ఆర్‌బీఐ రేట్‌ కట్‌ : రూపాయి బలహీనం | Rupee falls 34 paise against US dollar | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ రేట్‌ కట్‌ : రూపాయి బలహీనం

May 22 2020 3:50 PM | Updated on May 22 2020 3:53 PM

Rupee falls 34 paise against US dollar - Sakshi

సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు తగ్గింపు చర్య పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ ను బలహీన పర్చడంతో దేశీయ కరెన్సీ  రూపాయి కుప్పకూలింది. డాలరు మారకంలో  రూపాయి  విలువ  శుక్రవారం 34 పైసలు తగ్గి 75.95 వద్ద   స్థిరపడింది.  తద్వారా మరోసారి 76 కనిష్ఠ స్థాయికి చేరువైంది. గురువారం 75.61 వద్ద ముగిసింది.

మార్కెట్‌వర్గాల అంచనాలకు అనుగుణంగా వడ్డీరేట్లలో కోత లేకపోవడం మార్కెట్లను నిరాశపర్చాయి.దీంతో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 75.72 వద్ద బలహీనంగా ప్రారంభమైనా రూపాయి అనంతరం మరింత క్షీణించి చివరికి 75.95 వద్ద ముగిసింది.  దేశీయ ఈక్విటీల బలహీనతకు తోడు, అమెరకా డాలరు  బలం, దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రభావాన్ని చూపాయని ట్రేడర్లు  పేర్కొన్నారు. ఇక కమోడిటీ విషయానికి వస్తే జూన్‌ కాంట్రాక్ట్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.46,690గా ఉంది. (ఆర్‌బీఐ దెబ్బ: మార్కెట్ల పతనం)

ఆర్‌బీఐ రేటు కట్  ఫారెక్స్ వ్యాపారులను ఉత్సాహపరచలేదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు.. 40 పాయింట్ల రేట్‌  మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నప‍్పటికీ, రుణాల పూర్తి స్థాయి పునర్నిర్మాణాన్ని అందించలేదన్నారు. అలాగే   2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ అంచనాలను వెల్లడించకపోవడం దెబ్బతీసిందని తెలిపారు.  ఆయా  రంగాల ఆధారంగా  ప్రత్యేక చర్యలు తీసుకోవలసి ఉందని గుప్తా అన్నారు. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు)

కాగా ఆర్‌బీఐ శుక్రవారం వడ్డీ రేట్లను తగ్గించింది, రుణాల చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని  మరో మూడు నెలలు పొడిగించింది. అలాగే నాలుగు దశాబ్దాల్లో మొదటిసారిగా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్రయత్నంలో బ్యాంకులకు కార్పొరేట్‌ ఎక్కువ రుణాలు ఇవ్వడానికి అనుమతించింది.

Advertisement
 
Advertisement
Advertisement