
ఒక్కరోజుకే రూ.5 లక్షలు హాంఫట్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రూ. 5 లక్షలు మించి ఖర్చు చేయకూడదు.
గుసగుసలు
సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రూ. 5 లక్షలు మించి ఖర్చు చేయకూడదు. అయితే, అభ్యర్థులు ఒక్కరోజుకే రూ.5 లక్షలు ఖర్చుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఖర్చు రూ. 2 లక్షలు ఉండగా రూ. 5 లక్షలకు పెంచారు. అలా పెంచినా ఒక్కరోజులోనే ఖర్చుపెట్టేస్తామంటున్నారు అభ్యర్థులు..
టికెట్ కొనేందుకు రూ. కోటి
ప్రధాన పార్టీల్లో కొన్ని చోట్ల టికెట్ ధర రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉందట. ఇక జనంలోకి పోతే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అంతా రూ. కోటి నుంచి రెండు కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. నామినేషన్ రోజున ర్యాలీల కోసం, ఆర్భాటాలు, ప్రచారానికి రూ. 10 లక్షలు ఖర్చు లెక్కరాశారు. ప్రచారం అన్ని రోజులు కార్యకర్తలు, అనుచరులు, మిగతా వారికి భారీగా ఖర్చుపెట్టాల్సిందే. పెద్ద నేతలు, సినీ స్టార్లను ఆహ్వానిస్తే ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఖర్చు మాత్రం రూ. 5 లక్షలు మించకూడదని ఎన్నికల సంఘం నింబంధన. మరి మిగతా ఖర్చు ఏ ఖాతాలో చూపించాలనే సందిగ్ధంలో అభ్యర్ధులు పడ్డారు.
అభ్యర్థికి అయ్యే ఖర్చు( అంచనా)
నామినేషన్ రోజు ర్యాలీలు, ఆర్భాటానికి- దాదాపు రూ. 10 లక్షలు
బ్యానర్లు, పోస్టర్లు.. ఇతర ప్రచారాలకు -రూ. 25 లక్షలు
అనుచరులు, కార్యకర్తల ఖర్చులకు - రూ. 25 లక్షలు
బస్తీలు, కాలనీల్లో ఖర్చు - రూ.35 లక్షలు