పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జాం

traffic jam at toll plaza - Sakshi

సాక్షి, నల్గొండ : సంక్రాంతి పండుగకు ప్రజలు స్వంత ఊర్లకు వెళుతుండడంతో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారిపై శనివారం వేకువజామున భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడింది. సుమారు రెండు కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా వద్ద పది గేట్లు తెరిచినా వాహనాల రద్దీ తగ్గలేదు. 

కాగా హైదరాబాద్ ఖాళీ అవుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవాసులు పల్లెబాట పడుతున్నారు. దీంతో పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లన్నీ బుకింగ్ అయ్యాయి. దూరప్రాంత రెగ్యులర్ రైళ్లలో రెండు నెలల క్రితమే రిజర్వేషన్లు పూర్తవడంతో పాటు అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేకరైళ్లలో సీట్లు నిండిపోయాయి. వీటిలో చాలారైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పరిమితి కూడా దాటిపోయింది. బెర్తు, సీటు దొరక్కపోయినా.. నిల్చొనైనా వెళ్దామనుకున్నా టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడమెలా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్ తోపాటు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. 

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top