కోహ్లిని కవ్వించొద్దని చెప్పానా..! | Amitabh Bachchan Reacts To Virat Kohli Notebook Gesture By Movie Dialogue | Sakshi
Sakshi News home page

కోహ్లిని కవ్వించొద్దని చెప్పానా..!

Dec 7 2019 4:02 PM | Updated on Dec 7 2019 4:02 PM

Amitabh Bachchan Reacts To Virat Kohli Notebook Gesture By Movie Dialogue - Sakshi

ముంబై: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో చెలరేగిన విరాట్‌ కోహ్లిపై..  బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తనదైన స్టైల్‌లో టీమిండియా కెప్టెన్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’ సినిమాలోని హిట్‌ డైలాగ్‌తో కొనియాడారు. ఈ మేరకు అమితాబ్ వెస్టిండీస్‌తో మ్యాచ్‌ను గురించి ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్‌లో.. 'విరాట్‌ను కవ్వించొద్దని ఎన్నో సార్లు చెప్పాను. కానీ వారు నా మాట వినలేదు. దీంతో కోహ్లి చిట్టి రాసి వారి చేతిలో పెట్టాడు. చూడండి ఇప్పుడు.. వెస్టిండీస్‌ ప్లేయర్ల ముఖాలు ఎలా మాడిపోయాయో’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్‌ను ఉద్దేశించి కోహ్లి తన చేతిని వర్చువల్ 'నోట్‌బుక్'గా మార్చి.. బుక్‌ తీసి టిక్‌ కొడుతున్నట్లు చేసిన విన్యాసం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఓ మ్యాచ్‌ సందర్భంగా తన వికెట్‌ తీసి సంబరాలు చేసుకున్న విలియమ్స్‌కు అదే రీతిలో విరాట్‌ ఈ మ్యాచ్‌లో సెలబ్రేషన్స్‌ ద్వారా కౌంటర్ ఇచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్‌కోహ్లి 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా మూడు టి20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇక రెండో టి20 మ్యాచ్ డిసెంబరు 8న తిరువనంతపురంలో జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement