
రెండు గంటల్లోనే ఫలితాలు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఈవీఎంలు వినియోగించినందున ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. దీనికితోడు జిల్లాలో ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీల్లోనూ వార్డుల సంఖ్య 25కు మించనందున
శ్రీకాకుళం సిటీ, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఈవీఎంలు వినియోగించినందున ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. దీనికితోడు జిల్లాలో ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీల్లోనూ వార్డుల సంఖ్య 25కు మించనందున లెక్కింపు ప్రారంభమైన రెండుమూడు గంటల్లోపే పూర్తి ఫలితాలు వచ్చేస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. రౌండ్లవారీగా జరగనున్న లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుంది. అధికారవర్గాల సమాచారం ప్రకారం మొత్తం ప్రక్రియ ఇలా జరుగుతుంది.
ఉదయం 7 గంటలకు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరిచి ఈవీఎంలను తెస్తారు. వాటిని వరుసగా ఏర్పాటు చేసిన టేబుళ్ల(ఒక్కో టేబుల్పై ఒక్కో ఈవీఎం)పై ఉంచుతారు. అసలు లెక్కింపు ప్రక్రియ 8 గంటలకు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం టేబుళ్లపై ఏర్పాటు చేసిన ఈవీఎంలన్నింటినీ ఒకేసారి తెరిచి ఓట్లు లెక్కిస్తారు. దీన్నే ఒక రౌండుగా పరిగణిస్తారు.
పాలకొండకు చెందిన 19 వార్డుల ఓట్లను లెక్కించేందుకు మొత్తం 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగు రౌండ్లలో వీటిని లెక్కిస్తారు.
ఆమదాలవలసలోని 23 వార్డుల ఓట్లను లెక్కించేందుకు 12 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అంటే రెండు రౌండ్లలోనే ఇక్కడ లెక్కింపు పూర్తి చేస్తారు.
పలాస మున్సిపాలిటీలో 25 వార్డులకు గానూ 5 టేబుల్స్ సిద్దం చేశారు. మొత్తం 5 రౌండ్లలో ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 23 వార్డులకు 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు 5 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేస్తారు.
వరుసలో టేబుళ్లపై ఏర్పాటు చేసిన ఈవీఎంలను తెరిచి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో నమోదు చేస్తారు. వాటిని ఆర్వో సమక్షంలో ఏజెంట్లకు చూపించిన అనంతరం ఆ రౌండ్ వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు.
ఒక్కో రౌండు లెక్కింపునకు అరగంటకు మించి సమయం పట్టదు. ఈ లెక్కన గరిష్టంగా ఐదు రౌండ్లే ఉన్నందున సుమారు రెండున్నర గంటల్లోనే ఫలితం తేలిపోతుంది.