స్వచ్ఛతే... స్వస్థత...

The issue of independence came seven decades ago - Sakshi

తరతరాలుగా తరగని సమస్య. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచినా తీరని సమస్య. ఇటీవలి కాలం వరకు పాలకులకు పెద్దగా పట్టని సమస్య. కాలకృత్యాలు తీర్చుకోవడానికి తగిన మరుగు, పరిశుభ్రమైన పరిసరాలు దొరకక పడరాని పాట్లు పడుతున్న వారు మన దేశంలో కోట్ల సంఖ్యలోనే ఉన్నారు. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకోవలసిన పరిస్థితుల్లో మహిళలు పడుతున్న అగచాట్లు వర్ణనాతీతం. పారిశుద్ధ్యంలో మన వెనుకబాటును అంతర్జాతీయ సమాజం వేలెత్తి చూపడంతో అనివార్యమైన దశలో ప్రభుత్వం నాలుగేళ్ల కిందట ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమాన్ని తలపెట్టింది. ‘స్వచ్ఛ భారత్‌’ కింద టాయిలెట్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, ప్లాస్టిక్‌ వ్యర్థాల కట్టడి వంటి పనుల కోసం ఏటా రూ.60 కోట్ల నిధులు విడుదల చేస్తోంది.

అయినా లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉన్నాం.వెనుకబడిన దేశాల సంగతి సరే, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌లో దాదాపు 48 శాతం జనాభా ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకోవలసిన దుర్భర పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయి. ఒకవైపు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నప్పటికీ మరుగుదొడ్లు లేక ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్న వారి జనాభా అత్యధికంగా గల దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ముక్కున వేలేసుకుంటోంది. స్వచ్ఛ భారత్‌ పథకం మొదలైన తర్వాత గడచిన నాలుగేళ్లలో 38 శాతం మేరకు మాత్రమే అందుబాటులో ఉన్న గ్రామీణ పారిశుద్ధ్యం 80 శాతానికి చేరుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికీ బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలే టాయిలెట్‌ సౌకర్యానికి దూరంగా ఉంటున్నాయి.

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో 2019 అక్టోబర్‌ 2 నాటికి వందశాతం జనాభాకు టాయిలెట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితులను పరిశీలిస్తే, ఈ లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏడాది కిందట ‘వాటర్‌ ఎయిడ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచ దేశాల్లో టాయిలెట్‌ సౌకర్యాల స్థితిగతులపై ఒక నివేదిక విడుదల చేసింది. ‘ఔటాఫ్‌ ఆర్డర్‌: ది స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ టాయిలెట్స్‌’ పేరిట విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం భారత్‌లో 73.2 కోట్ల జనాభా ఇంకా టాయిలెట్‌ సౌకర్యానికి దూరంగానే ఉన్నారు. ఈ జనాభాలో 35.5 కోట్ల మంది మహిళలు, బాలికలే. మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల వీరంతా నానా అగచాట్లు పడుతున్నారు. తరచు వ్యాధుల బారిన పడుతున్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం మొదలైన ఈ నాలుగేళ్ల వ్యవధిలో ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకునే వారి సంఖ్య కేవలం 40 శాతం మాత్రమే తగ్గింది. అంటే ఈ నాలుగేళ్లలో అదనంగా దాదాపు 10 కోట్ల మందికి మాత్రమే టాయిలెట్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం అమలు కాకుంటే దేశంలోని పరిస్థితులు మరింత దుర్భరంగా తయారయ్యేవి. ‘వాటర్‌ ఎయిడ్‌’ నివేదిక ప్రకారం టాయిలెట్‌ సౌకర్యాలు అందుబాటులోని లేని జనాభా అత్యధికంగా ఉంటున్న దేశాల్లో భారత్‌ ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. ఈ విషయంలో పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్‌ మనకంటే మెరుగ్గా ఉన్నాయి.టాయిలెట్‌ చరిత్రటాయిలెట్‌లు ఆధునిక సృష్టి ఏమీ కాదు. తొలినాటి నాగరికతలు విలసిల్లిన కాలంలోనే టాయిలెట్‌లు వాడుకలో ఉండేవి. సింధులోయ నాగరికత కాలంలో ప్రస్తుత వాయవ్య భారత్, పాకిస్తాన్‌ ప్రాంతాల్లో దాదాపు ఆధునిక టాయిలెట్‌లను తలపించే పద్ధతుల్లో మరుగుదొడ్లను వినియోగించేవారు. సింధులోయ ప్రజలు మరుగుదొడ్లలోని వ్యర్థాలను నీటితో ఫ్లష్‌ చేసేవారు. వ్యర్థాలు జనాలకు ఇబ్బంది లేకుండా బయటకు పోవడానికి వీలుగా కట్టుదిట్టమైన మురుగునీటి కాల్వల వ్యవస్థను నిర్మించుకున్నారు. క్రీస్తుపూర్వం రెండువేల ఏళ్ల నాడే భారత భూభాగంలో ఇంత చక్కటి వ్యవస్థ ఉండేదంటే ఆధునిక భారతీయులకు ఆశ్చర్యం కలుగక మానదు. సింధులోయ నాగరికత ప్రజలకు గల పారిశుద్ధ్య స్పృహ ఆధునిక భారతీయుల్లో లోపించడం వల్లనే దేశంలో పారిశుద్ధ్య పరిస్థితులు దిగజారాయి. క్రీస్తుపూర్వం 1200 ఏళ్లనాడు ఈజిప్టులో కొద్దిమంది ధనవంతులు మాత్రమే ఇళ్లలో ఇసుక నింపిన టాయిలెట్‌లు ఉపయోగించేవారు.

వాటిని బానిసలు శుభ్రం చేసేవారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్దిలో రోమన్‌ సామ్రాజ్యంలో దాదాపు సింధులోయ నాగరికతలో వినియోగించిన మాదిరి టాయిలెట్‌లు, కట్టుదిట్టమైన మురుగునీటి పారుదల వ్యవస్థ వాడుకలో ఉండేవి. రోమన్‌ సామ్రాజ్యంలో పబ్లిక్‌ టాయిలెట్‌లు కూడా అందుబాటులో ఉండేవి. రోమన్లకు ‘క్లోవాసినా’ అనే మురుగు వ్యర్థాల అధిదేవత కూడా ఉండేది. ‘క్లోవాసినా’ను పూజించే రోమన్లు పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. రోమన్‌ సామ్రాజ్యం క్రీస్తుశకం ఐదో శతాబ్దిలో పతనమైన తర్వాత అక్కడి టాయిలెట్‌ వ్యవస్థ కూడా కనుమరుగైంది. తిరిగి కోలుకోవడానికి శతాబ్దాలు పట్టింది. అలెగ్జాండర్‌ కమ్మింగ్‌ 1775లో ఫ్లషింగ్‌ లావెటరీకి పేటెంట్‌ తీసుకున్న యూరోపియన్‌ దేశాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడింది. లండన్‌లో తొలిసారిగా 1852 పబ్లిక్‌ టాయిలెట్‌ అందుబాటులోకి వచ్చింది. తర్వాతి కాలంలో మిగిలిన నగరాల్లో కూడా పబ్లిక్‌ టాయిలెట్‌లు ఏర్పడ్డాయి. ఫ్లషింగ్‌ టాయిలెట్‌లు తొలినాళ్లలో కొద్దిమంది ధనికులకు పరిమితమైన విలాసవంతమైన సౌకర్యంగా మాత్రమే ఉండేవి. పంతొమ్మిదో శతాబ్దిలో మాత్రమే ఇవి సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రావడం మొదలైంది. ఇరవయ్యో శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు ఇంటింటా ఆధునిక టాయిలెట్‌లు వాడుకలోకి వచ్చాయి.

 వరల్డ్‌ టాయిలెట్‌ ఆర్గనైజేషన్‌తో మార్పుఇరవై ఒకటో శతాబ్దికి చేరుకున్నా ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, వెనుకబడిన నిరుపేద దేశాల్లోను టాయిలెట్‌ సౌకర్యానికి దూరంగా ఉంటున్న ప్రజల సంఖ్య కోట్లలో ఉండటంతో అంతర్జాతీయ సమాజంలో కదలిక వచ్చింది. ఫలితంగా 2001 సంవత్సరంలో వరల్డ్‌ టాయిలెట్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పడింది. రెస్ట్‌రూమ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సింగపూర్‌ వ్యవస్థాపకుడు, స్వచ్ఛంద కార్యకర్త జాక్‌ సిమ్‌ వరల్డ్‌ టాయిలెట్‌ ఆర్గనైజేషన్‌ను నెలకొల్పాడు. పట్టుమని పదిహేను మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు ఏకంగా 53 దేశాలకు చెందిన 151 స్వచ్ఛంద సంస్థలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ సంస్థ ఏటా వరల్డ్‌ టాయిలెట్‌ సమ్మిట్‌ నిర్వహిస్తూ వస్తోంది. తొలిసారిగా 2001 నవంబర్‌ 19 నుంచి 21 వరకు సింగపూర్‌లో నిర్వహించిన సదస్సులో నవంబర్‌ 19వ తేదీని వరల్డ్‌ టాయిలెట్‌ డేగా ప్రకటించారు. భారత్‌లో తొలిసారిగా 2007లో న్యూఢిల్లీలో ఈ సదస్సు జరిగింది.

వరల్డ్‌ టాయిలెట్‌ డే సందర్భంగా ‘అర్జెంట్‌ రన్‌’ వంటి కార్యక్రమాల ద్వారా టాయిలెట్‌ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, టాయిలెట్‌ల ఏర్పాటు, పారిశుద్ధ్య సౌకర్యాల మెరుగుదల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంతో చైనా, భారత్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సానుకూలమైన కదలిక వచ్చింది. వరల్డ్‌ టాయిలెట్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పడటానికి ఏడాది ముందే అంటే, 2000 ఏప్రిల్‌ 1న అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం సమీకృత గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని, సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు నామమాత్రపు ఫలితాలను మాత్రమే సాధించగలిగాయి. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో 2012 ఏప్రిల్‌ 1న ‘నిర్మల్‌ భారత్‌ అభియాన్‌’ పేరిట పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ‘నిర్మల్‌ భారత్‌’ కూడా చెప్పుకోదగిన ఫలితాలను సాధించడంలో విఫలమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ‘నిర్మల్‌ భారత్‌’ కార్యక్రమానికే కొన్ని మార్పులు చేసి, ‘స్వచ్ఛభారత్‌’గా అమలులోకి తెచ్చింది. ‘స్వచ్ఛభారత్‌’ అమలులోకి వచ్చాక 2015లో న్యూఢిల్లీలో వరల్డ్‌ టాయిలెట్‌ సమ్మిట్‌ జరిగింది. అప్పటి నుంచి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణం కొంత వేగం పుంజుకుంది.

‘స్వచ్ఛభారత్‌’ను ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుద్ధ్య ఉద్యమంగా ప్రపంచబ్యాంకు అభివర్ణించింది. ఈ ఏడాది టాయిలెట్‌ డే కార్యక్రమాలుపారిశుద్ధ్యం, పరిశుభ్రమైన టాయిలెట్‌ల వినియోగంపై అవగాహన కల్పించడానికి ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి, ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ సంస్థలు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట ఇన్‌ఫ్లేటబుల్‌ టాయిలెట్‌ను ప్రదర్శించనున్నారు. నైజీరియా రాజధాని అబుజాలో హోప్‌స్ప్రింగ్‌ వాటర్‌ చారిటీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హోప్‌స్ప్రింగ్‌ రన్‌ పేరిట ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించనున్నారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో మనీలా వాటర్‌ ఫౌండేషన్‌ పారిశుద్ధ్యంపై అవగాహన కోసం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. వరల్డ్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం సహకారంతో ఘనాలో శానిటేషన్‌ హ్యాకథాన్‌ నిర్వహించనున్నారు.

ఇవే కాకుండా పలు దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో పారిశుద్ధ్యం, సురక్షితమైన టాయిలెట్‌ల వినియోగంపై అవగాహన కల్పించడానికి సదస్సులు, చర్చా కార్యక్రమాలు, మారథాన్‌లు, ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.దక్షిణాది రాష్ట్రాలే మెరుగుటాయిలెట్‌ల వాడుక, పారిశుద్ధ్య సౌకర్యాల అందుబాటులో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కొంత మెరుగ్గానే ఉన్నాయి. కేరళ ఈ అంశంలో దేశంలోనే ముందంజలో ఉంది. కేరళ జనాభాలో టాయిలెట్‌లు వినియోగిస్తున్నవారు 98 శాతానికి పైగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ‘స్వచ్ఛ భారత్‌’ అమలులోకి వచ్చిన తర్వాత గడచిన నాలుగేళ్లలో దాదాపు 8 కోట్ల టాయిలెట్‌లను నిర్మించారు. అయితే, టాయిలెట్‌ల నిర్మాణంపై దృష్టి సారించిన ప్రభుత్వం వాటి నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు లేకపోలేదు. దేశవ్యాప్తంగా 96.5 శాతం గ్రామీణ ప్రాథమిక పాఠశాలల్లో టాయిలెట్‌లు నిర్మించగా, వాటిలో దాదాపు 27.7 శాతం టాయిలెట్‌లు సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా పడి ఉన్నాయని ‘ఏన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌’ (ఏఎస్‌ఈఆర్‌) వెల్లడించింది.

టాయిలెట్‌లు అందుబాటులో లేకపోవడం వల్లనే చాలామంది బాలికలు చదువులకు దూరమవుతున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు వెళుతున్న బాలికల్లో ఏటా దాదాపు 23 శాతం మంది ఇదే కారణం వల్ల అర్ధంతరంగానే చదువు మానుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. దాదాపు 95.8 శాతం పాఠశాలల్లో టాయిలెట్‌లు నిర్మించగా, వాటిలో కేవలం 54.9 శాతం మాత్రమే వాడుకోగలిగే స్థితిలో ఉన్నాయని వెల్లడించింది. టాయిలెట్‌లు లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్న టాయిలెట్‌లు వాడుకోవడానికి వీల్లేనంత అపరిశుభ్రంగా ఉండటం మరో సమస్య. ‘స్వచ్ఛభారత్‌’ కింద నిర్మించిన టాయిలెట్‌ల సంఖ్యలపైనే ప్రచారం చేసుకుంటున్న పాలకులు, నిర్మించిన తర్వాత వాడుకలో వాటి అతీ గతీ ఎలా ఉంటున్నాయో పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకోవడం వల్ల మాత్రమే కాదు, అపరిశుభ్రమైన టాయిలెట్‌ల వల్ల కూడా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నీటి కాలుష్యం వల్ల వ్యాపించే వ్యాధులన్నింటికీ సరైన టాయిలెట్‌ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడమే అసలు కారణమని, మానవ విసర్జకాల్లోని సూక్ష్మజీవులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల ప్రమాదకర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. డ్రైనేజీల్లోని మురుగునీరు రోడ్లపైకి చేరడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతున్నారు. స్వచ్ఛభారత్‌ అమలులోకి వచ్చాక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7.95 కోట్ల టాయిలెట్‌లు నిర్మించడం వల్ల దేశంలో దాదాపు 1.82 లక్షల డయేరియా మరణాలను నివారించగలిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా అంచనాలో వెల్లడించింది. స్వచ్ఛభారత్‌ ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకునేవారి సంఖ్య 45 శాతం మేరకు తగ్గినట్లు ఎకనామిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 2017–18 నివేదిక ప్రకటించింది. ·ఆరోగ్యభంగం... ఆర్థికభారం...మెరుగైన పారిశుద్ధ్య వసతుల కొరత, పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల దేశ జనాభాలో అత్యధికులు తరచు డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్‌ తదితర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులైతే అకాల మరణాల పాలవుతున్నారు. కొందరు చిన్నారులు ఎదుగుదల లోపాలతో బాధపడుతున్నారు. ఏటా డయేరియా కారణంగానే దాదాపు 1.17 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 38 శాతం మంది ఎదుగుదల లోపాలతో, నులిపురుగుల కారణంగా తలెత్తే రక్తహీనతతో బాధపడుతున్నారు. మహిళలు, బాలికలు రక్తహీనత బారిన పడుతున్నారు. మరుగుదొడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాల కొరత వల్ల దేశ ఆర్థికరంగంపై గణనీయమైన భారం పడుతోంది. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం పారిశుద్ధ్య సౌకర్యాల కొరత వల్ల స్థూల జాతీయోత్పత్తిపై (జీడీపీ) దాదాపు 6.4 శాతం వార్షిక భారం పడుతోంది. పారిశుధ్య కొరత వల్ల నీటి కాలుష్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల మాత్రమే కాకుండా, పర్యాటక రంగానికి సైతం వాటిల్లే నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, మన దేశ ఆర్థిక రంగానికి ఏటా దాదాపు రూ.2.4 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే, ప్రభుత్వం ఈ ఏడాది ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో 7 శాతం మేరకు కోత పెట్టింది. ప్రాథమిక ఆరోగ్యరంగానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో 2.7 శాతం మేరకు కోత పెట్టింది.

స్వచ్ఛభారత్‌పై పాలకుల చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో బడ్జెట్‌ కేటాయింపుల్లోని ఈ కోతలే తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో అందరికీ పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నట్లయితే ప్రజల ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, జనాభా తలసరి ఆదాయం కనీసం రూ.50 వేల మేరకు పెరిగే అవకాశాలు ఉంటాయని యూనిసెఫ్‌ ఒక అధ్యయనంలో అంచనా వేసింది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం అమలు మొదలైన తర్వాత ఇప్పటి వరకు కొంత పురోగతి సాధ్యమైంది. దేశంలోని పదకొండు రాష్ట్రాలు, 419 జిల్లాలు ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకోవలసిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 62.45 శాతం ఇళ్లకు టాయిలెట్లు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వెల్లడించిన తాజా లెక్కల ప్రకారం టాయిలెట్లను వినియోగించేవారి సంఖ్య 91 శాతానికి చేరుకుంది. టాయిలెట్‌ ట్రివియాటాయిలెట్‌ ట్రివియాటాయిలెట్‌ల వల్ల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. మరుగు ఉండటం వల్ల ఆత్మగౌరవానికి భంగం కలగదు. అలాగని టాయిలెట్‌ల వల్ల ఉపయోగాలే కాదు, ఒక్కోసారి ప్రమాదాలూ సంభవించవచ్చు. టాయిలెట్‌లలో జరిగే ప్రమాదాల వల్ల ఏటా 40 వేల మంది అమెరికన్లు ఆస్పత్రుల పాలవుతున్నారు.

మన దేశంలో ఇలాంటి ప్రమాదాలపై ఎలాంటి గణాంకాలూ సేకరించిన దాఖలాల్లేవు. టాయిలెట్‌లో జారిపడటం వల్లనే బ్రిటిష్‌ చక్రవర్తి రెండో జార్జ్‌ 1760లో ప్రాణాలు కోల్పోయాడు.టాయిలెట్‌ను ఫ్లష్‌ చేసేటప్పుడు సూక్ష్మజీవులు ఆరడుగుల దూరం వరకు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఫ్లష్‌ చేసేటప్పుడు టాయిలెట్‌ సీటును కవర్‌ చేయడం మంచిది.ఇదివరకటి కాలంలో అతి అరుదుగా నగా నట్రా వంటివి టాయిలెట్‌లలో పొరపాటున పోగొట్టుకునే వారు. ఆధునికత మితిమీరిన తర్వాత టాయిలెట్‌లలో సెల్‌ఫోన్లనే చేజార్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెల్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు 70 లక్షల మంది టాయిలెట్‌లలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నారు.అత్యంత ఖరీదైన టాయిలెట్‌ ఎక్కడుందో తెలుసా? భూమ్మీద మాత్రం కాదు. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంది. దీని తయారీకైన ఖర్చు 19 మిలియన్‌ డాలర్లు (రూ.137.7 కోట్లు).

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top