ఆడలేక మద్దెల ఓడు

TDP False Propaganda to Counter the Popularity of the YSRCP Govt - Sakshi

నామినేషన్లు.. నయా జిత్తులు

తమను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ అండ్‌ కో దుష్ప్రచారం

ఎత్తుగడలన్నీ తలకిందులవడంతో చంద్రబాబు కొత్త పన్నాగం

9,696 ఎంపీటీసీ స్థానాలకు 50 వేలకు పైగా నామినేషన్లు 

ఒక్కో స్థానంలో టీడీపీ తరఫున సగటున రెండేసి నామినేషన్లు 

గతంలో జరిగిన ఏ ఎన్నికల్లోనైనా ఇంతకంటే ఎక్కువగానే ఘర్షణలు 

9 నెలల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన.. 90 శాతం ప్రజలకు సంక్షేమం

వైఎస్సార్‌సీపీని ఓడించడం సాధ్యం కాదని అర్థం చేసుకున్న ప్రతిపక్షాలు 

జేసీ, కేఈ వంటి టీడీపీ సీనియర్లే చేతులేత్తేసిన వైనం 

ప్రభుత్వ ప్రజాదరణను తట్టుకోలేకే టీడీపీ తప్పుడు ప్రచారం

ప్రగతి జీర్ణించుకోలేకే..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 90 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా 90 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూరింది.
- సరికొత్త పథకాలు, ప్రజలకు మేలు చేసే చట్టాల ద్వారా పరిపాలనలో కొత్త ఒరవడిని సృష్టించారు.
- విద్య, వైద్య రంగాల్లో పెను మార్పులకు శ్రీకారం. 
- 59.85 శాతం రిజర్వేషన్లను అడ్డుకునేందుకు టీడీపీ నాయకుడితోనే కోర్టులో కేసు వేయించి చంద్రబాబు అభాసుపాలైనట్లు ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. 
టీడీపీ కోర్టుకెళ్లడం ద్వారా బీసీలు నష్టపోయిన 10 శాతం మేర రిజర్వేషన్లను పార్టీ పరంగానే భర్తీ చేస్తామని
సీఎం జగన్‌ ప్రకటించడంతో టీడీపీ కూడా దాన్ని అనుసరించక తప్పలేదు. 
- రాజ్యసభ ఎన్నికల్లో గెలవని సీటులో దళిత నేత వర్ల రామయ్యని నిలబెట్టి దళిత వర్గాల ఆగ్రహానికి గురయ్యారు. దళితులు, బీసీల వ్యతిరేకత మూట గట్టుకున్నారు. 
ఈ నేపథ్యంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దారుణమైన ఓటమి తప్పదని 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు అవగతమైంది.

స్థానిక ఎన్నికలు జరుగుతుండగానే చంద్రబాబుపై నమ్మకం లేదని కుండ బద్దలు కొడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి వందలాది మంది అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిగిలి ఉన్న క్యాడర్‌ను కొంత వరకైనా నిలబెట్టుకోవడానికే చంద్రబాబు టీమ్‌ దుష్ప్రచారానికి తెరలేపింది.

ఆడలేక మద్దెల ఓడు.. అన్న చందంగా తయారైంది చంద్రబాబు, ఆయన పరివారం పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పదని అర్థమవడంతో దాన్ని కప్పిపుచ్చుకునే ఎత్తుగడతో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కళ్లెదుటే వాస్తవాలు కనిపిస్తున్నా గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెబుతూ స్థానిక సమరాన్ని రక్తి కట్టించే యత్నం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నట్లు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తమ పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తుండడం పట్ల అన్ని వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం 
టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటోంది. నామినేషన్లు వేయ నీయడం లేదు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. 
- మా నాయకులను అడ్డుకుని ఏకగ్రీవం చేసుకుంటున్నారు. 
- మా వారిపై ఎక్కడికక్కడ దాడులకు పాల్పడుతున్నారు. దౌర్జన్యాలు చేస్తున్నారు. చరిత్రలో ఇంతటి అరాచకం ఎప్పుడూ జరగలేదు. 
- మా వారిని బెదిరించి వైఎస్సార్‌సీపీలో చేర్చుకుంటున్నారు. 

ఇదీ వాస్తవం.. 
- టీడీపీ నాయకులను అడ్డుకున్నారన్నది నిజంకాదు. నామినేషన్ల సంఖ్యను చూస్తే వాస్తవమేంటో తెలుస్తుంది. 13 జిల్లాల్లో 652 జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ 1,413 నామినేషన్లు దాఖలు చేసింది. 
- 9,696 ఎంపీటీసీ స్థానాలకు 50 వేల మందికి పైగా నామినేషన్‌ వేశారు. ఇందులో 18,242 మంది టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 
ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి టీడీపీ సగటున రెండు నామినేషన్లు వేసింది. 
- వైఎస్సార్‌సీపీ అడ్డుకుని ఉంటే ఇన్ని నామినేషన్లు ఎలా వేయగలిగారు? 
- ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ తరఫున ఎక్కువ మంది ఆశావహులుండడం సహజం. 
- దాఖలైన నామినేషన్లతో పోల్చితే ఏకగ్రీవమైన స్థానాల సంఖ్య చాలా తక్కువ. మొత్తం స్థానాల్లో ఏకగ్రీవాల శాతం అత్యల్పం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏకగ్రీవ ఎన్నికలు చాలాచోట్ల జరిగాయి. 
- జేసీ, కేఈ వంటి టీడీపీ సీనియర్లే చేతులేత్తేయడంతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

గోరంతలు కొండంతలు చేస్తూ..
- రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటే మూడు, నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయి. మిగిలిన అన్నిచోట్లా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోంది.  
- పూర్తిగా స్థానిక కారణాలు, స్థానిక రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్కడక్కడా జరిగిన ఈ చిన్న గొడవల్నే ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపించి రాష్ట్ర మంతటా ఇలాగే ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తోంది.
- ఏ ఎన్నికల్లో అయినా చిన్నపాటి గొడవలు జరగడం సర్వ సాధారణం. 2013లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఘర్షణలు జరిగాయి. గతంలో జరిగిన ఏ ఎన్నికలు తీసుకున్నా ఇంతకంటే ఎక్కువ గొడవలు చోటు చేసుకున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top