
న్యూఢిల్లీ: కస్టమర్లకు డీల్స్ అందించే సంస్థలు నియర్బై, లిటిల్ ఇంటర్నెట్లు విలీనమయ్యాయి. ఈ విలీన సంస్థలో కొంత వాటాను ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ కొనుగోలు చేసింది. పేటీఎమ్ ఎంత వాటాను కొనుగోలు చేసిందో, ఎంత పెట్టుబడులు పెడుతుందో ఈ సంస్థలు ఇంకా వెల్లడించలేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విలీన సంస్థలో పేటీఎమ్ 51 శాతం వాటాను రూ.161.45 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ విలీనం కారణంగా లిటిల్ ఇంటర్నెట్ వ్యవస్థాపకుడు మనీష్ చోప్రా, సతీశ్ మణి ఈ విలీన సంస్థ నుంచి వైదొలుగుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నియర్బై–లిటిల్ ఇంటర్నెట్ల విలీనం కారణంగా ఏర్పడే కొత్త సంస్థ భారత్లోనే అతి పెద్ద డీల్స్ సంస్థ కానున్నదని, దీంట్లో 40 వేలకు పైగా వివిధ కేటగిరీ వ్యాపారులు భాగస్వాములుగా ఉన్నారని పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఈ కొత్త డీల్ సంస్థ ద్వారా తమ వ్యాపార భాగస్వాములు మరిన్ని డీల్స్ను అఫర్ చేస్తారని, కొత్త వినియోగదారులు లభిస్తారని వారి వ్యాపారం కూడా వృద్ధి చెందుతుందని వివరించారు.