ఆర్‌బీఐ నగదు నిల్వల నిర్వహణ ఎలా?

Bimal Jalan to head panel on RBI reserve Rakesh Mohan - Sakshi

 బిమల్‌ జలాన్‌ సారథ్యంలో కమిటీ

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న నగదు నిల్వల నిర్వహణపై (ఎకనమిక్‌ కమిటీ ఫ్రేమ్‌వర్క్‌) ఆరుగురు సభ్యుల కమిటీ  ఏర్పాటయ్యింది. బుధవారం ఆర్‌బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వం వహిస్తారు. ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి రాకేష్‌ మోహన్‌ వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆర్‌బీఐ వద్ద నగదు నిల్వలు ఎంత స్థాయిలో ఉండాలన్న అంశంపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ కమిటీలోని సభ్యుల్లో ఉన్నారు. వీరితోపాటు  భరత్‌ దోషి, సుధీర్‌ మన్కడ్‌ కూడా కమిటీలో సభ్యులు. వీరు ప్రస్తుతం ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్ట్‌లో సభ్యులు. సమావేశమయిన నాటి నుంచీ 90 రోజుల్లో నిపుణుల కమిటీ నివేదికను సమర్పిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలించి సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద నిధులు ఏ మేరకు ఉండాలి? మిగిలిన నిధుల బదలాయింపు ఎలా వంటి అంశాలపై కమిటీ నివేదికను రూపొందిస్తుంది.

నేపథ్యం ఇదీ... 
ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవేల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఈ నిధుల్లో భారీ మొత్తాన్ని  ప్రభుత్వం కోరుతోందన్న వార్తలు దేశంలో సంచలనానికి దారితీశాయి. ఈ  నేపథ్యంలోనే డిసెంబర్‌ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్‌ 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది.  

గతంలో కమిటీలు ఇలా... 
గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్‌ కమిటీ  దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్‌బీఐ థోరట్‌ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్‌ కమిటీ సిఫారసు చేసింది.

తయారీ రంగం విక్రయాలు పటిష్టం: ఆర్‌బీఐ 
ఇదిలావుండగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) తయారీ రంగం అమ్మకాలపై ఆర్‌బీఐ బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో తయారీ రంగం విక్రయాలు బాగున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.  ముఖ్యంగా జౌళి, ఇనుము, స్టీల్‌ రంగాలు, కెమికల్, పెట్రోలియం ప్రొడక్టులు, మోటార్‌ వాహనాలు, రవాణా పరికరాలు, ఫార్మా, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాలు మంచి అమ్మకాలను నమోదుచేసినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. 2,700 లిస్టెడ్‌  ప్రైవేట్‌ రంగ నాన్‌–ఫైనాన్షియల్‌ కంపెనీల డేటా విశ్లేషణతో ఈ గణాంకాలు విడుదలయ్యాయి. తయారీ రంగం నికర లాభం 29.4 శాతం వృద్ధితో (గత ఏడాది ఇదే కాలంతో పోల్చి) రూ.47,100 కోట్లుగా నమోదయినట్లు తెలిపింది. కాగా టెలికమ్యూనికేషన్లు, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీయేతర సేవలు నిరుత్సాహం కలిగించినట్లు గణాంకాలు వివరించాయి. కాగా వ్యయాల విషయంలో (ముడి పదార్థాల కొనుగోలు, సిబ్బంది జీత భత్యాలు) తయారీ రంగం కంపెనీలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయని నివేదిక తెలిపింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top