడా సిటీ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇలా రకరకాల ప్రలోభాలతో టిక్కెట్ వచ్చేంతవరకు జనాన్ని పోగేసే పనిలో నిమగ్నమయ్యారు.