నోటీసుపై సీఎం వివరణ ఇవ్వాలి: వైఎస్సార్‌సీపీ | Ysr congress party demands kiran kumar reddy to clarity on Notice | Sakshi
Sakshi News home page

నోటీసుపై సీఎం వివరణ ఇవ్వాలి: వైఎస్సార్‌సీపీ

Jan 28 2014 3:40 AM | Updated on Jul 29 2019 5:31 PM

నోటీసుపై సీఎం వివరణ ఇవ్వాలి: వైఎస్సార్‌సీపీ - Sakshi

నోటీసుపై సీఎం వివరణ ఇవ్వాలి: వైఎస్సార్‌సీపీ

సరైన గడువు లేదని తెలిసీ ప్రజల ను గందరగోళంలో పడేయాలనే ఉద్దేశంతోనే సీఎం కిరణ్ సమైక్య తీర్మానం నోటీసును ఇచ్చారని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

సాక్షి, హైదరాబాద్: సరైన గడువు లేదని తెలిసీ ప్రజల ను గందరగోళంలో పడేయాలనే ఉద్దేశంతోనే సీఎం కిరణ్ సమైక్య తీర్మానం నోటీసును ఇచ్చారని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కు నిబంధనలు తెలిసినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్  డెరైక్షన్‌లో సమైక్య డ్రామాలు ఆడుతున్నారని మండిపడింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు.
 
  ‘సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మా పార్టీ డిమాండ్ చేసింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ మేం ఇదే పట్టుబట్టాం. అయితే బిల్లు వచ్చినపుడు తీర్మానం చేద్దామని సీఎం దాటవేశారు. బిల్లు రావొచ్చని తెలిసినపుడు, సభ ప్రారంభ సమయంలోనూ చెప్పాం. మా శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ లేఖ సైతం రాశారు. ఆనాడు స్పందించలేదు. పైగా మమ్మల్ని పోలీసులతో అసెంబ్లీ నుంచి గెంటేశారు. సమైక్యాంధ్ర కోసం మేం చేసే పోరాటానికి ఎక్కడమైలేజీ వస్తుందోననే ఉద్దేశంతో సీఎం కిరణ్ ఇదంతా చేశారు. టీడీపీ వారు వారికి వంతపాడుతూ చ ర్చల్లో మేం పాల్గొనకపోవడం ద్రోహం అని విమర్శలు గుప్పించారు.
 
  ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించి ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు. 10 రోజుల గడువు ఉన్నపుడే నోటీసు ఇవ్వాలని సీఎంకు తెలిసినప్పటికీ అంత గడువు లేనప్పుడు నోటీసు ఇచ్చారు. సభాపతిగా పనిచేసిన కిరణ్‌కు నిబంధనలు తెలియవా? సీఎం ఈ అంశంలో వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. మిగతా నోటీసులను పరిగణనలోకి తీసుకునేందుకు నిబంధనలు అనుకూలించకపోయినట్లైతే.. తమ పార్టీ ఇచ్చిన నోటీసు పెండింగ్‌లో ఉన్నందున దాని ప్రకారం తీర్మానం చేయాలని కోరారు. తనకంటే అనుభవజ్ఞుడు లేరని చెప్పుకునే చంద్రబాబు మనసులో రాష్ట్ర విభజన కావాలనే ఉందని కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. విభజన తమ వల్లే జరిగిందని చెప్పుకొని తెలంగాణలో లోకేశ్‌తో ప్రచారం చేయించడం, సమైక్యంగా ఉంచేందుకు పాటుపడ్డామని చెప్పి సీమాంధ్రలో ప్రచారం చేసుకోవాలనే యోచనలో బాబు ఉన్నారని ఆరోపించారు. అయితే ప్రజల్లోకి వెళితే టీడీపీ వారిని తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement