సాత్వికతకు నిర్వచనం

సాత్వికతకు నిర్వచనం


ఆంధ్రరాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ పద విని చాలా కాలం ఆయన నిర్వహించారు. అది సాంకేతిక విద్యాసంస్థలు తామర తంపరగా పుట్టుకొచ్చిన తరుణం. గుప్పెడు మనిషి ఇంత భారం ఎలా మోస్తాడోననిపించేది. ‘‘నా కేలల్లాడదు... నిలు డీ’’యని గోవర్ధనగిరిని ఎత్తిపట్టి నిలచిన బాలకృష్ణు డిలా నిలబడ్డారు. సంకల్ప బలం, రుజువర్తనతో కావల్సినంత శక్తి సమకూరుతుందని నిరూపిం చారు.

 

రోజుకి ఇరవై నాలుగ్గంటలు చాలని ఆ రోజుల్లో, ఆయన చుట్టూ వార్తలు తిరిగే తరుణంలో ఒక పత్రికా విలేకరి కలవడానికి పలుమార్లు ప్రయ త్నించి విఫలమయ్యాడు. ప్రకటించాల్సిన సమాచా రాన్ని నేనే మీకు చేర్చి మీ ద్వారా ప్రజలకు అంది స్తాను. విడివిడిగా ఒక్కొక్కరికి చెప్పే భోగట్టా నా దగ్గర ఉండదంటూ మర్యాదగా తిరస్కరించేవారు. ఒక రిపోర్టర్ అందరిలా విజిటింగ్ కార్డు కాకుండా, ‘రైలు ముందుకు దూసుకు వెళ్తుంటే నల్లటి పొగ వెనక్కి వెళ్లిపోతున్నట్టు - చైతన్యం పనికిమాలిన వాటిని పక్కన పెడు తుంది’ అని రాసి లోపలికి పం పాడు. మరుక్షణం చాంబర్ డోర్ తెరుచుకుంది. కురచ, అందుకు తగ్గట్టే అమరిన దేహభాగాలు, ఆరపండిన వత్తై జుట్టు, లోచూ పున్న పదునైన కళ్లు ఆత్రుతగా పరికిస్తూ మీరేనా... మీరేనా అం టూ వాకబు చేసి ఆ చీటీదారుణ్ణి సాదరంగా లోనికి తీసుకెళ్లారు. ఒక మంచి మాటకి వాక్యానికి చలించిపోయే సంస్కారి. ఆయన పేరు సుబ్బా రావు. అచ్చమైన తెలుగు పేరుకి వన్నె తెచ్చారు.

 

 ఇంగ్లిష్ లిటరేచర్‌ని ఒక తపస్సులా చదివి ఔపోసన పట్టారు. గడచిన పాతికేళ్లుగా ఈ ప్రొఫె సర్ హైదరాబాద్‌లో స్థిరంగా ఉండటం వల్ల వర్ధ మాన రచయితలకు పెద్దదిక్కుగా నిలిచారు. ‘మీరు చాలా మంది వెన్నుతట్టి రాయిం చారు. గొప్పసేవ’ అని ఒకాయన పొగిడేస్తుంటే సుబ్బారావు, ఆగం డని సైగచేసి, ‘పుంఖాను పుంఖా లుగా రాస్తున్న ఓ అకవిని బుజ్జ గించి ఆపించగలిగాను’అన్నారు తృప్తిగా నవ్వుతూ. ‘సాత్వికుడు’ అనే మాటకు నడిచే నిర్వచనం ఆచార్య సి.సుబ్బారావు.

 

 ఆచితూచి మాట్లాడటం, అంతకుమించి ఆచితూచి రాయ డం ఆయన అలవాటు. ఒక ఆంగ్ల పత్రికలో కొన్నాళ్లు సమకాలీన రాజకీయాల మీద కాలమ్ రాశారు. పేరు తెచ్చుకున్న యూరోపియన్ రైటర్స్ అందర్నీ చదివారు. తెలుగులో మోడరన్, పోస్టు మోడరన్ కవులను బాగా చదివారు. వక్తగా నగరంలోనూ బయటా వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా అనేక సదస్సులను పండించారు.ఆరు దశాబ్దాలలో వచ్చిన ఇజాలను, ధోరణులని గమనించారు. ఏ భావ ప్రభావాలకూ ఆయన దాసోహమన లేదు. హట్ సీట్‌లో ఉండి ఎన్నో గాలి దుమారాలను ఎదు ర్కొని ఉండవచ్చు. అవన్నీ ఉద్యోగ ధర్మాలుగానే భావించారు.

 

 ఎన్నడూ ‘‘నేనూ...’’ అంటూ దీర్ఘంతో ఆత్మప్రశంసకు పూనుకోవడానికి కావా ల్సిన భాషా వ్యాకరణాలు ఆయనకు తెలియవు. గడచిన కొద్ది సంవత్సరాలలో సుబ్బారావు మరింత తేలికపడ్డారు. ఇటీవల కాలంలో భారతీయ ఇతిహా సాలు ముఖ్యంగా రామాయణ, భారతాలు మాత్రమే శాంతిని, కాంతిని ఇవ్వగలవనే తీర్మానా నికి వచ్చినట్టు వినిపించారు. అట్లాగని ఇన్నేళ్లు స్టడీ చేసిన వాదనల్ని వాటి ప్రభావాలను వదులుకో లేదు.

 

  అన్నీ గొప్పవే కాని ఈ పొద్దుకి ఇవి మరింత గొప్పవిగా అనిపిస్తున్నాయన్నారు. ఆసాంతం విలక్ష ణమైన జీవితం గడిపి, ఒక వేకువలో పారిజాతం నేలరాలినంత నిశ్శబ్దంగా నిష్ర్కమించిన సౌజన్య మూర్తికి నివాళి.

 (ఆచార్య సి. సుబ్బారావు  డిసెంబర్ 29న కన్నుమూశారు)

 (వ్యాసకర్త ప్రముఖ కథారచయిత)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top