సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారని, ఐటీ దాడుల్లో దొరికిపోయిన శేఖర్రెడ్డితో ఆయనకు సంబంధాలు ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. లోకేశ్ అవినీతి వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేశ్పై తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఏ ఆధారాలు లేకుండా లోకేశ్ గురించి ఎందుకు మాట్లాడుతానని పవన్ ప్రశ్నించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతానని వెల్లడించారు.
ఏమీ ఆశించకుండా 2014 ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతునిచ్చానని పవన్ తెలిపారు. బీజేపీ, టీడీపీ నుంచి ఏమీ ఆశించానో అవి నెరవేర్చలేదని అన్నారు. వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఆరాధిస్తానని, రాజకీయంగా కాదని అన్నారు. బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహం నెలకొందని అన్నారు. రాజకీయాల్లో సినీ నటులే కాదు ఎవరైనా రావొచ్చునని చెప్పారు. సిద్ధాంతలపరంగా తనకు, తన అన్యయ్య చిరంజీవికి తేడా ఉందని తెలిపారు.


