ఇక్కడ అమ్మాయి... అక్కడ అబ్బాయి! | Pakistan Citizen Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇక్కడ అమ్మాయి... అక్కడ అబ్బాయి!

Dec 16 2019 8:17 AM | Updated on Dec 16 2019 8:17 AM

Pakistan Citizen Arrest in Hyderabad - Sakshi

ఇక్రమ్‌

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి అనేక మంది పాకిస్థాన్‌ జాతీయులు వస్తూ ఉంటారు... సిటీలో కొందరు పాక్‌ ముష్కరులు అరెస్టవుతూ ఉంటారు... మొదటి రకం వారు విద్య, వైద్య అవసరాల కోసమైతే, రెండో కోవకు చెందినవారు ఉగ్రవాదులు, ఐఎస్‌ఐ ఏజెంట్లు. అయితే ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్‌లో పట్టుబడిన ఇద్దరు పాకిస్థానీయులు మాత్రం ప్రేమ కోసం దేశంలో అడుగుపెట్టిన వారే. ఇరువురూ అక్రమంగా ప్రవేశించి చిక్కిన వారే. వీరిలో ఒకరు గత ఏడాది పాతబస్తీలో పట్టుబడిన అక్రమ్‌కాగా, మరొకరు ఈ నెల మొదటి వారంలో సికింద్రాబాద్‌లో చిక్కిన గుల్జార్‌. ఈ రెండు కేసుల్లో ఒకరు నగర నేర పరి«శోధన విభాగం (సీసీఎస్‌) ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్ద ఉండగా, మరోటి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తులో ఉంది. ఈ ఇద్దరు పాకిస్థానీయులు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. 

పాతబస్తీకి వచ్చిన ఇక్రమ్‌...
నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. ఆమె పన్నెండేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్‌ వెళ్లింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న సదరు మహిళకు పాకిస్థానీ మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ అలియాస్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిళ్లామె హైదరాబాద్‌ తిరిగి వచ్చేసింది. 2011లో ఉస్మాన్‌ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్‌ వీసాపై వచ్చినట్లు చెప్పాడు. అయితే వాస్తవానికి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన అతడు దుబాయ్‌ నుంచి నేపాల్‌ వరకు విమానంలో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అట్నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఇక్రమ్‌ వచ్చిన ఆరు నెలలకు ఇతగాడు అక్రమంగా దేశంలోకి వచ్చాడన్న విషయం తెలుసుకున్న సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించింది. దీంతో కక్షకట్టిన అతగాడు ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్‌ చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు గతఏడాది జూన్‌లో నిందితుడిని అరెస్టు చేశారు.

గడివేముల చేరుకున్న గుల్జార్‌...
పాకిస్థాన్, పంజాబ్‌ ప్రావెన్సీలోని కుల్వాల్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ గుల్జార్‌ ఖాన్‌ 2004లో దుబాయ్‌లో నివసించాడు. అప్పట్లో పొరపాటుగా వచ్చిన మిస్డ్‌ కాల్‌కు స్పందించి ఫోన్‌ చేశాడు. అది కర్నూలు జిల్లా గడివేములకు చెందిన దౌతల్‌బీ అందుకోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహిత అయిన దౌతల్‌కు భర్త కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భారత్‌కు వచ్చేందుకుగాను గుల్జార్‌ 2008లో సౌదీ వెళ్లాడు. అక్కడ తన పాకిస్థానీ గుర్తింపులను ధ్వంసం చేసిన అతను భారత ఎంబసీని ఆశ్రయించాడు. తాను హరిద్వార్‌ నుంచి హజ్‌ యాత్ర కోసం వచ్చానని, తన పాస్‌పోర్ట్‌ సహా డాక్యుమెంట్స్‌ పోయాయని ఫిర్యాదు చేశాడు. గుల్జార్‌కు ఎమెర్జెన్సీ సర్టిఫికెట్‌ (ఈసీ) జారీ చేసిన అధికారులు విమానంలో ముంబైకి పంపారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇతగాడు దౌతల్‌బీని వెతుక్కుంటూ కర్నూలు మీదుగా గడివేముల చేరుకున్నాడు. ఆమెను కలుసుకున్న గుల్జార్‌ వివాహం చేసుకోవడంతో పాటు అక్కడే పెయింటర్‌గా స్థిరపడ్డాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన అతగాడు కుటుంబంతో సహా పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని భావించాడు. ఇందుకుగాను విజయవాడ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి పాస్‌పోర్ట్స్‌ పొందినా... సోదరుడి  సలహా మేరకు కర్తార్‌పూర్‌ కారిడార్‌ మీదుగా అడ్డదారిలో వెళ్లాలని భావించాడు. ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్‌ చేరుకునేందుకు కర్నూలు నుంచి రైలులో ఈ నెల 3న హైదరాబాద్‌ వచ్చాడు. అప్పటికే  ఇతడి వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వారిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీసీఎస్‌ ఆధీనంలోని సిట్‌ పోలీసులు సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్‌ వద్ద పట్టుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement