కుప్పం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వైఎస్సార్సీపీకి చెందిన దళిత నేత కణ్ణన్పై దౌర్జన్యం చేసి హింసించినందుకు నిరసనగా దళితులు గురువారం సాయంత్రం కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
కుప్పం (చిత్తూరు జిల్లా) : కుప్పం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వైఎస్సార్సీపీకి చెందిన దళిత నేత కణ్ణన్పై దౌర్జన్యం చేసి హింసించినందుకు నిరసనగా దళితులు గురువారం సాయంత్రం కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. కుప్పం కొత్తపేటలో గంగమాంబ ఆలయానికి సంబంధించి జాతరను ఏటా కణ్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించేవారు. ఈ నెలాఖరులో జరిగే జాతరను ఈసారి తామే నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నేతలు పేర్కొన్నారు. దాంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. సీఐ రాజశేఖర్ ఇరు వర్గాలను పిలిపించి మందలించి పంపారు.
కణ్ణన్ను రెండు రోజులపాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఉంచుకుని మానసికంగా వేధించి జాతర టీడీపీ వాళ్లు నిర్వహించేందుకు అంగీకరించాలని పట్టుబట్టారు. దాంతో మనస్థాపానికి గురైన కణ్ణన్ ఆత్మహత్యాయత్నం చేశారు. అతనిని స్థానిక ప్రియ నర్సింగ్ హోమ్లో చేర్పించారు. ప్రస్తుతం తను చికిత్సపొందుతున్నాడు. దళితవాడకు చెందినవారంతా గురువారం సాయంత్రం పోలీస్స్టేషన్కు వచ్చి సీఐపై చర్య తీసుకోవాలని, జాతరను తామే నిర్వహిస్తామని కోరుతూ ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు నచ్చజెప్పి వారి ప్రయత్నాన్ని విరమింపజేశారు. ఈ విషయమై సీఐని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.