
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల అత్తాపూర్కు చెందిన వృద్ధ దంపతులపై.. వారి కారు డ్రైవరే దాడి చేసిహతమార్చడం కలకలంసృష్టించింది.
♦ ఏడాది క్రితం బోడుప్పల్కు చెందిన మరో వృద్ధ దంపతులపై దాడి జరిగింది. ఒంటరిగా ఉంటున్న ఆ దంపతుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యక్తే (కేర్ గివర్) దాడికి పాల్పడ్డాడు. ఆపై ఆభరణాలు, డబ్బుతో ఉడాయించాడు.
♦ గతంలో మల్కాజిగిరికి చెందిన ఒంటరి దంపతులపై సైతం దొంగలు దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. ఇలా తరచూ ఎక్కడో ఒకచోట సీనియర్ సిటిజన్స్పై దాడులుజరుగుతున్నాయి. వయోధికులే లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఓవైపు దొంగల స్వైరవిహారం, మరోవైపు కారు డ్రైవర్లుగా, కేర్గివర్స్గా విధుల్లో చేరి మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలాంటి చట్టబద్ధత లేని కొన్ని కేర్గివర్స్ ఏజెన్సీలుఒంటరి వృద్ధులు లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవసరాల నిమిత్తం కొడుకులు, కూతుళ్లు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్తుండడంతో ఇళ్లల్లో వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు. ఓవైపు వయోభారం వేధిస్తుండగా.. మరోవైపు ఈ తరహా దాడులు వారి భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య కొరవడిన సమన్వయం, వృద్ధుల విషయంలో చిన్నచూపు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వృద్ధుల భద్రత కోసం కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.
‘సేవా’ దోపిడీ...
గ్రేటర్లో 65 ఏళ్లు దాటిన వయోధికులు సుమారు 20లక్షల వరకు ఉండగా... వారిలో 3లక్షల మందికి పైగా ఒంటరి వృద్ధ దంపతులు, కొన్ని ఇళ్లల్లో భార్యను కోల్పోయిన భర్త లేదా భర్తను కోల్పోయిన భార్య సింగిల్గా ఉంటున్నారు. ఒకప్పుడు ఎంతో బాగా బతికినవాళ్లు, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించి నాలుగు డబ్బులు వెనకేసుకున్నవాళ్లు సైతం వృద్ధాప్యంలో కొద్దిపాటి చేయూత కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూడాల్సి వస్తోంది. వివిధ రకాల అవసరాలను అందజేసే సంస్థలుగా, ఏజెన్సీలుగా, డ్రైవర్లుగా చలామణి అయ్యే వ్యక్తుల మోసాలకు ఈ ఒంటరితనమే అవకాశంగా మారుతోంది. పిల్లలు విదేశాల్లో స్థిరపడడం, అమ్మాయిలైతే పెళ్లిళ్లు చేసుకొని అత్తారిళ్లకు వెళ్లిపోవడంతో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఒకవైపు వృద్ధాప్యంతో బాధపడుతున్న వాళ్లకు ఆస్తిపాస్తులను కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో వివిధ రకాల సహాయం అందజేసే నెపంతో ఇళ్లల్లో చేరుతున్న వాళ్లు చివరకు డబ్బు, నగల కోసం వృద్ధుల ప్రాణాలు తీస్తున్నారు. ఆర్థికంగా మోసాలకు పాల్పడుతున్నా రు. సేవల రూపంలో భారం మోపుతున్నారు.
చట్టబద్ధతేదీ?
కేర్, అపోలో లాంటి పెద్ద ఆసుపత్రులు, నైటింగేల్ లాంటి కొన్ని సంస్థల ఆధ్వర్యంలో నడిచే కేర్గివర్స్ ఏజెన్సీలు మినహాయించి... నగరంలో పదుల సంఖ్యలో విస్తరించుకున్న చిన్నాచితక ఏజేన్సీలు అనారోగ్యంతో బాధపడుతున్న ఒంటరి వృద్ధులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయి. ఎలాంటి శిక్షణ, నైపుణ్యం లేని కేర్గివర్స్ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దండుకుంటున్నాయి. ఒక్కో కేర్గివింగ్ సర్వీసుకు నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 పైగా వసూలు చేస్తున్నాయి. మరోవైపు ఇలాంటి సంస్థలకు ఏవిధమైన చట్టబద్ధత కూడా ఉండదు. వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలోనూ ఎలాంటి రికార్డులు ఉండవు. నిజానికి సొసైటీల చట్టం ప్రకారం నమోదు చేసుకున్న ఏజెన్సీలు, సంస్థలు తాము అందజేసే వివిధ రకాల సర్వీసుల వివరాలను వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులకు తెలియజేయాలి. అదే సమయంలో వృద్ధుల కోసం నియమించిన కేర్గివర్స్ వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో అందజేయాలి.
కేర్గివర్స్ ఆధార్, ఫొటో, అడ్రస్ తదితర వివరాలను పోలీసులకు ఇవ్వాలి. మరోవైపు పోలీసులు కూడా తమ స్టేషన్ పరిధిలోని ఒంటరి వృద్ధుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకోవాలి. ఇంట్లో ఉండే డ్రైవర్లు, పనివాళ్లు, కేర్గివర్స్ తదితరుల జాబితాను సేకరించాలి. కానీ ఈ కార్యక్రమాలేవీ సక్రమంగా జరగడం లేదు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఇందుకు కారణం. కొద్ది రోజుల క్రితం వృద్ధుల సంక్షేమం, భద్రతపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు, హెల్పేజ్ ఇండియా సంస్థతో పాటు పోలీసు ఉన్నతాధికారులు వివిధ అంశాలపై చర్చించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు సపర్యలు చేసేందుకు కేర్గివర్స్ ఏజెన్సీలను ఆశ్రయిస్తే పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని... ఎలాంటి శిక్షణ, నైపుణ్యం లేని వాళ్లను నియమించి అక్రమ వసూళ్లకు దిగుతున్నారని పలువురు సీనియర్స్ ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఊరు, పేరు లేని వ్యక్తులు కేర్గివర్స్గా చేరి డబ్బు కోసం వృద్ధులపై దాడులకు తెగబడుతున్నారని పలు సంస్థలు అధికారుల దృష్టికి తీసుకొచ్చాయి. వృద్ధుల భద్రతకు సంబంధించిన అంశాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
నియంత్రణ అవసరం...
♦ కేర్గివర్స్గా చేరేవాళ్లు వృద్ధులకు వేళకు మందులు, ఇంజెక్షన్లుఅవసరమైతే సెలైన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు వారికిమెడికల్ పరిజ్ఞానం అవసరం. నర్సింగ్ సేవల్లో కనీసం6 నెలల శిక్షణ ఉండాలి.
♦ కానీ చాలా సంస్థలు ఎలాంటి శిక్షణ, నైపుణ్యం లేని వాళ్లను నియమిస్తున్నాయి. కొద్దిపాటిఅవగాహన కల్పించి పెద్ద ఎత్తున దండుకుంటున్నాయి.
♦ కేర్గివర్స్ ఏజెన్సీలు, వాటిలో పనిచేసే ఉద్యోగులపై ఎలాంటి రికార్డులు లేవు. చార్జీలపైన నియంత్రణ లేదు.
♦ వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు నియంత్రణ చర్యలు చేపట్టాలి.
♦ గ్రేటర్లోవయోధికులు (65 ఏళ్లకు పైబడినవారు): దాదాపు 20 లక్షలు
♦ మొత్తం జనాభాలో వీరి శాతం: 15శాతం
♦ ఒంటరి వృద్ధులు: 3లక్షలకు పైగా