అనుమానం + అతి చనువు = హత్య

man allegedly kills a married woman

ఖమ్మంక్రైం : అనైతిక సంబంధం. ప్రియుడి అనుమానం, మితికి మించిన అతి చనువు.. ఓ మహిళను చంపేశాయి. ఖమ్మంనిలో ఇది జరిగింది.

వన్‌ టౌన్‌ సీఐ రెహమాన్‌ తెలిపిన వివరాలు...
పాకబండ బజార్‌కు చెందిన జగసాని రూప(42) భర్త శ్రీనివాస్, ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. తన భర్త చేసిన బట్టల వ్యాపారాన్ని వృత్తిగా ఆమె ఎంచుకుంది. ఒక్కగానొక్క కూతురికి వివాహం చేసింది.
ముస్తాఫానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ గయాజ్‌ పాషాతో ఆమెకు సాన్నిహిత్యముంది. వారిద్దరూ నాలుగేళ్ల నుంచి ముస్తాఫానగర్‌లో సహజీవనం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ముస్తాఫానగర్‌లోని బరాకత్‌ చర్చి ప్రాంతంలో కొత్త ఇంటిని రూప కట్టుకుంది. ఇల్లు కట్టేందుకు వచ్చిన మేస్త్రీ ప్రసాద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారు చనువుగా ఉంటున్నారు.
దీనిని గయాజ్‌పాషా గమనించాడు. రూపను పలుమార్లు హెచ్చరించాడు. మేస్త్రీ ప్రసాద్‌ను కూడా మందలించాడు. తమ మధ్య కేవలం పరిచయం మాత్రమే ఉందని పాషాతో రూప చెప్పింది. ఈ ‘పరిచయం–చనువు’ విషయమై వారి మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయి.
బుధవారం రాత్రి కూడా వారిద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు.  తెల్లవారుజాము వరకు గొడవ పడుతూనే ఉన్నారు. క్షణికావేశంలో రూప మెడకు వైరు బిగించాడు పాషా. క్షణాల్లోనే ఆమె ప్రాణాలొదిలింది.
తెల్లవారాక చుట్టుపక్కల వారికి తెలిసింది. వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటికి సీఐ రెహమాన్‌ వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించారు.
గయాజ్‌ పాషాను అదుపులోకి తీసుకుని కేసు విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top