నిజాయితీగా.. దర్యాప్తు చేపట్టాలి 

Should be Honestly investigated - Sakshi

వారెంట్‌ ఉన్న వారిని అరెస్ట్‌ చేయండి

నేర సమీక్షలో డీఐజీ ఆశిష్‌ కుమార్‌ సింగ్‌

బరంపురం : సమాజానికి, ప్రజలకు జవాబుదారీగా పోలీసు అధికారులు పనిచేస్తూ నిజాయితీగా కేసులను దర్యాప్తు చేసి కోర్టుకు అప్పగించాలని దక్షిణాంచల్‌ డీఐజీ ఆశిష్‌ కుమార్‌ సింగ్‌ కోరారు. దక్షిణాంచల్‌ రేంజ్‌ స్థాయి నేర సమీక్ష సమావేశం డీఐజీ కార్యాలయం సమావేశం హాల్లో  బుధవారం జరిగింది. డీఐజీ ఆశిష్‌ కుమార్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఎస్‌పీలు, డీఎస్‌పీలు, ఎస్‌డీపీఓలు, ఐఐసీ అధికారలు పాల్గొనగా డీఐజీ ఆశిష్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ గంజాం జిల్లాలో గల గంజాం పోలీసు జిల్లా, బరంపురం పోలీసు జిల్లా పరిధుల్లోని పోలీస్‌స్టేషన్‌లలో జరిగిన నేరాల జాబితాలో ఉండి తప్పించుకు తిరుగుతున్న నేరస్థులపై వెంటనే అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసి వారిని అరెస్ట్‌  చేయాలని సూచించారు.

ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్న నేరస్థుల సమాచారం సేకరించి అరెస్ట్‌ చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్‌లలో నమోదవుతున్న కేసులపై సరైన దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మహిళా డెస్క్‌ ఏర్పాటు చేసి మహిళల కేసులపై తొలుత కౌన్సెలింగ్‌ చేసిన అనంతరం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బరంపురం ఎస్‌పీ పినాకి మిశ్రా తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top