
రైల్వే కార్మికులకు అండగా ఉంటా
రైల్వే కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు.
మంత్రి తలసాని
సికింద్రాబాద్: రైల్వే కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం చిలకలగూడలోని దక్షిణమధ్యరైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశానికి తలసాని హాజరై ప్రసంగించారు. రైల్వే సమస్యలను కార్మిక సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే కేంద్రంపై వత్తిడి తెచ్చి పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దక్షిణమధ్యరైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాదీయ కార్యదర్శి మర్రి రాఘవయ్య మాట్లాడుతూ రైల్వేలో విదేశీ పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకోకుంటే సమ్మె తప్పదన్నారు. రైల్వేను ప్రైవేటీకరించేది లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన మోసపూరితమైందేన్నారు.
ఉద్యోగ నియామకాల్లో కాంట్రాక్టు వ్యవస్థ, విదేశీ పెట్టుబడుల ఆహ్వానం ఫలితంగా రైల్వే వ్యవస్థ ప్రై వేటీకరణ దిశగా అడగులు వేస్తుందని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ ఓటుబ్యాంకు నిమిత్తం లేనిపోని రాయితీలను ఇచ్చి లాభాల బాటలో పయనించాల్సిన రైల్వేను నష్టాల బాటలోకి దింపి రైల్వే వ్యవస్థ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చైనా, జపాన్ వంటి దేశాల పెట్టుబడులను రైల్వేశాఖలోకి ఆహ్వానించడం ద్వారా రానున్న రోజుల్లో కార్మికులు, ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ప్రనాకర్ ఆండ్య్రూ, వర్కింగ్ కమిటీ ప్రతినిధులు ఆదం సంతోష్కుమార్, ఉమానాగేంద్రమణి, జీ.మోహన్రావు, ఏ.రాజగోపాల్, భరణిభానుప్రసాద్, రవిశంకర్ ముక్తేవి, శ్రీహరి, వీరభద్రయ్య, రఘురామ్, రుద్రారెడ్డి, పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.