చిరుతతో పోరాడిన ‘టైగర్‌’ | Sakshi
Sakshi News home page

చిరుతతో పోరాడిన ‘టైగర్‌’

Published Sat, Aug 17 2019 11:04 AM

Dog drives leopard out to save master - Sakshi

కోల్‌కతా : పెంపుడు జంతువులు, అందులోనూ కుక్కలు విశ్వాసానికి పెట్టింది పేరు. కోల్‌కతా,  డార్జిలింగ్‌ సమీపంలో సోనాడలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. తన యజమానురాలిని చిరుతపులి దాడి నుంచి  కాపాడి పలువురి  ప్రశంసలందుకుంటోంది. 

చాలామంది లాగానే బాధితురాలు అరుణ లామా (57) కూడా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు ‘టైగర్‌’. ఈ టైగర్‌ సాహసోపేతంగా పోరాడి చిరుతపులి దాడి నుంచి ప్రాణాలకు తెగించి మరీ తన యజమాని అరుణను కాపాడింది. దీంతో తీవ్ర గాయాలతో (నుదిటి కుడివైపున 20కుట్లు, చెంపలపై ఐదు కుట్లు) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అరుణ.  ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా  ఉందని వైద్యులు తెలిపారు. 

బాధితురాలి కుమార్తె స్మార్టీ అందించిన సమాచారం ప్రకారం ఆగస్టు 14న ఈ సంఘటన జరిగింది. తమ ఇంటి భవనంలో కింది ఫ్లోర్‌లో నివాసం ఉండే.. తన తల్లి చీకట్లో రెండు కళ్లు మెరుస్తూ ఉండడాన్ని గమనించింది... అదేంటో తెలుసుకుని, ఈ షాక్‌ నుంచి తేరుకునే లోపే ఆమెపై చిరుతపులి దాడి చేసింది. దీన్ని అక్కడే వున్న నాలుగేళ్ల  మాంగ్రెల్‌ జాతికి చెందిన  టైగర్‌ చిరుతను ధీటుగా ఎదుర్కొంది.  కొంత పోరాటం తరువాత  విజయవంతంగా దాన్ని తరిమివేయగలిగింది. ఏంతో ధైర్యంగా తన తల్లిని  టైగర్‌ కాపాండిందంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో నిఘా పెట్టారు.  చిరుతపులిని బంధించేందుకు ఉచ్చును ఏర్పాటు చేయనున్నారు. 

Advertisement
Advertisement